Thursday, March 19, 2026
E-PAPER
Homeఎడిట్ పేజితెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌-విద్యారంగం ప్రాధాన్యత

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌-విద్యారంగం ప్రాధాన్యత

- Advertisement -

రాష్ట్ర 2026-27 బడ్జెట్‌ను మార్చి 20వ తారీఖున అసెంబ్లీలో ప్రవేశపెడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉభయసభల బిజినెస్‌ అడ్వైజరీ కమిటీల సమావేశాల్లో నిర్ణయించినట్లు మీడియాలో చూశాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరం (2014-15) పాలకులు బడ్జెట్‌లో విద్యారంగానికి 10.89 శాతం కేటాయించారు. తర్వాత క్రమంగా కోతపెడుతూ 2023-24 వచ్చేసరికి బడ్జెట్‌లో 6.5శాతం తగ్గించారు. ప్రస్తుత ప్రభుత్వంలో 2024-25 బడ్జెట్‌లో 7.7శాతం, 2025-26 బడ్జెట్‌లో 7.9శాతం స్వల్పంగా పెరిగింది. ఈ సంవత్సర బడ్జెట్‌లో విద్యకు 18 శాతమా, 15 శాతమా లేక 8 శాతానికే పరిమితమవుతుందా? అనేది తెలంగాణ ప్రజల్లో రేకెత్తిన ప్రశ్న. తెలంగాణ విద్యా కమిషన్‌ రిపోర్ట్‌లో విద్యకు 18 శాతం కేటాయించాలని సూచించారు. 2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో విద్యకు 15 శాతానికి తగ్గకుండా కేటాయిస్తామని హామీనిచ్చారు. ఈ రెంటిలో ఏదైనా ఒక దానికి కట్టుబడి బడ్జెట్‌లో కెేటాయింపులు ఉండాలనేది ప్రజల ఆకాంక్ష. గత రెండేండ్ల కేటాయింపుల ప్రకారమైతే 8 శాతానికి అటూఇటుగా ఉండొచ్చని ఒక అంచనా.

స్వయాన ముఖ్యమంత్రియే విద్యాశాఖను నిర్వహిస్తున్నారు. అనేక సందర్భాలలో ‘ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్టు’ ప్రస్తావించారు. ఇప్పటివరకైతే విద్యారంగం విషయంలో మాటలే వినిపిస్తున్నాయి తప్ప చేతలు కనిపించడం లేదు. నా ఉద్దేశంలో కూడా ప్రస్తుత ప్రభుత్వానికి ”మాటల కాలం అయిపోయింది- ఇక చేతల కాలం మాత్రమే మిగిలి ఉన్నది”. చేతలు కార్యరూపం దాల్చాలంటే అందుకు అవసరమైన బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలి. భారతదేశ రాష్ట్రాలలో విద్యలో సింహభాగం ప్రయివేటు రంగంలోకి పోయిన రాష్ట్రాలలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. తెలంగాణ కంటే ప్రయివేట్‌ రంగంలో విద్య ఎక్కువగా ఉన్న ఒకే ఒక రాష్ట్రం మేఘాలయ. అది చాలా చిన్నరాష్ట్రం. మిగిలిన రాష్ట్రాలన్నీ ప్రభుత్వ విద్యా రంగంలో తెలంగాణకంటే ముందున్నాయి. ప్రభుత్వ విద్యను అందించడంలో కేరళ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్నది. కేరళ రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు అనేక సంవత్సరాలుగా 18 నుండి 24 శాతం మధ్య కేటాయిస్తున్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించడంలో, నాణ్యమైన విద్యనందించడంలో కేరళ రాష్ట్రం ముందున్నది.

