నవతెలంగాణ – ఉప్పునుంతల
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, వి.బి.జి రాంజీ బిల్లును వెంటనే రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చింతల నాగరాజు డిమాండ్ చేశారు. మంగళవారం కంసానిపల్లీ గ్రామంలో ఉపాధి హామీ పనుల ప్రదేశాన్ని సందర్శించిన ఆయన కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పథకం జీవనాధారంగా మారిందని, దీన్ని బలహీనపరిచే విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. అలాగే పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ, వైద్య సదుపాయాలు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
కూలీలతో చర్చించిన ఆయన, వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు చెన్నయ్య, రామచంద్రం, లక్ష్మయ్య, ఇందిరమ్మ, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.



