Wednesday, March 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరుణమాఫీపై పునరాలోచన చేయండి

రుణమాఫీపై పునరాలోచన చేయండి

- Advertisement -

– ప్రభుత్వానికి సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విజ్ఞప్తి
– తెలంగాణ బడ్జెట్‌ అంకెల గారడీ: దాసోజు శ్రవణ్‌
– జనరంజకమైన బడ్జెట్‌ : బల్మూరి వెంకట్‌
– బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శాసన మండలిలో సభ్యుల ప్రస్తావన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రుణ మాఫీపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం శాసన మండలిలో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. రూ.2లక్షల లోపు రుణమాఫీ రాష్ట్రంలోని ఏ గ్రామంలో పూర్తిగా కాలేదని గుర్తు చేశారు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలేసుకున్న పేదలకు పట్టాలివ్వాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పేదలేసుకున్న గుడిసెలను రెవెన్యూ, పోలీస్‌ అధికారులు బలవంతంగా తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు బడ్జెట్‌పై పలువురు సభ్యులు తమ అభిప్రాయాలను, సూచనలను ప్రభుత్వానికి తెలిపారు. బడ్జెట్‌ అంచనాలు, వాస్తవ ఖర్చుల మధ్య భారీ వ్యత్యాసాలు ఉండటం వల్ల ప్రజల్లోనే కాకుండా ప్రభుత్వ యంత్రాంగంలో కూడా విశ్వాసం దెబ్బతింటుందని సభ్యులు దాసోజు శ్రవణ్‌, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, తాత మధు, అంజిరెడ్డి పేర్కొన్నారు. 2024ు25 ఆర్థిక సంవత్సరానికి రూ.2.2 లక్షల కోట్ల బడ్జెట్‌ అంచనాలు పెట్టగా వాస్తవంగా రూ.1.67 లక్షల కోట్లే ఖర్చయినట్లు తెలిపారు. అదే విధంగా 2025ు26లో రూ.2.29 లక్షల కోట్ల అంచనాలు పెట్టి, ఇప్పటివరకు కేవలం రూ.2.03 లక్షల కోట్లే సాధ్యమైనట్లు వివరించారు. ఇప్పుడు మరోసారి రూ.2.41 లక్షల కోట్ల భారీ అంచనాలు పెట్టడం అసంబద్ధమని విమర్శించారు. ప్రభుత్వం రాజకీయ విమర్శలు మాని వాస్తవ గణాంకాలను వెల్లడించాలని వారు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వాస్తవానికి దగ్గరగా, పేద ప్రజలను అక్కున చేర్చుకునే జనరంజక బడ్జెటని సభ్యులు బల్మూరి వెంకట్‌, శంకర్‌ నాయక్‌ కెతావత్‌, భాను ప్రసాదరావు, బుగ్గారపు దయానంద్‌ అన్నారు. రైతు భరోసా, చేయూత ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, సన్నధాన్యానికి బోనస్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, కళ్యాణ లక్ష్మి పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సభ్యులు విమర్శలు మాని సలహాలు, సూచనలు ఇవ్వాలని వారు కోరారు. సభ్యులు తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు బడ్జెట్లో అన్యాయం చేశారని ఆరోపించారు. సభ్యులు గోరంటి వెంకన్న మాట్లాడుతూ బడ్జెట్‌ అంటే అంకెలు, సంఖ్యలు కాదనీ, అది మానవీయ కోణాన్ని ఆవిష్కరించాలన్నారు. మూసీ బాదితులకు పునరావాసం కల్పించిన తర్వాతే వారిని తరలించాలని సర్కార్‌కు సూచించారు. సభ్యులు అంజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని విశ్వవిధ్యాలయాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సభ్యులు వాణిదేవి మాట్లాడుతూ టెన్‌ ప్లస్‌ టూ విద్యను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తామనే అంశంపై క్లారిటీ ఇవ్వాలన్నారు. ఇంటర్‌, పాలిటెక్నిక్‌ కాలేజీలను ఏంచేస్తారో కూడా చెప్పాలని కోరారు. సభ్యులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్‌ విధానలే మాకు ఆదర్శమని బడ్జెట్లో చెపుతూ, హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి సంకెళ్లు వేశారని ఆరోపించారు. వెంటనే రాబోయే ఆ మహానియుని జయంతి వరకు విముక్తి కల్పించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -