ఒకవైపు హైదరాబాద్ మహానగరంలో కోట్ల రూపాయలతో ఐటి టవర్లు, ప్యూచర్ సిటీలు, ఎఐ టెక్నాలజీ, కార్పొరేట్ విద్యాసంస్థలు, అంతర్జాతీయ పాఠశాలలు, యూనివర్శీటీలు. మరోవైపు అదే నగరంలో మురికివాడల్లో, బస్తీలో పిల్లలకు కనీస ప్రాథమిక విద్యను కూడా అందించలేని స్థితితో సామాజిక అసమానతలు. ఎందుకుఈ వైరుధ్యాలు? గత ప్రభుత్వం బంగారు తెలంగాణ అని, ప్రస్తుత ప్రభుత్వం ప్రజాపాలన, రైజింగ్ తెలంగాణ-2047 అని బడ్జెట్ పెట్టి కోట్లాది రూపాయలు వారికి అవసరమైన వాటికోసం వెచ్చిస్తున్నారు తప్ప పేద విద్యార్థులకు చదువులకు పాఠశాలల నిర్మాణం మాత్రం చేయడం లేదు. నేటి ప్రభుత్వ పెద్దలు రాజీవ్గాంధీ, గాంధీ సరోవర్ లాంటి విగ్రహాలు పెడతామని ప్రకటిస్తున్నారు తప్ప విద్యార్ధులకు ఒక్క పాఠశాల నిర్మాణం చేయలేకపోతున్నారు. హైడ్రా వచ్చింది, ప్రభుత్వ భూములు, చెరువులు,కుంటలు కాపాడి రక్షిస్తుందని చెబుతున్నారు. కానీ, జవహర్నగర్ స్లమ్ ప్రాంతంలో పాఠశాలకు కేటాయింపు చేసిన నాలుగెకరాల భూమిపై కోర్టు స్టే ఉంటే మాత్రం సాధారణ పాలన సూత్రాలను అమలు చేయరు. ఇదెక్కడి న్యాయం?
హైదరాబాద్ నగరంలో, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో, కాప్రా మండలంలోని జవహార్ కార్పోరేషన్ పరిధిలోని వంద క్లస్టర్లలో ఇది ఒక్క స్లమ్ క్లస్టర్, హైదరాబాద్ నగరంలో సేకరించే చెత్తను తెచ్చి ఇక్కడే డంప్ చేసే అతిపెద్ద డంపింగ్ యార్డు ఇక్కడే ఉంటుంది. ఇక్కడున్న పేద విద్యార్థులకు పాఠశాల లేక పసిప్రాయంలోనే బాలకార్మికులుగా మారుతున్నారు. పాఠశాల లేకపోతే చదువుకునే హక్కు లేనట్లే కదా! ఇక్కడ విద్యార్థులకు పాఠశాలలు, తర్వాత కళాశాలలు లేక పది కిలోమీటర్ల దూరం ప్రమాదకరంగా బస్సులలో ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. విద్యాహక్కు చట్టం -2009 ప్రకారం ప్రతి ఐదు కిలోమీటర్ల పరిధిలో పాఠశాల ఉండాలి. రాజ్యాంగ సవరణ 86 ద్వారా ప్రతి విద్యార్ధికి 14 యేండ్లు వయస్సు వరకు ఉచిత నిర్బంధ విద్యను ప్రభుత్వం ఉచిత యూనిఫామ్స్, పుస్తకాలు అందించి విద్యను అందించడం చట్టం చేసింది. కానీ, రాష్ట్రంలో దాన్ని సర్కార్ ఉల్లంఘించి రాజ్యాంగం కల్పించిన చదువుకునే హక్కు లేకుండా చేస్తోంది.
ఇదే మేడ్చల్ ప్రాంతానికి ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఐదేళ్లు ఉన్నాడు. వేలకోట్ల రూపాయల అధిపతిగా పేరున్న బీఆర్ఎస్కు చెందిన మల్లా రెడ్డి కూడా మంత్రిగా పనిచేశారు. బీజేపీలో కీలకపాత్ర పోషిస్తున్న ఈటెల కూడా ఇక్కడనుండి ఎన్నికయ్యారు. వీరంతా ఓట్లకోసం ప్రజల దగ్గరకు వెళ్తారు కానీ, కనీసం ఇక్కడ విద్యా సౌకర్యాలు, సమస్యలు గురించి ఎన్నడూ అడిగింది లేదు. కొంతమందికి ఆధార్ కార్డులు కూడా లేని దుస్థితి ఉంది. ఈ ప్రాంత విద్యార్థులు ఈ దేశ, రాష్ట్ర పౌరులు కదా? వీరితో ప్రభుత్వాలకు సంబంధం లేదా? అధికారులు తమకు బడి పెట్టకపోతే ప్రజలే స్వయంగా ప్రయివేటు బిల్డింగ్ తీసుకుని బడి నడుపుతున్నారు. వారికి ఎంతమంది అక్కడ చదవుకోవడానికి అవకాశం ఉంటుందో వారికే చదువు చెబుతున్నారు. మరి బడిబయట ఉన్న పిల్లల పరిస్థితేమిటి? వారికి ఈ రాజ్యాంగం కల్పించిన విద్యహక్కు అమలు కాదా? ప్రభుత్వం ఈ ప్రాంతంలో విద్యార్థులు చదువుకోవడం కోసం కేటాయించిన నాలుగెకరాల భూమి కేటాయింపు చేస్తే, అది కోర్టు కేసులతో నలుగుతుంటే ప్రభుత్వం పరిపాలన యంత్రాంగం పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా?
