నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అమలు చేస్తున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం జిల్లా పంచాయతీ అధికారి (DLPO) శ్రీనివాస్ కామారెడ్డి మండలంలోని ఉగ్రవాయి గ్రామపంచాయతీ, బిక్నూర్ మండలంలోని బిక్నూర్ గ్రామపంచాయతీలను సందర్శించారు.
ఈ సందర్భంగా గ్రామపంచాయతీలు నిర్వహిస్తున్న నర్సరీలను పరిశీలించి నిర్వహణ పనులపై అధికారులకు సూచనలు చేశారు. నర్సరీల్లో మెయింటెనెన్స్ పనులను చేపట్టడం, గ్రీన్ షేడ్ (షేడ్ నెట్) ఏర్పాటు చేయడం, ఖాళీగా ఉన్న పాలీబ్యాగుల్లో విత్తనాలు నాటడం ద్వారా 100 శాతం మొలకెత్తేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో సంచరిస్తున్న వీధి కుక్కలను సర్వే ద్వారా గుర్తించి వాటికి వ్యాక్సినేషన్ చేయడం, స్టెర్లైజేషన్ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే జాతీయ రహదారులు 44, 161 పై ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించే కార్యక్రమాన్ని కూడా చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బిక్నూర్ గ్రామపంచాయతీలో షేడ్ నెట్ ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శికి డీఎల్పీవో శ్రీనివాస్ సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిక్నూర్, కామారెడ్డి మండలాల ఎంపీడీఓలు హెప్సీబా రాణి తదితరులు పాల్గొన్నారు.



