బిజెపి శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీలా ఉందని, కాగితంపై నిధులు కనిపిస్తాయి కానీ విడుదల కావు, ఖర్చు చేయటం లేదని బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. బడ్జెట్పై సాధారణ చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..’ బడ్జెట్ ఎండమావిని తలపిస్తోంది. కాగితంపై నిధులు కనిపిస్తాయి. కానీ నిధులు విడుదల కావు, వాటిని ఖర్చు చేయరు. 3 ట్రిలియన్ ఎకానమీ అంటూ గొప్పలు చెబుతున్నారు. కానీ ఆ లక్ష్యం చేరుకునేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రణాళిక ఏంటో తెలియదు. జిఎస్టీ వసూళ్లలో వార్షికంగా 15 శాతం పెరుగుదలతోనే ఇది సాధ్యపడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యంగా ఉంది. తెలంగాణ ఆర్థికంగా తిరోగమనంలో పయనిస్తోంది. ఆర్బిఐ నుంచి ఎఫ్ఆర్బిఎం రుణాలు లేకుండా గత ఏడాదిలో కేవలం 141 రోజులు మాత్రమే నెట్టుకొచ్చింది. ద్రవ్య సంక్షోభంలో కొనసాగుతూ, ఆర్బిఐ ఓవర్డ్రాఫ్ట్లపై ప్రభుత్వం నడుస్తోంది. గ్లోబల్ సమ్మిట్, విదేశీ పర్యటనల్లో ఒప్పందాలు చేసుకుంటున్నారు, కానీ రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏమీ రావటం లేదు. ఎన్నికల హామిని నెరవేర్చే దిశగా బడ్జెట్లో కేటాయింపులు లేవు. విశ్రాంత ఉద్యోగులు సైతం బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే వారికి బకాయిలు విడుదల చేయాలి. బడ్జెట్ కేటాయింపుల్లో ఎస్సీలకు 28 శాతం, ఎస్టీలకు 16 శాతం, మహిళలకు 46 శాతం, వ్యవసాయానికి 5 శాతం కేటాయింపుల్లో కోత విధించారు. బీసీలకు సైతం కేటాయింపుల్లో రూ. 202 కోట్లు తగ్గాయి. మైనారిటీలకు మాత్రం రూ.3291 కోట్లు కేటాయించారు. మహిళలకు బడ్జెట్లో 46 శాతం కోత విధిస్తూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను ఏ విధంగా చేస్తారో ప్రభుత్వం చెప్పాలి. ఆరోగ్యానికి బడ్జెట్లో కేవలం 4.2 శాతమే కేటాయించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ను మేయర్ పీఠాన్ని మజ్లిస్, కాంగ్రెస్ పంచుకునేందుకు మాత్రమే మూడుగా విభజించారు. జిహెచ్ఎంసీని మూడు కార్పోరేషన్లుగా విభజించాల్సిన అవసరం ఏముంది. దీనికి సమాధానం చెప్పాలి’ అని మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎండమావిలా బడ్జెట్, కాగితంపైనే నిధులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



