– కామారెడ్డి పట్టణ ఆరె కటిక సంఘం
నవతెలంగాణ – కామారెడ్డి
దేశ రాజధాని న్యూఢిల్లీ లో దళిత యువకుడు తరుణ్ కటిక్ దారుణ హత్యను ఖండిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం పట్టణ ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సంఘం సభ్యులు కొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తూ తరుణ్ కటిక్కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ హోలీ పండుగ రోజు మతన్మాదుల చేతిలో ఒక నిరపరాధ దళిత యువకుడు అమానుషంగా హత్యకు గురవడం అత్యంత దుర్మార్గమైన ఘటన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. తరుణ్ కటిక్ ను హత్య చేసిన నిందితులందరినీ వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించడంతో పాటు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. తరుణ్ కుటుంబానికి తక్షణమే న్యాయం చేసి తగిన ఆర్థిక సహాయం అందించడంతో పాటు పూర్తి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆరె కటిక సంఘం ప్రతినిధులు కొత్తిమీరకర్ వినయ్ కుమార్, అడ్మన్కర్ రతన్, నర్సింగ్, రవి, చోటు, గణేష్, విజయ్, క్రాంతి, గోపి, విట్టల్ తదితరులు పాల్గొన్నారు.


