నవతెలంగాణ – ఉప్పునుంతల
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ సంక్షేమానికి భారీగా నిధుల కోత విధించడం దళితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చింతల నాగరాజు ప్రభుత్వాన్ని విమర్శించారు. గత బడ్జెట్లో రూ.40,232 కోట్లు కేటాయించగా, ఈసారి కేవలం రూ.11,784 కోట్లు మాత్రమే కేటాయించడం సుమారు 70 శాతం కోతగా నిలిచిందన్నారు.
దళితుల అభివృద్ధి పేరుతో మాటలు మాత్రమే చెప్పి, ఆచరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకం సరిగా అమలు కాలేదని, ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించిన అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు.
దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వారి సంక్షేమాన్ని విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బడ్జెట్ సవరణ చేసి కనీసం రూ.50,000 కోట్లు ఎస్సీ సంక్షేమానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.