జవహార్నగర్ గబ్బిలాలపేట బస్తీలో తాత్కాలికంగా నడుస్తున్న ప్రాథమిక పాఠశాలలో 120 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ఆధార్ కార్డులున్నది 62 మందికే, వారికి మాత్రమే అడ్మిషన్లు ఇచ్చారు. మధ్యాహ్న భోజనం కూడా 62 మందికే బిల్లులిస్తున్నారు. ఈ బిల్లులతో 120 మంది మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. అద్దెభవనంలో కేవలం మూడు గదులుంటే హాల్లో 4,5 తరగతులు, మిగతా రెండు గదులలో 1-3 తరగతులు నడుస్తున్నాయి. వర్షమొస్తే అంతా ఓకే రూమ్లో ఉంటారు లేదంటే సెలవు. రెండు వాష్ రూమ్లు ఉన్నాయి. మిగతా బస్తీ విద్యార్థులకు ఆధార్ కార్డులు లేవనే పేరుతో అడ్మిషన్లు ఇవ్వడం లేదు. ముగ్గురు టీచర్స్ డిప్యూటేషన్పై వచ్చారు, వారికి ఏప్రిల్ 23తో డిప్యూటేషన్ పూర్తవుతుంది. కనీసం బ్లాక్ బోర్డులు లేవు, అందరికీ రైమ్స్ పెట్టి ఎ,బి,సి అని చదివించడమే తప్ప వీరికి యూనిఫామ్స్ కూడా అందించలేదు.
తాగునీరు కూడా లేదు, చిన్న పిల్లలకు సంరక్షణకు ఆయా కూడా లేరు, వారి గదులు వారు శుభ్రం చేసుకుంటున్నారు. ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత 6 -10 వరకు చదవడానికి కనీసం పాఠశాల లేదు. ఇలాంటి పాఠశాలలు కేవలం గబ్బిలాలపేట మాత్రమే కాదు, మేడ్చల్ జిల్లాలో 23 ప్రాంతాల్లో ఉన్నాయి. చర్లపల్లిలో కూడా ఇలాంటి తరహా పాఠశాల తాత్కాలిక భవనంలో నడుస్తుంది. ఈ 23 పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు యూడైస్ గుర్తింపు లేదు. ఇలాంటి స్థితిలో ఈ పాఠశాల నడుస్తుంది. ఇదే భూములలో రాందేవ్ బాబాకు నాలుగెకరాలు భూమి భద్రతతో ఉంది, దానిలో ఉన్న ప్రయివేటు పాఠశాలకు విద్యార్థులు ఫీజులు కట్టి వెళ్తున్నారు. అంటే ప్రభుత్వమే తన బాధ్యత నుండి తప్పించుకోని ప్రయివేటు విద్యను ప్రోత్సహిస్తుంది. కోర్టులో ఉన్న భూములలో ఈ ప్రాంతం విద్యార్థుల భవిష్యత్తు బందీగా ఉంది.
రాష్ట్ర బడ్జెట్లో విద్యకు కేటాయింపులు కూడా ఈ పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. మొత్తం బడ్జెట్లో కనీసం ఇరవై శాతం విద్యకు కేటాయించాలని ఎన్నో కమిషన్లు సూచించినప్పటికీ, వాస్తవంగా అది 10-12 శాతం మధ్యలోనే ఉండిపోతోంది. ఈ తక్కువ కేటాయింపులతో ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులు ఎలా మెరుగుపడతాయి? ఉపాధ్యాయుల ఖాళీలు ఎలా భర్తీ అవుతాయి? కొత్త పాఠశాలలు ఎలా నిర్మించబడతాయి? ఈ ప్రశ్నలకు పాలకుల వద్ద సమాధానాలు కనిపించడం లేదు. కానీ, కార్పొరేట్ విద్యా సంస్థలకు మాత్రం పన్ను రాయితీలు, భూముల కేటాయింపులు సులభంగా జరుగుతున్నాయి.
విద్యను సామాజికన్యాయం సాధనంగా చూడాల్సిన ప్రభుత్వం, దాన్ని మార్కెట్ శక్తులకు అప్పగించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పం లేకపోవ డం, ఉన్న వనరులను సక్రమంగా వినియోగించకపోవడం, ప్రణాళికా లోపాలు, ఈ మూడూ కలిసి జవహర్నగర్ వంటి ప్రాంతాల్లో విద్యా సంక్షోభాన్ని మరింత తీవ్రమయ్యేలా చేస్తున్నాయి. వెంటనే భూవివాదాన్ని పరిష్కరించి పాఠశాల నిర్మాణం ప్రారంభించడం, తాత్కాలిక తరగతి గదులు ఏర్పాటు చేయడం, డ్రాప్ అవుట్ పిల్లలను తిరిగి బడికి చేర్చడం వంటివి చేయాలి. లేకపోతే ఒక తరం భవిష్యత్తు పూర్తిగా నాశనమవుతుంది.
టి.నాగరాజు
9490098292



