ఎమ్మెల్యే కడియం శ్రీహరి
మొదటిసారి దేవాదుల నీటితో నిండిన రామచంద్రాగూడెం చెరువు సందర్శన
నవతెలంగాణ-లింగాల గణపురం
దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా లింగాల ఘనపురం మండలంలోని చిట్ట చివరి ఆయకట్టు వరకు ప్రతి ఎకరానికీ రెండు పంటలకు సాగు నీరు అందించే బాధ్యత తనదని స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. జనగామ జిల్లా లింగాలగణపురం మండలంలోని రామచంద్రాగూడెం గ్రామంలో మొదటిసారిగా దేవాదుల ప్రాజెక్టు నీటితో నిండిన చెరువును ఆదివారం మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్రెడ్డితో కలిసి సందర్శించారు. గోదావరి జలాలతో నిండిన చెరువు వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం స్థానిక రైతులతో కడియం శ్రీహరి ముఖాముఖీ నిర్వహించారు. కాలువల ద్వారా సాగు నీరు ఎక్కడివరకు అందుతుంది? కాలువల్లో మరమ్మతు పనులు ఏమైనా ఉన్నాయా? సాగు నీరు అందని ప్రాంతాల్లో నీరందకపోవడానికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనే విషయాలపై చర్చించారు. ఈ యాసంగిలో ఒక్క ఎకరం కూడా ఎండిపోనివ్వనని చెప్పారు. రైతుల పంటలు కోతకు వచ్చే వరకు సాగు నీరు అందిస్తానని తెలిపారు. ఇంకా సాగు నీరు అందని ప్రాంతాలకు వచ్చే వర్షాకాలంలో చర్యలు చేపడతామన్నారు.



