నవతెలంగాణ – హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని వేలాది ఆలయాల్లో ఆషాఢ బోనాల జాతర కోలాహలంగా ప్రారంభమైంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు, భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నాడు హైదరాబాద్లో ఈ వేడుకలు ఘనంగా అంకురార్పణ చేసుకున్నాయి.
బోనాల పండుగ సామాజిక ఐక్యతకు నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్లను కేటాయించిందని ఆయన వెల్లడించారు. ఆలయ ప్రాంగణాల్లో పారిశుధ్యం, తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య సేవలతో పాటు పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు.



