Friday, March 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిద్యుత్ కొనుగోలులో స్మార్ట్ వ్యూహం

విద్యుత్ కొనుగోలులో స్మార్ట్ వ్యూహం

- Advertisement -


– డేటా ఆధారంతో ఖర్చులకు కళ్లెం
– తెలంగాణ డిస్కంలకు రూ. 700 కోట్ల లాభం

నవతెలంగాణ హైదరాబాద్: సంప్రదాయ విద్యుత్ కొనుగోలు పద్ధతులకు తెలంగాణ స్వస్తి పలికింది. అత్యాధునిక డేటా ఆధారిత వ్యూహాలతో విద్యుత్ కొనుగోలులో రూ. 700 కోట్ల భారీ పొదుపును సాధించింది. సోలార్, హైడ్రో వంటి పునరుత్పాదక ఇంధన వనరుల లభ్యత పెరగడం, పవర్ ఎక్స్ఛేంజీలలో ధరలు తగ్గడాన్ని అనుకూలంగా మార్చుకొని 2026 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లోనే ఈ మైలురాయిని చేరుకుంది. ఒకప్పుడు కేవలం అత్యవసరాలకే పరిమితమైన విద్యుత్ మార్కెట్లను, ఇప్పుడు వ్యూహాత్మక లాభాల కోసం తెలంగాణ సమర్థవంతంగా వినియోగిస్తోంది. ​భారతదేశ విద్యుత్ కొనుగోలు రంగంలో నిర్మాణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర విద్యుత్ సంస్థలు (డిస్కంలు) తమ సాధారణ విద్యుత్ సరఫరా ప్రణాళికలో ‘పవర్ ఎక్స్ఛేంజీలను’ (విద్యుత్ మార్కెట్లను) ఎక్కువగా భాగం చేస్తున్నాయి. ఒకప్పుడు కేవలం విద్యుత్ కొరతను లేదా అనూహ్యమైన డిమాండ్‌ను తట్టుకోవడానికి స్వల్పకాలిక పరిష్కారంగా మాత్రమే వీటిని ఉపయోగించేవారు. ఇప్పుడు ధరలు, విద్యుత్ ఉత్పత్తి ఆర్థికాంశాలు, సమయాన్ని బట్టి మారే డిమాండ్ సరళిని విశ్లేషిస్తూ.. డేటా ఆధారిత వ్యూహాలతో విద్యుత్ కొనుగోలు చేయడానికి వీటిని ఒక ప్రధాన మార్గంగా మారుస్తున్నారు.
ఈ మార్పు డిస్కంల నిర్ణయాధికారంలోని మూడు కీలక అంశాలను సానుకూలంగా ప్రభావితం చేస్తోంది. అవి.. విద్యుత్ కొనుగోలు చేసే సమయం, రాష్ట్రానికి కేటాయించిన విద్యుత్ ఉత్పత్తిని షెడ్యూల్ చేసే విధానం, రోజువారీ డిమాండ్-సరఫరా సమతుల్యతను మెరుగుపరచడం. మార్కెట్ ఆధారిత డైనమిక్ కొనుగోలు పద్ధతులు ఒక కార్యాచరణ వ్యూహంగా ఎలా స్థిరపడుతున్నాయో? తెలంగాణ ఇటీవల అనుసరించిన విద్యుత్ కొనుగోలు ధోరణులు స్పష్టం చేస్తున్నాయి. సౌర, జల, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల లభ్యత పెరగడం, స్థిరమైన బొగ్గు విద్యుత్ ఉత్పత్తి కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో మార్కెట్, రియల్-టైమ్ మార్కెట్ ధరలలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. భారతీయ విద్యుత్ ఎక్స్ఛేంజ్ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు డీఏఎం సగటు ధర యూనిట్‌కు రూ. 3.83 గా ఉంది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14.4 శాతం తక్కువ. అదే కాలంలో ఆర్టీఎం సగటు ధర యూనిట్‌కు రూ. 3.58 కు చేరింది. ఇది గతేడాది కంటే 16.5 శాతం తగ్గుదల కనిపిస్తుంది. తక్కువ ధరలకు విద్యుత్ లభ్యం కావడం వల్ల డిస్కంలు, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు తమ అవసరాలను తక్కువ ఖర్చుతో తీర్చుకోవడమే కాకుండా, ఖరీదైన విద్యుత్ స్థానంలో ఎక్స్ఛేంజీల ద్వారా లభించే చౌక విద్యుత్‌ను వాడుకునే అవకాశం కలిగింది.‌ తెలంగాణ రాష్ట్రం ఈ పోటీ ధరలను అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకుంది.

స్పష్టమైన, డేటా ఆధారిత వ్యూహంతో తన విద్యుత్ కొనుగోలు వ్యయాలను తగ్గించుకుంది. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో, రాష్ట్రం పవర్ ఎక్స్ఛేంజీల నుంచి సుమారు 13 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సగటున యూనిట్‌కు రూ. 3.04 ధరతో సేకరించింది. ఈ వ్యూహాత్మక విద్యుత్ వినియోగం వల్ల ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లోనే రాష్ట్రానికి రూ. 700 కోట్ల భారీ పొదుపు సాధ్యమైంది. ఈ తక్కువ ధరలతో డిస్కంలు, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు తమ అవసరాలు తీర్చుకోవడమే కాకుండా, ఖరీదైన విద్యుత్తుకు బదులుగా ఎక్స్ఛేంజీల ద్వారా లభించే చౌక విద్యుత్తును వాడుకునే అవకాశాన్ని కల్పించాయి.
తెలంగాణ అనుసరించిన ఈ విధానం దేశవ్యాప్తంగా వస్తున్న మార్పునకు అద్దం పడుతోంది. పవర్ ఎక్స్ఛేంజీలు ఇకపై కేవలం అత్యవసర సమయాల్లో వాడే వనరులు మాత్రమే కావు. అవి ఖర్చు తగ్గింపునకు, డైనమిక్ షెడ్యూలింగ్‌కు, నిజ-సమయ మార్పులను సర్దుబాటు చేయడానికి అవసరమైన అంతర్భాగాలుగా మారాయి. పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ, సమయాన్ని బట్టి మారుతున్న ధరల సంకేతాలకు అనుగుణంగా స్పందిస్తున్న రాష్ట్రాలు తమ సగటు విద్యుత్ కొనుగోలు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోగలుగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -