వరంగల్లో సీఎస్ఆర్ కార్యక్రమాలు
ప్రారంభించిన ఎస్బీఐ చైర్మెన్ శ్రీనివాసులు శెట్టి
నవతెలంగాణ – హైదరాబాద్
దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మెన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలంగాణ అభివృద్ధిలో భాగంగా రెండు కీలక కార్యక్రమాలను ప్రారంభించారు. హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో అత్యంత లాభదాయకమైన రీజినల్ రూరల్ బ్యాంకుల్లో ఒకటిగా నిలిచిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టీజీబీ) నూతన ప్రధాన కార్యాలయ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. దీనికి ఎస్బీఐ ఎండీ అశ్విని కుమార్, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ చిన్మోరు కుమార్, నాబార్డ్ తెలంగాణ సీజీఎం ఉదరు భాస్కర్, ఎస్బీఐ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం వరంగల్లో జరిగిన కార్యక్రమంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా గ్రామీణ పాఠశాలల మౌలిక సదుపాయాల కోసం రూ.75 లక్షలు, సహృదయ వృద్ధాశ్రమ పునర్నిర్మాణం కోసం రూ.17.5 లక్షల చొప్పున నిధులను అందజేశారు. ఈ సందర్భంగా సిఎస్ శెట్టి మాట్లాడుతూ.. ”బ్యాంకింగ్ అంటే కేవలం ఆర్థిక సేవలు మాత్రమే కాదు. సామాజిక మార్పును తీసుకురావడమే ఎస్బీఐ లక్ష్యం. ప్రాథమిక విద్య, ఆరోగ్యం, రుతుక్రమ పరిశుభ్రతపై మేము ప్రధానంగా దృష్టి సారించాము,” అని తెలిపారు. ఎస్బిఐ ప్రధాన స్పాన్సర్గా ఉన్న టీజీబీ రూ.79,667 కోట్ల వ్యాపారంతో దేశంలోనే అగ్రగామి రీజినల్ రూరల్ బ్యాంకుల్లో ఒకటిగా ఉంది. 933 శాఖలతో 90 లక్షల మంది ఖాతాదారులకు సేవలను అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్బీఐ 1,337 శాఖలతో విస్తరించి సేవలను అందిస్తోంది.
టీజీబీ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన
- Advertisement -
- Advertisement -



