త్వరలో ప్రవేశపెట్టనున్న ప్రతిపక్షాలు..!
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్కుమార్పై రాబోయే రోజుల్లో అభిశంసనా తీర్మానాన్ని ఇండియా బ్లాక్ పార్టీలు ప్రవేశపెట్టే అవకాశం వుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్లమెంట్లో ఆయన కార్యాలయంలో జరిగిన ఇండియా బ్లాక్ సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ నేత శతాబ్ది రారు ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. జ్ఞానేశ్ కుమార్పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు తదుపరి చర్య తీసుకోవడం ప్రతిపక్షాలకు కీలకమని రారు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ సూచనతో ఇతర ప్రతిపక్ష నేతలు కూడా ఏకీభవించారని ఆ వర్గాలు తెలిపాయి. తీర్మానాన్ని తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపాదించనుండగా, తీర్మానం రూపకల్పనపై ప్రతిపక్షాలు కసరత్తు చేస్తున్నాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో ఏ సభలో తీర్మానాన్ని ప్రతిపాదించాలని యోచిస్తున్నారు. ఏ సభలో ప్రవేశపెట్టాలన్న అవసరమైన సంఖ్యాబలం తమకు ఉందని సీనియర్ ప్రతిపక్ష నేత ఒకరు తెలిపారు. బెంగాల్లో ‘సర్’ సందర్భంగా లక్షలాదిగా ఓటర్ల పేర్లు తొలగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ మార్చి 6 నుంచి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసన చేపట్టారని శతాబ్ది రారు ఈ సందర్భంగా చెప్పారు. అయితే గత నెల 28న తుది ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేసింది.
తొలగింపు క్రమం ఇలా…
రాజ్యాంగంలోని 324(5) అధికరణ ప్రకారం, సుప్రీం కోర్టు జడ్జి మాదిరిగానే పార్లమెంటరీ అభిశంసనా తీర్మానం ద్వారా సీఈసీని తొలగించవచ్చు. మూడింట రెండు వంతుల మంది సభ్యులు మద్దతివ్వాల్సి వుంటుంది. రాజ్యసభలో అయితే 50మంది సభ్యులు సంతకాలు చేయాలి, అదే లోకసభలో 100మంది సభ్యులు సంతకాలు చేయాలి. ఎందుకు తొలగించా లని కోరుతున్నారో ఆ కారణాలను ఆ తీర్మానంలో ప్రత్యేకంగా పేర్కొనా లి.తీర్మానాన్ని ప్రతిపాదించిన తర్వాత, సంబంధిత సభాధ్యక్షుడు ఆ ఆరోపణలపై దర్యాప్తునకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాల్సి వుంటుంది. సీఈసీపై వచ్చిన ఆరోపణలు సరైనవేనని కమిటీ నిర్ధారించినట్లైతే ఆ కమిటీ నివేదికపై ఓటింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఉభయ సభల్లో తీర్మానం మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోద ముద్ర పొందాలి. ఉభయ సభలు ఆమోదించిన తర్వాత తొలగింపునకు తుది ఉత్తర్వులను రాష్ట్రపతి జారీ చేస్తారు.



