మన దేశంలో తరతరాలుగా సమాజంలో ఉన్నతులమనుకొనేవారు ప్రబోధిస్తున్న, ప్రవచిస్తున్న గొప్ప మాటలు విని తరించి, భరించి తన్మయత్వంలో వాస్తవిక జగత్తునే మర్చిపోయాం. పోతున్నాం కూడా. జగత్తు మిధ్య పలాయనం మిధ్య సిద్ధాంతాల పరంపరలో ఇంతకుమించి ఏముంటుంది! ఇప్పటికయినా ఒంటికి, తలకింటికి అర్థం కావాల్సింది ఏమిటంటే, ధర్మ ప్రబోధాల పేరుతో పండిత ఉద్ధండులు ఒలకబోస్తున్న అజ్ఞానం అవాంచనీయం ఎంతన్నదే తెలుసుకోవాల్సి ఉంది. ఇంతకంటే కుసంస్కార ప్రవచనం వేరే ఉంటుందా! ”బడిలో పిల్లోడు చదివితే చదువతాడు లేకుంటే పోతాడు! వాడికి మధ్యాహ్న భోజనమేమిటి? ఆ భోజనంలో గుడ్డేమిటి! గాడిద గుడ్డు అసహ్యకరంగా! ఆ గుడ్డుకు లెక్కలు.. డొక్కలు, దుస్తులిచ్చి, పుస్తకాలిచ్చి, అన్నంపెట్టి గాడిదగుడ్డూ పెట్టి కూచోపెడితే, వాడిక చదువుతాడా? పెళ్లి కొడుకులా కూర్చోపెడతారా? అసలు బళ్లో తిండి పెట్టడమేమిటి?” ఇది మన వేదాధ్యయన ప్రవచనకారుని తలనిండా నింపుకున్న జ్ఞానం.
ఇలాంటివి చెప్పే తరతరాలుగా సమాజంలోని అధిక భాగాన్ని చదువుకు దూరం చేశారు. కడుపునిండా తిండికి దూరం చేశారు. కడుపు నిండా తినగలిగి ఉన్నవారే చదువుకోవడానికి అర్హులని నిర్ణయించేశారు! అంతేకాదు, చదువుకున్నవాడు, తినికూచుని ఇలా మాటలు, బోధలు మాత్రమే చేయాలనీ నియమం చేశారు. ఇది అగ్రవర్ణుల అహంకారపూరిత హూంకారం. ఈ దేశంలో స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా సమాన హక్కులు, సమానత్వం అందరికీ చెందినవిగా ఉండాలనుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చినా, ఇంకా పేదరికం, ఆకలి, అవిద్య, అనారోగ్యం వెంటాడుతూనే ఉంది. రెండు పూటలా తినేందుకు బుక్కెడు అన్నం దొరకని అభాగ్యులు ఇప్పటికీ కోకొల్లలు. ఇక పిల్లల్లో పోషకాహారలోపం, రక్తహీనత, వయసుకు తగిన బరువులేకపోవడం, విటమిన్ లోపాలతో, భావిభారతం కొనసాగుతూనే ఉన్నది.
పేదరికంలో ఉన్న ప్రజలు వారి పిల్లలను బడులకు పంపే పరిస్థితిలేదు. దానికి బదులు పనులకు పెట్టడాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితులను గమనించి మన అత్యున్నత న్యాయస్థానం. ప్రతివారికి ఆహారం హక్కుగా ఉండాలని, పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వాలు అమలుపరచాలని ఆదేశించింది. ఇప్పుడు మన ప్రవచనకారుడు, న్యాయస్థాన తీర్పును అపహాస్యం చేయడం మహానేరం కాదా! పేదవాళ్ల ఆకలిని, పేదరికాన్ని హేళన చేస్తూ వారి హక్కులపై దాడి చేయటం ఈ గరకపాటి వారితోనే మొదలయింది కాదు, పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై అనేకమంది చదువుతున్న పండితులు, వారు సోమరిపోతులుగా తయారవుతారని ప్రేలాపించడం చూశాం మనం. బడాబాబులు చేసిన అప్పులను ప్రభుత్వం మాఫీ చేయడాన్ని, కంపెనీలకు సబ్సిడీలు ఇవ్వడాన్ని మాత్రం వీరు ప్రశ్నించరు.
అసలు పిల్లలకు భోజనం పెట్టడమేమిటి? అని ప్రశ్నించడం, గుడ్డుపెట్టేవాడికి బుద్ధుందా! అని తిట్టడం వెనకాల ఎంత ద్వేషం కడుపులో ఉందో! దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతుల పిల్లలకు అసలు చదువును నిరాకరించాలనే ఆలోచనలే దీనికి కారణం. అన్నీ సంపుష్టిగా ఉన్నవారే చదువుకు అర్హులనే భావనే అందులో కనిపిస్తున్నది. దారిద్య్రం అనుభవించేవారికి కూడా చదువుకునే అవకాశాన్ని కల్పించేందుకు పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. అంబేద్కర్ ఆధ్వర్యంలో ఏర్పరచుకున్న భారత రాజ్యాంగం కల్పిస్తున్న హక్కు ఇది. ఆహారం, విద్య పొందటం అనేవి దయాదాక్షిణ్యాలమీద ఇచ్చే భిక్షకాదు, అది హక్కు.
తరతరాలుగా శ్రామికులు సృష్టిస్తున్న సంపదను తమ వెనకాల వేసుకుని, సకల భోగాలు అనుభవిస్తూ బొజ్జలు పెంచిన జ్ఞాన ప్రవచనాలు ఇలానే ఉంటాయి. ఈ జ్ఞాన బోధకులు అసలైన నేరస్తులు, దుర్మార్గులు, అవినీతిపరుల మీద పల్లెత్తుమాట మాట్లాడరు. అన్యాయంగా దేశాలపై దాడులు చేస్తున్న సామ్రాజ్యవాద దేశాల గూర్చి కానీ, మానవ హననాన్ని గూర్చికానీ, పసిపిల్లలను నిర్ధాక్షణ్యంగా చంపేస్తున్న యుద్ధ పిపాసులనూ ఏమీ అనరు. మహిళల వేషధారణల గూర్చి, కుల వివక్షతతో కూడిన వ్యాఖ్యలు చేయడం తప్ప, అసలు పేదరికానికి, ఆకలికి కారణాల జోలికే వెళ్లరు. వెటకారాలు, మూతివిరుపులు, ముచ్చుపలుకులు. ఇవీ ఉన్నత విద్యా పారంగతుల మనుకునే వారి ప్రవచనాంశాలు. వాళ్లకంటే కూడా, అట్లాంటి బోధకులను అనుసరిస్తున్న, వింటున్న అశేష ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. విద్యార్థుల పట్ల అనుచితంగా మాట్లాడిన వారు క్షమాపణలు చెప్పాలి.
గాడిదగుడ్డు ప్రవచనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



