పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ దంపతులు
నవతెలంగాణ- భద్రాచలం
దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. మిథిలా ప్రాంగణంలో శనివారం అత్యంత వైభవంగా జరిగిన ఈ మహోత్సవానికి దేశ నలుమూలల నుంచి జనం భారీగా తరలి వచ్చారు. పట్టాభిషేకం మహోత్సవానికి విచ్చే సిన గవర్నర్ దంపతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్రాజ్ నేతృత్వంలో అధికార స్వాగతం పలికారు. గవర్నర్ ముందుగా సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పట్టాభిషేక వేడుకలు సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా జరిగాయి. తొలుత రామాలయంలో భద్రుని మండపంలో స్వామివారి పాదుకలకు అభిషేకం నిర్వహించారు.
అనంతరం గౌతమీ నది తీరం నుంచి పవిత్ర తీర్థములను తీసుకొచ్చి రాజ లాంఛనాలతో మిథిలా ప్రాంగణానికి ఊరేగింపుగా స్వామివారిని తీసుకొ చ్చారు. కల్యాణ మండపంలో స్వామివారు ఆశీనులైన అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం నిర్వహించారు. కార్యక్రమం అనంతరం సందర్శకులపై పుణ్య నదీ జలాలను చల్లి ఆశీర్వదించారు. ఈ మహోత్సవంలో వ్యవసాయ, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, ఐటీడీఏ పీఓ రాహుల్, దేవస్థానం ఈవో దామోదర్రావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



