జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జనాభా గణన-2027 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు, ఛార్జ్ అధికారులు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. మంగళవారం చివరి రోజు జనాభా గణన–సెన్సెస్ 2027కు సంబంధించి చార్జి అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని రెండు దశల్లో నిర్వహించే గణనను సమగ్రంగా చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జనాభా గణనను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. హౌస్ లిస్టింగ్ ను కచ్చితంగా చేసినట్లయితే సెన్సెస్ పూర్తి అయినట్లే అని అన్నారు.
బ్లాక్ ల వారీగా ఏర్పాటు చేసుకొని సులభతరంలో సెన్సెస్ చేయాలన్నారు. ప్రతి దశను క్షేత్రస్థాయిలో, పారదర్శకంగా సెన్సెస్ నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. జనాభా గణన సెన్సెస్ -2027 ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, సమగ్ర సమాచారం సేకరణపై దృష్టి పెట్టాలని అన్నారు .ప్రభుత్వం చేపడుతున్న ఈ మహత్తర కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి అధికారి తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు. డిజిటల్ విధానంలో జరగనున్న ఈ ప్రక్రియలో ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని చేర్చడంతో వారి వివరాలను తప్పకుండా నమోదు చేయాలన్నారు.
అలాగే, ప్రజల సహకారం కూడా అత్యంత కీలకమని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి జనాభా గణనకు ప్రజలను చురుకుగా భాగస్వాములను చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, మరియు జిల్లా గణాంక అధికారివెంకటరమణ,మున్సిపల్ కమిషనర్లు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



