10 మంది రోగులు మృతి
ఎస్సీబీ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో ఘటన
మరో 11 మందికి గాయాలు
రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం
కటక్: ఒడిశాలోని కటక్ ఎస్సీబీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది రోగులు మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున 2:30 నుంచి 3 గంటల సమయంలో ఐసీయూలోని ట్రామా కేర్ డిపార్ట్మెంట్లో తొలుత మంటలు చెలరేగాయి.
అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు, రోగుల బంధువుల సహాయంతో ఐసీయూలో ఉన్న రోగులను ఇతర వార్డులకు తరలించారు. ఈ ప్రక్రియలో మొత్తం 23 మంది రోగులను ఇతర విభాగాలకు మార్చారు. రోగులను రక్షించే ప్రయత్నంలో 11 మంది ఆస్పత్రి సిబ్బందికి గాయాలు అయినట్టు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదంలో ఏడుగురు రోగులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు ఇతర వార్డులకు తరలించే సమయంలో కాలిన గాయాలు లేదా ఊపిరి ఆడక మరణించారు.
షార్ట్ సర్క్యూట్ కారణమనే అనుమానం
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆరోగ్య శాఖ మంత్రి ముకేశ్ మహాలింగ్తో కలిసి ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. అనంతరం విలేకర్లుతో మాట్లాడుతూ, ఈ ప్రమాదం షార్ట్ సర్య్కూట్ కారణంగా జరిగి ఉండొచ్చని తెలిపారు. ఐసీయూ, పక్కనున్న వార్డులు కూడా ఈ అగ్ని ప్రమాదానికి ప్రభావితమయ్యాయని ఆయన చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశించినట్టు చెప్పారు.



