సంక్షేమానికి ఎసరు
కాగితాల్లోనే బడ్జెట్ కేటాయింపులు
దారి మళ్లుతున్న నిధులు
ఆందోళనలో శ్రామికులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగులు తరచూ ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కేటాయింపులు నిరాశకు గురిచేసింది. కార్మిక, ఉపాధి కల్పనకు కేటాయించిన నిధులు గతానికంటే పెరిగినట్టు అంకెల్లో చూపించినా.. కార్మికుల సంక్షేమం, వారి అవసరాలకు ఏ మాత్రం పొంతన లేకుండా ఉంది. ఎన్నికల సమయంలో భారీ హామీల తో ఊరించి, ఇప్పుడు నిధుల కేటాయింపుల్లో, వాటి వినియోగం లో నిర్లక్ష్నాన్ని కనిపర్చటం పట్ల వారు ఆవేదనకు గురవుతున్నారు.ఇదిలా ఉంటే.. ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు ఈ బడ్జెట్ ను ‘కార్పొరేట్లకు ప్రాధాన్యమిచ్చేదిగా’ ఉందని విమర్శిస్తున్నారు.
సంక్షేమం..నిర్లక్ష్యం..
కార్మికుల సంక్షేమం తాజా బడ్జెట్లో నిర్లక్ష్యానికి గురైంది. రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి 2026-27 రాష్ట్ర బడ్జెట్ను రూ.3,24,234 కోట్లతో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో కార్మిక శాఖకు రూ. 998 కోట్లు ప్రతిపాదించారు. కార్మికుల సంక్షేమం,వారి అవసరాలు, వారి సంఖ్యను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ కేటాయింపులు చాలా తక్కువ. గత ఆర్థిక సంవత్సరం కేటాయించిన (రూ.900 కోట్లు)తో పోలిస్తే రూ. 98కోట్లు అధికమే. అంకెల్లో పెరిగినట్టు కనిపించినా….వారి సంక్షేమానికి ఏ మాత్రం సరిపోవనేది వాస్తవం. ఇది ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కార్మిక సంఘాలు విశ్లేషిస్తున్నాయి. సామాజిక భద్రత, జీవనోపాధి అవసరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించాయి. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులను కార్మికులుగా గుర్తించకపోవడం, ఈపీఎఫ్, ఈఎస్ఐ పథకాలు, వేతన పరిమితి పట్ల స్పష్టతనివ్వలేదు.
ఖర్చు చేయట్లే..
2014 నుంచి ఇప్పటివరకు 13 బడ్జెట్లు ప్రవేశపెడితే.. అందులో కార్మిక శాఖకు రూ.11,010 కోట్లు కేటాయించగా రూ. 7,642 కోట్లు మాత్రమే ఖర్చయింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులను ఏ మేరకు ఖర్చు చేశారన్నది స్పష్టతనివ్వటం లేదు. 2014 నుంచి ఇప్పటివరకు ఆ శాఖ కు కేటాయించిన నిధులను తగిన విధంగా కార్మికుల ప్రయోజనాలకు ఖర్చు చేయటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ నివేదికలు సైతం వెల్లడిస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపులు, నిధుల వినియోగంపైనే కాకుండా.. ఆ శాఖకు కేటాయించిన నిధులను ఇతర పనులకు వినియోగిస్తున్నారనే విమర్శను కార్మిక శాఖ ఎదుర్కొంటున్నది.
68 శాతం శ్రామిక శక్తి..
రాష్ట్రంలో శ్రామిక శక్తి 68.7 శాతం. అందులో పారిశ్రామిక రంగంలో 22.5శాతం. సర్వీసు రంగంలో 34.8 శాతం పని చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పని చేస్తున్న కార్మిక శక్తిని, ఈ బడ్జెట్లో వారి సంక్షేమాన్ని విస్మరించింది. కేటాయించిన రూ. 998 కోట్లు 1 కోటి 50 లక్షల మందిగా ఉన్న కార్మికులకు ఈ కేటాయింపులు ఏ మూలకూ సరిపోవు, మహిళా, శిశు సంక్షే మానికి రూ.3,143 కోట్లు, వైద్యారోగ్య రంగానికి రూ. 13,679 కోట్లు, పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ… కోట్లు, విద్యా శాఖకు రూ.26,674 కోట్లు, మున్సిపల్ పరిపాలనా శాఖకు రూ…కోట్లు కేటాయించినప్పటికీ ఆ కేటాయింపుల్లో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, గ్రామ పంచాయితీ, మున్సి పల్, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ తదితర శాఖల వేతనాల పెంపు గురించి గానీ, వారి ఉద్యోగాల రెగ్యులరైజేషన్ గురించిన ఊసే లేదు.
ఎన్నికల హామీ విస్మరణ..
ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చిన అంశాలకు ఈ బడ్జెట్ ప్రాధాన్యత కల్పించలేదు. ఆ హామీ నిటి రాతగానే మిగిలింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఉద్యోగ నియామకాలకు, ఉద్యోగ కల్పనకు ఎటువంటి విధానాన్ని చేపట్టబోతున్నారో ఎక్కడా చెప్పలేదు. లక్షల సంఖ్యలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, టైంస్కేల్, డైలీవేజ్ తదితర ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గురించి కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సిన డీఎ బకాయిల గురించి ప్రస్తావించలేదు. 73. షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్ పరిధిలోకి వచ్చే లక్షలాది మంది పారిశ్రామిక, అసంఘటితరంగ కార్మికులు కనీస వేతనాల జీఓ సవరణపట్ల స్పష్టతనివ్వ లేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కార్మికుల సంక్షేమం కోసం పెట్టిన అంశాలు ఈ బడ్జెట్లో లేవు.
బీడీ కార్మికులకు చేయూత, జీవిత బీమా, ఈఎస్ఐ, అసంఘటితరంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు, దీనికి బడ్జెట్ కేటాయింపులు, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, స్విగ్గి, జొమాటో కార్మికులకు సామాజిక భద్రత గురించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా డైవర్ట్ చేశారు. అదే విధంగా చిరు వ్యాపారాలు, ఫుట్పాత్ వ్యాపారుల కు వడ్డీ లేని రుణం సదుపాయం కల్పిస్తానన్న వాగ్దానం గాలికొదిలేశారు. మిషన్ భగీరథ కార్మికులకు కనీస వేతనాలు, గ్రామ పంచాయతీ కార్మికుల, మధ్యాహ్న భోజన కార్మికుల బకాయి వేతనాల చెల్లింపుకు ఎలాంటి చర్యలు ఈ బడ్జెట్లో తీసుకోలేదు. మొత్తంగా చూసినప్పుడు ఉద్యోగ వర్గాన్ని, అసంఘటిత కార్మికులను, స్కీం వర్కర్లను, పారిశ్రామిక కార్మికులను నిరుత్సాహపరిచింది.




