Monday, March 30, 2026
E-PAPER
Homeజాతీయంటెక్నికల్‌ విద్యలో టీచర్ల కొరత

టెక్నికల్‌ విద్యలో టీచర్ల కొరత

- Advertisement -

భారీగా ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి అంతరం
ఐటీఐలు, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో నాణ్యతా లోపాలు
యువతకు అందని నైపుణ్యాలు.. ఉపాధిపై తీవ్ర ప్రభావం
అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ నివేదిక


న్యూఢిల్లీ : భారత్‌లో విద్య పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. బడ్జెట్‌లో కోట్ల రూపాయలు కేటాయించామనీ, మంచి పథకాలు తీసుకొచ్చామని చెప్పే ప్రభుత్వాలు.. విద్యార్థుల భవిష్యత్‌కు మాత్రం భరోసాను ఇవ్వలేకపోతున్నాయి. టెక్నికల్‌ విద్యలో పలు సమస్యలు నెలకొన్నాయి. ఇక్కడ టీచర్ల కొరత చాలా ఉంది. విద్యార్థుల సంఖ్యకు తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు లేరు. ఇక ఇండిస్టియల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ (ఐటీఐ)లు, ఇంజినీరింగ్‌ కాలేజీల్లో నాణ్యతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధికి కావాల్సిన నైపుణ్యాలు అందటం లేదు. దీంతో వారంతా నిరుద్యోగులుగా మిగిలిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ విడుదల చేసిన ‘స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా 2026’ నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

ఈ నివేదిక సమాచారం ప్రకారం… దేశంలోని టెక్నికల్‌ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుల కొరత, నాణ్యత లోపం వల్ల యువతకు సరైన నైపుణ్యాలు అందడం లేదు. ఇది భారత్‌ డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌ను ఆర్థిక లాభంగా మార్చడం లో పెద్ద అడ్డంకిగా మారు తోంది. ముఖ్యంగా ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, ఐటీఐలలో ఉపాధ్యాయులు- విద్యార్థుల నిష్పత్తి తీవ్రంగా దెబ్బతింది. ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం… ఇంజినీరింగ్‌ యూజీ కోర్సులకు 1:20, డిజైన్‌ కోర్సులు 1:15, మేనేజ్‌మెంట్‌ కోర్సులకు 1:25గా ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి ఉండాలి. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఈ నిష్పత్తి ప్రయివేటు కాలేజీ ల్లో 1:28గా, ప్రభుత్వ కాలేజీల్లో 1:47గా ఉండటం ఆందోళనకరం. ఇది దేశంలో విద్య నాణ్యతను గణనీయంగా తగ్గిస్తుందని నివేదిక స్పష్టం చేస్తోంది.

ఐటీఐల పరిస్థితి
దేశంలో ఐటీఐల సంఖ్య గత కొన్నేండ్లలో 300 శాతం పెరిగింది. ప్రధానంగా ప్రయివేటు ఐటీఐలలో నాణ్యత తగ్గింది. ట్రైనింగ్‌, ఉద్యోగాల మధ్య సంబంధం బలహీనంగా ఉంది. ఐటీఐలు ఉన్న ప్రాంతాలు, పరిశ్రమలు ఉన్న ప్రాంతాలతో సరైన అనుసంధానం లేదు. ఇది దేశంలో ఐటీఐలు ఎదుర్కొ ంటున్న విపత్కర పరిస్థితులను ప్రతిబింబిస్తున్నది.

నిరుద్యోగం
కేంద్రంలోని మోడీ పాలనలో దేశంలో నిరుద్యోగం ఏటికేడూ పెరుగుతోంది. దేశంలో 25 ఏండ్లలోపు వయస్సున్న గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం 40 శాతంగా ఉంది. 25-29 ఏండ్ల మధ్య ఉన్నవారిలో ఇది 20 శాతంగా నమోదైంది. అయితే దేశంలోని యువతకు సరైన నైపుణ్యాలు అందని కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని నివేదిక సూచిస్తోంది.

డెమోగ్రాఫిక్‌ ట్రెండ్‌
భారత్‌కు యువత ఒక బలం. ఇప్పటికీ భారత్‌ అత్యధిక సంఖ్యలో యువతను కలిగి ఉంది. ఒక దేశానికి ఇది వరమనే చెప్పుకోవాలి. 2026లో దేశంలో 15-29 ఏండ్ల వయస్సున్న యువత సంఖ్య 36.7 కోట్లుగా ఉంది. 2036కి ఇది 34.5 కోట్లకు పడిపోయే అవకాశం కనిపిస్తోంది. అంటే 2030 తర్వాత పని వయస్సు జనాభా తగ్గ డం ప్రారంభమవుతుంది. ఈ సమయం వరకు యువతకు సరైన ఉద్యోగాలు కల్పించడం అత్యంత కీలకమని విశ్లేషకులు, నిపుణులు చెప్తున్నారు.

ఇక దేశంలోని దళితులు, ఆదివాసీల ఆలోచనలు, ఆశయాలు మారుతున్నాయి. ఈ వర్గాలకు చెందిన యువత సంప్రదాయ వృత్తులను వదలిపెడుతోంది. 1983లో లెదర్‌, ఫుట్‌వేర్‌ రంగంలో వీరి వాటా 40 శాతం ఉంది. అయితే 2023లో అది 24 శాతానికి పడిపోయిందని గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే ఈ ట్రెండ్‌.. వారి ఆశయాలు, ఆలోచనల్లో కలుగుతోన్న మార్పులను, కొత్త నైపుణ్యాల అవసరాన్ని సూచిస్తున్నాయని విశ్లేషకులు వివరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -