– నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ – కామారెడ్డి : మాచారెడ్డి చౌరస్తాలో ఉన్న ఒక మొబైల్ షాప్లో దొంగతనం జరిగిన ఘటనలో పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు మాచారెడ్డి ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.
అంకిరెడ్డిపల్లి తాండ గ్రామానికి చెందిన గూగుల్ చందు తండ్రి రాములు మొబైల్ షాప్లో బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు షట్టర్ తాళాలు పగలగొట్టి మూడు సెల్ఫోన్లు, కొంత నగదు దొంగిలించారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం ఉదయం పోలీస్ స్టేషన్ ముందు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ప్రవర్తించిన వ్యక్తిని గుర్తించారు. అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అజ్మీర అశోకు అలియాస్ గణేష్ (29) బైక్పై వస్తూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా, వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు నిన్న జరిగిన మొబైల్ షాప్ దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టి మూడు ఫోన్లు, నగదు దొంగిలించినట్లు తెలిపాడు.
పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచేందుకు పంపించారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోందనీ మాచారెడ్డి ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.



