– ఉద్దేశపూర్వకంగానే నిధుల కేటాయింపుపై వివక్ష : ప్రముఖ వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
– పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్న కేంద్రం :ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి సాగర్
– దేశవ్యాప్తంగా కుల వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలు : ఎస్ఎఫ్ఐ అఖిలభారత సహాయ కార్యదర్శి మహమ్మద్ అతిక్
– పీయూలో ఉత్సాహంగా యూనివర్సిటీల కన్వెన్షన్ ప్రారంభం
నవతెలంగాణ -మహబూబ్నగర్
ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రను తిప్పికొడుతూ విద్యార్థి లోకమంతా ముందుకు వచ్చి పోరాటాలు చేయాలని ప్రముఖ వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పిలుపునిచ్చారు.ఎస్ఎఫ్ఐ రాష్ట్ర యూని వర్సిటీల కన్వెన్షన్ రెండ్రోజుల కార్యక్రమం మంగళవారం పాలమూరు యూనివర్సిటీలో ప్రారంభమైంది.ముందుగా యూనివర్సిటీలో విద్యా ర్థులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కన్వెన్షన్లో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ప్రసంగిస్తూ.. దేశంలో ప్రభుత్వ యూనివర్సిటీలను కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉందన్నారు. రాబోయే రోజుల్లో విద్యారంగంలో మరిన్ని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని, వాటిపై సంఘటితంగా పోరాడాలని వివరించారు. చదువే ఉన్నత శిఖరాలకు చేరవేస్తుందని, అధ్యయనం పోరాటం అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఉద్దేశపూర్వకంగానే విశ్వ విద్యాల యాలకు నిధులు కేటాయించకుండా.. నియామకాలు చేపట్టకుండా.. కొత్త కోర్సులు ప్రవేశ పెట్టకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ ఏర్పడినప్పటి నుంచి నిత్యం విద్యార్థుల సమస్యలను గుర్తించి పోరాడిన చరిత్ర ఉందన్నారు. వెనుకబడిన పాలమూరు లాంటి జిల్లాలో రాష్ట్రస్థాయి విద్యార్థులను ఇక్కడికి రప్పించి కన్వెన్షన్ పేరుతో సమస్యలపై చర్చించి ప్రణాళిక రూపొందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ప్రతి యూనివర్సిటీలో రోహిత్ చట్టం అమలు చేయాలి : మహమ్మద్ అతిక్
దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో రోహిత్ చట్టం అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి మహమ్మద్ అతిక్ డిమాండ్ చేశారు. ప్రతి యూనివర్సిటీలోనూ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విద్యార్థుల మధ్య కులచిచ్చు రగిలిస్తూ ఘర్షణలను ప్రోత్సహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులను చైతన్యం చేసి కుల, మత రాజకీయాలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పారు. ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆమంచి నాగేశ్వర్ మాట్లాడుతూ.. దేశంలో ఉన్నత విద్య ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రజనీకాంత్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర యూనివర్సిటీల కన్వీనర్ మమత, రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్ మాట్లాడారు. విద్యారంగంలో నెలకొన్న అనేక సమస్యలపై పోరాడుతామని చెప్పారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి యూనివర్సిటీకీ రూ.1000 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనాథ్, భరత్, పాలమూరు యూనివర్సిటీ యూనిట్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు రాము, రాజేష్, జిల్లా ఉపాధ్యక్షులు నందు, జిలా కమిటీ సభ్యులు ఈశ్వర్ సాయి, నవ్య, జ్ఞాపిక, సాయి, శేఖర్, సుధాకర్, రాకేష్, వినోద్, హేమలత పాల్గొన్నారు.
విద్యార్థి ఉద్యమాలే ప్రజాస్వామ్య పోరాటాలకు ఊపు : టి.సాగర్
దేశంలో ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయకుండా కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు యూనివర్సిటీలకు ఆజ్యం పోస్తోందని ఎస్ఎఫ్ఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి టి.సాగర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిర్వహించిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా యూనివర్సిటీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయిస్తామన్న ప్రకటనలు ఇంకా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలలో ఎస్ఎఫ్ఐ ఎంత బలంగా ఉద్యమాలు నిర్మిస్తే ప్రజాస్వామ్య ఉద్యమాలకు అంత ఊపొస్తుందని చెప్పారు. శాస్త్రీయ ఆలోచన విధానాలపై విశ్వవిద్యాలయంలో విస్తృతంగా చర్చ జరగాలని, విద్యార్థులలో అలాంటి మార్పు రావడం కోసం కృషి చేయాలని సూచించారు.



