Monday, March 16, 2026
E-PAPER
Homeమానవిమెనోపాజ్‌ త‌ర్వాత‌..

మెనోపాజ్‌ త‌ర్వాత‌..

- Advertisement -

మెనోపాజ్‌ అనేది ప్రతి మహిళ జీవితంలో ఒక సహజమైన దశ. సాధారణంగా 45 నుంచి 55 ఏండ్ల మధ్య వచ్చే ఈ దశలో వేడి ఆవిర్లు, రాత్రిపూట చెమటలు, క్రమం లేని పీరియడ్స్‌, యోని పొడిబారడం, నిద్ర సమస్యలు, మానసిక స్థితిలో మార్పులు, మతిమరుపు వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, హార్మోన్ల మార్పుల వల్ల ఎముకల సాంద్రత తగ్గడం, కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతుందంటున్నారు. కేవలం ఇవి మాత్రమే కాకుండా మెనోపాజ్‌ తర్వాత క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో మెనోపాజ్‌ దశలో ఎలాంటి క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం!

వయసు పెరగడం, హార్మోన్ల మార్పుల వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ దశలో శరీరంలో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్ల స్థాయిలు గణనీయంగా తగ్గిపోతాయి. ఈ హార్మోన్ల మార్పులు కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పును ప్రభావితం చేస్తాయని, ముఖ్యంగా రొమ్ము , గర్భాశయ లోపలి పొర, అండాశయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. అదే సమయంలో వయసు పెరగడం అనేది క్యాన్సర్‌కు ఒక బలమైన ప్రమాద కారకమంటున్నారు. ఎందుకంటే, వయసుతో పాటు దెబ్బతిన్న కణాలను బాగుచేసుకునే సామర్థ్యం శరీరంలో క్రమంగా తగ్గుతుందని తెలియజేస్తున్నారు. రుతువిరతి అండాశయ క్యాన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతుందని నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ మెడిసెన్‌ అధ్యయనం అంటుంది.

సాధారణ క్యాన్సర్లు
రొమ్ము క్యాన్సర్‌
మెనోపాజ్‌ తర్వాత మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో ఇది అత్యంత సాధారణమైనది. కుటుంబ చరిత్ర, అధిక బరువు, మద్యపానం, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాల వల్ల దీని ముప్పు పెరుగుతుందంటున్నారు నిపుణులు.
గర్భాశయ క్యాన్సర్‌
మెనోపాజ్‌ తర్వాత ఇది కూడా తరచుగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, అధిక బరువు ఉన్నవారిలో లేదా డయాబెటిస్‌ వంటి సమస్యలు ఉన్న మహిళల్లో ఈ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలియజేస్తున్నారు. ముందస్తు రుతువిరతి (45 ఏళ్లలోపు) గర్భాశయ, అండాశయ, గర్భాశయ క్యాన్సర్‌ ప్రమాదాలను గణనీయంగా పెంచుతుందని నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ మెడిసెన్‌ అధ్యయనం పేర్కొంది.
పేగు క్యాన్సర్‌
వయసు పెరిగే కొద్దీ పేగు క్యాన్సర్‌ వచ్చే ముప్పు పెరుగుతుందట. అందుకే వయసు మళ్లిన వారు క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
జీవనశైలికి సంబంధించిన అంశాలు
రుతుక్రమం ఆగిపోయిన తర్వాత బరువు పెరగడం వల్ల క్యాన్సర్‌ ప్రమాదం పెరుగుతుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే, కొవ్వు కణజాలం తక్కువ మొత్తంలో ఈస్ట్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించవచ్చని సలహా ఇస్తున్నారు. అలాగే క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను తగ్గించడానికి మద్యపానాన్ని పరిమితం చేయడం, ధూమపానం మానేయడం మేలంటున్నారు.
స్క్రీనింగ్‌, హెచ్చరిక సంకేతాలు
రొమ్ము క్యాన్సర్‌, పేగు క్యాన్సర్‌ కోసం చేసే స్క్రీనింగ్‌ పరీక్షలు ప్రాణాలను కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో కనిపించే హెచ్చరిక సంకేతాలను ఎప్పుడూ విస్మరించవద్దంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మెనోపాజ్‌ తర్వాత అసాధారణంగా యోని నుంచి రక్తస్రావం కావడం, ఆహారపు అలవాట్లలో మార్పులు లేకపోయినా కడుపు ఉబ్బరంగా ఉండటం, నిరంతరం అజీర్తి సమస్యలు వేధించడం లేదా ఆకస్మికంగా బరువు పెరగడం లేదా తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సలహా ఇస్తున్నారు.
నియంత్రణ ఉండాలి
కుటుంబ నేపథ్యం కారణంగా క్యాన్సర్‌ వస్తుందని కచ్చితంగా చెప్పలేమంటున్నారు నిపుణులు. శరీరం ఆరోగ్యం గురించి అవగాహన పెంచుకోవడం, ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం, వైద్యులతో సంప్రదించడం ద్వారా మహిళలు క్యాన్సర్‌ ప్రమాదాలను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -