– టీజీఐఐసీ సమీక్షలో సీఎస్ రామకృష్ణారావు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతి కోసం తెలంగాణ ఇండిస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ద్వారా చేపడుతున్న పనుల్ని మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికారుల్ని ఆదేశించారు. టీజీఐఐసీ చేపడుతున్న వివిధ మౌలిక సదుపాయాల పనుల పురోగతిపై సోమవారంనాడిక్కడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ కే శశాంక ప్రాజెక్టుల వారీగా ఆయా పనుల వివరాలు వెల్లడించారు. జహీరాబాద్లోని ప్రతిపాదిత ఇండిస్టియల్ స్మార్ట్ సిటీ, వరంగల్ సమీపంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, మెగా ఇండిస్టియల్ హబ్ల అభివృద్ధి పనులు, ఫార్మా క్లస్టర్లు, ప్రతిపాదిత భారత్ ఫ్యూచర్ సిటీ సహా పలు ప్రధాన పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిపై ఈ సమావేశంలో వివరంగా చర్చించారు. మొత్తం పెట్టుబడులు, గ్రౌండింగ్ చేయబడిన ప్రాజెక్టుల సంఖ్య, పారిశ్రామిక పార్కులు, క్లస్టర్ల ద్వారా ఉత్పన్నమయ్యే ఉపాధి వంటి అంశాలపై పూర్తిస్థాయి డిజిటల్ డాష్బోర్డ్ను అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా రామకృష్ణారావు అధికారుల్ని ఆదేశించారు. దీనివల్ల ఆయా పనుల సమీక్ష మరింత సులభతరమవుతుందని సూచించారు. జహీరాబాద్లో ప్రతిపాదిత ఇండిస్టియల్ స్మార్ట్ సిటీలో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని చెప్పారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వల్ల ఆ ప్రాంతంలోని యువతకు పెద్దఎత్తున ఉపాధిని కల్పించే అవకాశాలు ఏర్పడతాయనీ, సాధ్యమైనంత త్వరగా ఆ పనుల్ని పూర్తిచేయాలని ఆదేశించారు. కొన్ని పనుల్లో జాప్యం జరగడానికి ఇతర శాఖలు సకాలంలో స్పందించట్లేదని అధికారులు సీఎస్ దృష్టికి తీసుకొచ్చారు. ఏఏ విభాగాల మధ్య ఏఏ పనులకు సమన్వయం అవసరం అనే విషయాలను ప్రస్తావిస్తూ నోట్ను సిద్ధం చేయాలరీ సందర్భంగా సీఎస్ అదేశించారు. పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేయడానికి కాలవ్యవధి నిర్ణయించుకోవాలనీ, పరిశ్రమలకు భూ కేటాయింపులను పారదర్శకంగా, ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లతోపాటు టీజీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.
పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



