నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జరుగుతున్న ”జన ఆక్రోష్” జాతాల్లో భారీగా రైతులు, కార్మికులు పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి 24న ఢిల్లీలో నిర్వహించనున్న ర్యాలీకి ముందుగా, ఉత్తర భారత రాష్ట్రాల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ”జన ఆక్రోష్” జాతాలు జరుగుతున్నాయి. ఈ ర్యాలీలు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహాన్ని బాగా రేకెత్తించాయి. కార్మిక కోడ్లతో హక్కుల హననం, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం, విద్యుత్ సవరణ బిల్లు, విత్తన బిల్లు, అమెరికాతో వాణిజ్య ఒప్పందం, వంటగ్యాస్ రంగంలో సంక్షోభం వంటి బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో సీపీఐ(ఎం) ర్యాలీ నిర్వహించనుంది.
గత నెలాఖరున రాజస్తాన్లో ప్రారంభమైన ర్యాలీ కొనసాగుతోంది. సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యుడు, ఎంపీ అమ్రారామ్ రైతులు, కార్మికులతో మాట్లాడారు. ఈ ర్యాలీలో భాగంగా, సీఐటీయూ నాయకత్వంలో జైపూర్లో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మార్చి 24 నిరసనలపై చర్చించారు. హర్యానా జాతా ఫరీదాబాద్కు చేరుకుంది. రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మాలిక్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో భాగంగా బహిరంగ సభలు కూడా నిర్వహించారు. పంజాబ్ జాతా ఫరీద్కోట్ జిల్లాలోని మోగాలో పర్యటించింది. ఈ జాతాకు కేంద్ర కమిటీ సభ్యుడు కె.ఎన్. ఉమేష్, రాష్ట్ర కార్యదర్శి సుఖ్వీందర్ సింగ్ సెఖోన్ నాయకత్వం వహిస్తున్నారు. బీహార్లో ఈ జాతా పలు బందాలుగా ముందుకు సాగుతోంది. అన్ని రాష్ట్రాల్లో జరిగిన ర్యాలీలో భాగంగా కళా ప్రదర్శనలు కూడా నిర్వహించారు.
సీపీఐ(ఎం) ‘జన ఆక్రోష్’ జాతాల్లో రైతులు, కార్మికులు
- Advertisement -
- Advertisement -



