కనిపించిన నెలవంక.. ముగిసిన ఉపవాసదీక్షలు
ముస్లిం సోదరులకు గవర్నర్, సీఎం రేవంత్రెడ్డి శుభాకాంక్షలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను శనివారం జరుపుకోనున్నారు. శుక్రవారం రాత్రి నెలవంక కనిపించింది. నెలరోజులపాటు ఉన్న ఉపవాసదీక్షలను జుమాతుల్ విదతో ముగించారు. రాష్ట్రంలోని మసీదు, ఈద్గామైదానాల వద్ద నమాజ్ కోసం ఏర్పాట్లు చేశారు. ముస్లిం సోదర సోదరీమణులు తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో సంతోషంగా జరుపుకోవాలని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
రంజాన్ పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ముస్లింలు అనుసరించే కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా అల్లా ఆశీస్సులు ఉండేలా దువా చేయాలని వారు కోరారు..మాజీ సీఎం కేసీఆర్ కూడా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.



