బడ్జెట్లో మహాలక్ష్మికి కేటాయింపులు తక్కువే
ప్రజారవాణాకు గడ్డురోజులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఆర్టీసీ)కి రాష్ట్ర బడ్జెట్లో అనుకున్న మేర నిధులు కేటాయింపులు జరగలేదు. శుక్రవారం అసెంబ్లీలోలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కోతలు విధించారు. దీంతో ప్రజారవాణాకు గడ్డురోజులు తప్పవని ఆర్టీసీ కార్మిక సంఘాలు అంటున్నాయి. భారీగా హామీలు ఇచ్చి, నిధులు కేటాయింపులు తక్కువ చేస్తే ఫలితాలు ఆశాజనకంగా ఉండవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2026-27 బడ్జెట్లో ఆర్టీసీకి మొత్తం రూ. 4305 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. ఆర్టీసీ అవసరాలు, కార్మికుల సమస్యల పరిష్కారానికి కావాల్సిన మొత్తం రూ. 9500 కోట్లని కార్మిక సంఘాలు అంటున్నాయి. ఇప్పటికే అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీకి సరైన కేటాయింపులు చేయలేదనే విమర్శలు వస్తున్నాయి.
ప్రధానంగా ఆర్టీసీకి ఇటీవల మహాలక్ష్మి పథకం కింద ఇస్తున్న సబ్సిడి విలువ నెలకు రూ. 450 కోట్లుగా ఉంది. దీనికి అదనంగా ప్రయాణీకుల నుంచి వస్తున్న సబ్సిడీలు విలువ సంవత్సరానికి రూ.640 కోట్లు. ఇవి అన్నీ కలిపి రియింబర్స్మెంటు కింద రూ. 6040 కోట్లు బడ్జెట్లో నిధులు కేటాయించాల్సి ఉంది. కానీ కేవలం రూ. 4305 కోట్లు మాత్రమే కేటయించారు. ఈ కేటాయింపులు ఆర్టీసీకి జవజీవాలు నింపే అవకాశం లేదని సమాచారం. కాలం చెల్లిన బస్ల స్థానంలో కొత్త బస్సుల కొనుగోలు, విద్యుత్ బస్సులను ఆర్టీసీనే నిర్వహించేలా చూడటం కూడా అవసరమని కార్మిక సంఘాలు అంటున్నాయి.
దీంతో తాజా కేటాయింపుల పట్ల సంఘాలు సైతం ఆందోళన చెందుతున్నాయి. మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి ఆర్టీసీకి కేటాయింపులు పెంచినా అవి సరిపోవడం లేదు. అప్పట్లో రూ. 4305 కోట్లు కేటాయించారు. ఈ ఆర్థిక ఏడాదిలోనూ ఆ మేరకు నిధులు ఇచ్చారు.2024-25 నుంచి ఆర్టీసికి నిదులు పెంచుతున్నా, ప్రభుత్వ పథకాలు, ప్రజల అవసరాల దృష్ట్యా ఆర్టీసీ నష్టపోతున్నది. ఆమేరకు అదనపు నిధులు ఇవ్వాలన్న కార్మికుల డిమాండ్ దీర్ఘకాలికంగా పెండింగ్లోనే ఉంటున్నది.