ఢిల్లీ రాష్ట్రంలో ఆప్‌ ప్రభుత్వ పాలనలో విద్యకు ఇరవై శాతానికి పైగా కేటాయించడం వలన, అక్కడ ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన స్థితిలో ఉండి నాణ్యమైన విద్యనందిస్తున్నాయి. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు కూడా విద్యకు బడ్జెట్‌లో ఎక్కువ కేటాయింపులు చేయడం వలన మెరుగైన ప్రభుత్వ విద్యను కలిగి ఉన్నాయి. పైన చెప్పిన రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కావడానికి బడ్జెట్‌ కేటాయింపులే నిదర్శనం. తెలంగాణలో కూడా విద్యా రంగానికి అధిక నిధులు కేటాయిస్తేనే అభివృద్ధి సాధ్యం. తెలంగాణ విద్యా కమిషన్‌ రిపోర్ట్‌లో ప్రస్తుతమున్న ప్రభుత్వ/ జిల్లా పరిషత్‌ పాఠశాలలను ‘తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌’గా అభివృద్ధి చేయాలని రెకమెండ్‌ చేశారు. రిపోర్ట్‌ అందజేసిన సందర్భంలో ముఖ్యమంత్రి వంద మండలాలలో 200 పాఠశాలలను తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌గా వచ్చే విద్యా సంవత్సరం (2026-27)లో అభివృద్ధి చేద్దామన్నట్లు విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి మీడియా ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

ఒక స్కూలుకు రూ.15 కోట్ల చొప్పున 200 స్కూల్స్‌ నందు మూడు వేల కోట్లు అదనంగా కేటాయించాలి. ఈ మొత్తాలను కలుపుకున్నప్పుడు విద్యకు 15 నుండి 18శాతం వరకు కేటాయించాలి. పైవన్నీ అవసరం లేదనుకుంటే 8శాతం కేటాయింపులతో ప్రస్తుత స్థితిలో ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వహించవచ్చు. ఇపుడున్న స్థితిలోనే ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వహిస్తే, అడ్మిషన్స్‌ ఇంకనూ తగ్గే అవకాశం ఉంటుంది. రాబోయే దశాబ్ద కాలంలో ప్రభుత్వ విద్యాసంస్థలు నామమాత్రంగా మిగులుతాయి. ఈ బడ్జెట్‌ నుండే విద్యకు కేటాయింపులు పెంచి, పాఠశాలల నుండి యూనివర్సిటీల వరకు అభివృద్ధి చేసినప్పుడు మాత్రమే ప్రభుత్వ విద్యా సంస్థలు నిలబడతాయి. అసమానతలు లేని విద్యను విద్యార్థులకు అందించబడుతుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు(2014-15) సంవత్సరంలో 26వేలకు పైగా ప్రభుత్వ/ జిల్లా పరిషత్‌/ మండల పరిషత్‌ ప్రాథమిక/ ప్రాథమికోన్నత/ ఉన్నత పాఠశాలల్లో 24 లక్షల విద్యార్థుల ఎన్రోల్మెంట్‌ ఉన్నది. ఈ పాఠశాలల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన, గత సంవత్సరం పైపాఠశాలల్లో ఎన్రోల్మెంట్‌ 16 లక్షలకు తగ్గింది. 2014-15లో ఐదు రకాల రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ 268 మాత్రమే. గత ప్రభుత్వ కాలంలో ఈ సంఖ్య వెయ్యికి పెరిగింది. రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా ఎన్రోల్మెంట్‌ కూడా పెరిగింది. 700 పైగా కొత్త రెసిడెన్షియల్‌ స్కూళ్లను అద్దె భవనాలలోనే ప్రారంభించారు.

ఇప్పటికీ 655 రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ అద్దె భవనాలలోనే నిర్వహించబడుతున్నాయి. అద్దె భవనాలలో నిర్వహించబడే రెసిడెన్షియల్‌ స్కూళ్ల కొరకే ”యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌” భవనాలు వంద అసెంబ్లీ నియోజక వర్గాలలో నిర్మిస్తున్నామని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఇవి కొత్త బడులు కావు. ప్రయివేట్‌ స్కూళ్లలో చదువుతూ, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాల విద్యార్థులకు ఉపశమనం కలగాలంటే, ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, గిరిజన సంక్షేమ పాఠశాలలను అభివృద్ధి చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.

గత రెండు దశాబ్దాలనుండి ప్రయివేటు పాఠశాలలు ప్రీ ప్రైమరీ తరగతులను నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు లేకపోవడం వలన, తల్లిదండ్రులు అప్పులు చేసి, అధిక భారాలను భరించి తమ పిల్లలను ప్రయివేటు పాఠశాలల్లో చదివించారు. 2020 వరకు రెండు సంవత్సరాల (ఎల్‌కేజీ, యూకేజీ) ప్రీ ప్రైమరీ విద్య మాత్రమే ఉండేది. కేంద్ర ప్రభుత్వం 2020 నూతన విద్యా విధానంలో మూడేళ్ల (నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ) ప్రీ ప్రైమరీ విద్యను ప్రతిపాదించటతో, ప్రయివేట్‌ స్కూల్స్‌ మూడు సంవత్సరాల ప్రీ ప్రైమరీ విద్యను అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య అమలు కోసం ఎటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టలేదు. కొఠారి కమిషన్‌ కేంద్ర బడ్జెట్‌లో విద్యకు పది శాతం కేటాయించాలని సిఫారసు చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో విద్యకు కేటాయింపులు క్రమంగా కుదించడం వలన, కేటాయింపులు 2.5 శాతానికి తగ్గించబడ్డాయి.

ఈ తగ్గింపులు ఎన్‌ఈపీ-2020 అమలు ద్వారా విద్యను సాధ్యమైన మేరకు ప్రయివేటుపరం చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ దారిలో వెళితే తెలంగాణలో ప్రభుత్వ విద్యారంగం ఇక మిగిలే అవకాశమే ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన విధానాలతో ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికలను తయారు చేయించి, అమలు కోసం అవసరమైన నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలాకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తలా,తోక లేని పథకాలను అమలు చేస్తే ఉపయోగముండదు. పీఎం శ్రీ పాఠశాలల పథకం నిష్ప్రయోజనంగా కొనసాగుతున్నది. కేంద్రం ఇస్తున్న నిధులు ఆయా పాఠశాలల అవసరాలు, విద్యార్థుల అవసరాలు తీర్చడానికను గుణంగా నిబంధనలు లేవు. నిబంధనల బంధనాల వలన నిధులు ఖర్చు పెట్టలేని స్థితి ఏర్పడినది. పాఠశాల విద్యాశాఖ చోద్యం చూస్తున్నది.

బడ్జెట్‌ అంటే అంకెలు కాదు, అంకెల గారడి ఏమాత్రం కాదు. సంవత్సర కాలంలో వచ్చే ఆదాయం, చేసే ఖర్చులను శాస్త్రీయంగా వివరించేది. ఏయే వనరుల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, ఏయే పద్దుల కింద ఎంత ఖర్చు చేస్తారో ప్రతిపాదిస్తూ చట్టసభలలో ఆమోదించేది బడ్జెట్‌. గతేడాది బడ్జెట్‌ను కూడా సమీక్షించే అవకాశం ఉంటుంది. వస్తుంద నుకున్నా ఆదాయం ఎందుకు రాలేదు, తగ్గుదలకు కారణాలేమిటో సమీక్షించుకోవాలి. చేసామనుకున్న ఖర్చుల లో ఎందుకు తేడా వచ్చింది, వచ్చిన తేడా అవసరమైనదేనా లేక అనవసర ఖర్చులు నివారించలేకపోయారా అనే అంశాలను కూడా నిర్ధారించుకోవాలి. శాఖల వారిగా కూడా జమలు, ఖర్చులపై నిర్ధారణలు ఉండాలి. దీనిలో విద్యా రంగంపై కొన్ని అంశాలు పరిశీలిద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. జీరో ఎన్రోల్మెంట్‌ పాఠశాలలు ఎందుకు పెరుగుతున్నాయి? పది లోపే విద్యార్థులు ఉన్న పాఠశాలలు వేల సంఖ్యలో ఉంటున్నాయి.

