ఉత్తమ అరంగేట్ర ప్లేయర్గా శ్రీ చరణి
శుభ్మన్కు పాలీ ఉమ్రిగర్
ఢిల్లీలో నేడు అవార్డుల ప్రదానం
ముంబయి: భారత క్రికెట్ కంట్రోల్బోర్డు(బీసీసీఐ) ప్రతి ఏడాది ఉత్తమ క్రికెటర్లకు అందజేసే నమన్ అవార్డులను ప్రకటించింది. 2024-25 ఏడాదికి సికె నాయుడు జీవిత సాఫల్య అవార్డుతోపాటు ఇతర అవార్డులకు ఎంపికైన ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐ శనివారం ప్రకటించింది. టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రోజర్ బిన్నీతోపాటు మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్లకు సికె నాయుడు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులకు, శుభ్మన్ గిల్కు పాలీ ఉమ్రిగర్ అవార్డుకు, శ్రీ చరణి, హర్షిత్ రాణా ఉత్తమ అరంగేట్రం క్రికెటర్లుగా ఎంపికయ్యారు. ఆదివారం న్యూఢిల్లీలో జరిగే బీసీసీఐ కార్యక్రమంలో వీరందరికీ అవార్డులు అందజేయనున్నారు. రోజర్ బిన్నీ 1983 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసి
భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అలాగే, అతని కోచింగ్లో 2000లో అండర్-19 జట్టు వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాత 2012-16 వరకు జాతీయ సెలెక్టర్గా, 2022 నుంచి 2025 వరకు బీసీసీఐ అధ్యక్షుని ఉన్నారు. ‘ది వాల్’గా గుర్తింపు పొందిన రాహుల్ ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్లో 24,000 పరుగులు చేశాడు. బీసీసీఐ నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) హెడ్గా యువ క్రికెటర్లను తయారు చేశాడు. ప్రస్తుతం భారత జట్టు మూడు ఫార్మాట్లలో వేర్వేరు టీమ్లతో ఆడే సామర్థ్యం కలిగి ఉందంటే ఒకరకంగా ద్రవిడే కారణం.
అలాగే, ద్రవిడ్ 2021-24 వరకు టీమిండియా హెడ్ కోచ్గా ఉండగా.. అతని హయాంలోనే భారత జట్టు 17 ఏళ్ల తర్వాత టి20 ప్రపంచ కప్ కైవసం చేసుకుంది. ఇక, హైదరాబాద్కు చెందిన మిథాలీ రాజ్ భారత మహిళా క్రికెట్కు గుర్తింపు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. సుదీర్ఘ కాలం జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆమె దాదాపు 18ఏళ్ల పాటు భారత మహిళాజట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు. వన్డేల్లో 7,805 పరుగులు చేసిన తొలి రికార్డు ఆమె పేరిటే ఉంది. ఆమె కెప్టెన్సీలో భారత జట్టు రెండుసార్లు వన్డే ప్రపంచకప్ కప్ ఫైనల్స్కు చేరింది.
అరంగేట్రంలోనే సత్తాచాటిన శ్రీ చరణి
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎడమచేతి వాటం స్పిన్నర్ శ్రీ చరణి గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. అద్భుత ప్రదర్శన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్కు భారతజట్టులో చోటు సంపాదించింది. అలాగే భారత జట్టు ప్రపంచకప్ గెలవడంలో శ్రీ చరిణి పాత్రను మరువలేం. 9 మ్యాచుల్లో 14 వికెట్లు తీసి తనవంతు పాత్రను దిగ్విజయంగా పూర్తి చేసింది. అలాగే ద్వైపాక్షిక సిరీస్ల్లోనూ మెరిసింది.
దీంతో శ్రీ చరణి బీసీసీఐ అరంగేట్రం ఉత్తమ మహిళా క్రీడాకారిణి అవార్డుకు ఎంపికైంది. పురుషుల విభాగంలో పేసర్ హర్షిత్ రాణా ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. దేశవాళీ క్రికెట్లో ఆల్రౌండర్లకు ఇచ్చే లాలా అమర్నాథ్ అవార్డు ఆయుశ్ మాత్రే(పరిమిత ఓవర్లు), హర్ష్ దూబె(రంజీ ట్రోఫీ) గెలిచారు. పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి ముంబయి జట్టు నాలుగు టైటిల్స్ గెలవగా.. ముంబయి క్రికెట్ అసోసియేషన్కు బిసిసిఐ అవార్డు వరించింది.




