అమరావతి : ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహారావు చేసిన అవమానకర వ్యాఖ్యలను ఖండించాలని కెవిపిఎస్ కోరింది. మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహారావు చేసిన అవమానకర, బాధ్యతా రాహిత్యపు వివక్షాపూరిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓ నల్లప్ప, అండ్ర మాల్యాద్రి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోట్లాది పేద, అణగారిన తరగతుల విద్యార్థుల గౌరవాన్ని అవమానించేలా ఉన్నాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలు సమాజంలోని పేదరికాన్ని, అసమానతలను అర్థం చేసుకోలేని దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పథకం కేవలం ఆహారం అందించే పథకం కాదని, ఇది పిల్లల ఆకలి సమస్యను తగ్గిస్తుందని తెలిపారు.
పాఠశాల హాజరు, కొనసాగింపును పెంచుతుందని పేర్కొన్నారు. ఈ పథకాన్ని హేళన చేయడమంటే పేద పిల్లల గౌరవాన్ని దెబ్బతీయడమేనని తెలిపారు. సంక్షేమ విధానాలను బలహీనపరచడం, సామాజిక వివక్షను ప్రోత్సహించడమేనని పేర్కొన్నారు. సమాజంలో ప్రభావం కలిగిన వ్యక్తులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం బాధాకర మన్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం, మానవ విలువలను బలోపేతం చేయాలని, అవి దెబ్బతీసేలా మాట్లాడకూడదని సూచించారు. చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే గరికపాటిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయనకు ప్రదానం చేసిన జాతీయ, రాష్ట్ర పురస్కారాలను వెంటనే రద్దు చేసి పేద పిల్లల మధ్యాహ్న భోజన పథకంపై ప్రభుత్వాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాలని కోరారు.
గరికపాటి వ్యాఖ్యలను ఖండించండి : కెవిపిఎస్
- Advertisement -
- Advertisement -