కారణాలేమిటో విద్యాశాఖ నిర్ధారించుకోవాలి. జీరో ఎన్రోల్మెంట్‌ పాఠశాలలున్న ఆవాసాలు/ గ్రామాలలో బడీడు పిల్లలున్నారా? లేరా? ఉంటే ఏ పాఠశాలలకు వెళుతున్నారు. ఆ ఆవాసం/ గ్రామంలో బడి అవసరం ఉన్నదా? లేదా? అనే అంశాలను నిర్ధారించుకోవాలి.గత పదేళ్లకాలంలో ఎటువంటి నిర్ధారణలు చేయలేదు. మీ చేతకానితనం వల్లనే ప్రభుత్వ బడులు మూతపడ్డాయని ప్రతిపక్షం, పాలక పక్షాన్ని నిందిస్తున్నది. పాలకపక్షం మూతబడిన బడులను తెరిపిస్తా మని హామీనిస్తుంది, ఇదొక తంతుగా కొనసాగుతుంది. కానీ, ఏ రాజకీయ పక్షం ప్రభుత్వ బడుల అభివృద్ధికి నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేస్తున్న పరిస్థితి లేదు. హైదరాబాద్‌ రెవెన్యూ జిల్లాలో 82శాతం విద్యార్థులు ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ జిల్లాలో 500 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 182 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 9 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి.

400 పైగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు భవనాలు లేవనేచెప్పాలి. కమ్యూనిటీ హాల్స్‌లో, అద్దెభవనాలలో ఈ పాఠశాలలు నిర్వహించబడుతున్నాయి. ఇటువంటి వసతి గల పాఠశాలలకు ఏ తల్లిదండ్రులు తమ పిల్లలను పంపిస్తారు. లోక్‌భవన్‌ ప్రాంగణంలోని ప్రభుత్వ పాఠశాలకు అన్నిరకాల వసతులుండుటవలన, ఆ పాఠశాలకు అడ్మిషన్ల వెల్లువ కొనసాగుతోంది. నల్లగొండ జిల్లా కేంద్రంలో స్థానిక మంత్రివర్యులు ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు తమ ట్రస్టు ద్వారా అన్ని వసతులతో కూడిన మంచి భవనాన్ని నిర్మించడం వలన ఆ పాఠశాలకు వచ్చే విద్యా సంవత్సరానికి (2026-27) అడ్మిషన్స్‌కావాలని వందల సంఖ్యలో తల్లిదండ్రులు సంప్రదిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా, మంచాల మండలంలోని ఆరుట్లలో ఇప్పటికే ఉన్న మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ పాఠశాలలు, మోడల్‌ స్కూల్‌ను కలిపి ‘తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌’ పేరిట అభివృద్ధి చేయుట వలన అడ్మిషన్ల వరద కొనసాగింది. శంషాబాద్‌ మండలం ముచ్చర్ల గ్రామంలో మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలను ఒక కార్పొరేట్‌ సంస్థ దత్తత తీసుకొని కార్పొరేట్‌ రెస్పాన్సిబిలిటీ కింద అభివృద్ధి చేయుట వలన, గత సంవత్సరం 87 ఉన్న ఎన్రోల్మెంట్‌ ఈ సంవత్సరం 650కి పెరిగింది. బడీడు పిల్లలందరికీ ప్రభుత్వ పాఠశాలల ద్వారానే విద్యను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తే మెజార్టీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతారు. ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు సార్ధకత ఉంటుంది. బడ్జెట్‌ అంటే ప్రతి పద్దు కింద చేసే ఖర్చును పై పద్ధతిలో విశ్లేషణ చేసుకుని, మరొక బడ్జెట్‌ తయారు చేసుకుంటే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది.

అలుగుబెల్లి నర్సిరెడ్డి
9490300678

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -