ఇరాన్తో అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచీ ఆసియాలోని చాలా దేశాల కరెన్సీల విలువలు డాలర్తో పోల్చితే గణనీయంగా పడిపోవడం జరుగుతోంది. అయితే అన్నింటిలోకీ ఎక్కువగా దెబ్బతిన్నది మాత్రం మన రూపాయే. ఫిబ్రవరి 27న ఒక డాలర్ విలువ రూ.91.01. అది కాస్తా మార్చి 20 నాటికి రూ.93.73 అయింది. ఈ పతనానికి తక్షణ కారణం స్పష్టమే. చమురు, సహజ వాయువులను ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశం మనది. అందులో ఎక్కువ భాగం హార్ముజ్ జలసంధి మార్గాన రవాణా అవుతుంది. ఆ జలసంధిని ఎప్పుడైతే మూసివేశారో అప్పటినుంచీ మనకు చమురు, సహజ వాయువుల సరఫరా దెబ్బతింది. దానికి తోడు ముడి చమురు ధర కూడా పెరిగింది. పైగా మనకు బయట నుండి వచ్చే విదేశీ మారక ప్రవాహం దాదాపు ఆగిపోయింది. మన విదేశీ మారకపు నిల్వల స్థాయిని నిలబెట్టేది బయటనుండి వచ్చే చెల్లింపులే. ఇప్పుడు అవి నిలిచిపోవడంతో మన విదేశీ చెల్లింపుల ఖాతా మీద వత్తిడి బాగా పెరిగింది. ఇది రూపాయి విలువ పడిపోడానికి దోహదం చేసింది.
అయితే మన విదేశీ చెల్లింపుల ఖాతా కేవలం మూడు వారాల యుద్ధం పర్యవసానంగా ఇంతగా దెబ్బ తిన్నదా అంటే అదే ప్రధాన కారణం అని భావించకూడదు. మన విదేశీ చెల్లింపుల ఖాతా దెబ్బ తినబోతున్నది అన్న ముందస్తు అంచనాతో మన దేశం నుండి విదేశీ మారకం పెట్టుబడులు బయటకు ప్రవహించడం వలన ఎక్కువగా దెబ్బతిన్నది. అంతర్జాతీయంగా క్షణాల్లో తరలిపోయే ద్రవ్య పెట్టుబడి యజమానుల ముందస్తు అంచనాలు మన నిల్వల్ని దెబ్బతీశాయి. ముడి చమురు విలువతో పోల్చితే అమెరికన్ డాలర్ విలువ దెబ్బతిని పోకుండా ఉండేందుకుగాను, అదే ముడిచమురు ఉత్పత్తి చేసే దేశాల మీద దాడి చేస్తున్నది ఆ అమెరికాయే అయినప్పటికీ, అక్కడికే ప్రపంచంలోని ఎక్కడెక్కడ ఉన్న డాలర్ పెట్టుబడుల్నీ తరలించడం జరుగుతోంది. ఇక్కడ వింతల్లోకెల్లా వింత ఏమంటే, ముడి చమురు ధరతో పోల్చితే డాలర్ విలువ పడిపోతున్నప్పుడు, మూడవ ప్రపంచ దేశాల కరెన్సీల విలువలు ఆ డాలర్తో పోల్చినప్పుడు పెరగడం పోయి పడిపోతున్నాయి! ఎందుకిలా జరుగుతుంది?
ముడి చమురు దిగుమతికి చెల్లించవలసిన మొత్తం ఎప్పుడైతే పెరుగుతుందో, అప్పుడు అలా పెరిగిన ఖర్చుకు తగినట్టు పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచి భారాన్ని ప్రజలమీదకు నెడతారు. ఇలా ధరలు పెరగడం వలన ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ద్రవ్యోల్బణం పెరిగినందున మన కరెన్సీ విలువ తగ్గుతుంది. అప్పుడు దాని ప్రభావం కేవలం చమురు ఉత్పత్తుల వరకే పరిమితం కాదు. మనం దిగుమతి చేసుకునే అన్ని సరుకుల ధరలూ పెరుగుతాయి. ఎందుకంటే ఆ లావాదేవీలన్నీ డాలర్లలోనే జరుగుతాయి. చమురు ధర డాలర్లలో కూడా పెరుగుతుంది కాబట్టి అమెరికాలో కూడా ద్రవ్యోల్బ ణం పెరుగుతుంది. కాని అమెరికాలో పెరిగే ద్రవ్యోల్బణం కన్నా అధికంగా మూడవ ప్రపంచ దేశాల్లో మరిన్ని రెట్లు ఎక్కువ పెరుగుతుంది. మన ఇతర దిగుమతులు కూడా డాలర్ కరెన్సీలోనే జరుగుతాయి కనుక ఇలా జరుగుతుంది.
రిజర్వు బ్యాంక్ తన వద్దనున్న నిల్వల నుండి గత మూడు వారాల్లో ఏకంగా రెండువేల కోట్ల డాలర్ల మేరకు మార్కెట్లోకి విడుదల చేసి రూపాయి విలువ పడిపోకుండా నిలబెట్టడానికి ప్రయత్నించింది. అయిన ప్పటికీ, మన రూపాయి విలువ పడిపోతుందన్న అంచనాలు ఎంత బలంగా పని చేశాయంటే, ఇంత పెద్ద ఎత్తున విడుదల చేసిన నిల్వలు కూడా రూపాయి పతనాన్ని అడ్డుకోలేకపోయాయి. బహుశా ఇలా నిల్వలను విడుదల చేయకపోయి వుంటే ఈ పతనం ఇంకా ఎక్కువ మోతాదులో ఉండేది. దీనిని బట్టి మార్కెట్లో స్పెక్యు లేటర్ల ముందస్తు అంచనాల ప్రభావం ఎంత బలంగా పని చేస్తుందో మనకు తెలుస్తోంది.
నిజానికి ఇరాన్ యుద్ధం మొదలు కాకముందే ఈ ముందస్తు అంచనాల ప్రభావం పనిచేయడం మొదలైంది. జనవరి 1న 89.94 ఉన్న రూపాయి విలువ ఫిబ్రవరి 27 నాటికి 91.01కి పడిపోయింది. రెండు నెలల్లో ఇది జరిగింది. ఇరాన్ యుద్ధం మొదలయ్యాక పెరిగిన చమురు ధరల ప్రభావం అదనంగా తోడై మూడు వారాల్లోనే 93.73కి పడిపోయింది. ”సురక్షిత” ప్రాంతానికి తమ డాలర్ నిల్వలను తరలించుకుపోవాలన్న ఇన్వెస్టర్ల తాపత్రయం ఈ క్రమాన్ని మరింత వేగవంతం చేస్తోంది. విశ్లేషకులైతే ఈ పతనం కొనసాగి రూపాయి విలువ 95 కన్నా దిగువకు చేరుతుందని అంచనాలు వేస్తున్నారు. మన రిజర్వు బ్యాంక్ దగ్గర 70వేల కోట్ల డాలర్ల నిల్వ ఉన్నప్పటికీ రూపాయి పరిస్థితి ఇలా ఉంది.
అంటే విదేశీ మారకపు నిల్వలు మన రిజర్వు బ్యాంక్ దగ్గర భారీగా ఉన్నా అవేవీ రూపాయి విలువ పతనాన్ని అడ్డుకోలేకపోతున్నాయని కనిపిస్తోంది. ఆ నిల్వల నుండి భారీగా మార్కెట్లోకి డాలర్లను విడుదల చేసి రూపాయి విలువ పడిపోకుండా ఆపాలని రిజర్వు బ్యాంక్ ప్రయత్నించింది. కాని ఇంత భారీ నిల్వలను విడుదల చేస్తోందంటే రూపాయి విలువ రాబోయే రోజుల్లో ఇంకా పడిపోనుంది అన్న ముందస్తు అంచనాలు ఇన్వెస్టర్లలో మరింత బలపడ్డాయి. దాంతో ఇప్పుడు రిజర్వు బ్యాంక్ ఇక ముందు నిల్వల విడుదల చేసే విషయంలో పునరాలోచన చేస్తోంది. విదేశీ మారకపు నిల్వలను రుణ వాయిదాల చెల్లింపుకు, లేదా విదేశీ చెల్లింపుల ఖాతాలో లోటు ఏర్పడితే దానిని భర్తీ చేయడానికి విడుదల చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. అంతేతప్ప ఇన్వెస్టర్ల అంచనాలు ఈ విధంగా ప్రతికూలంగా ఉన్నప్పుడు రూపాయి విలువ పతనాన్ని అడ్డుకోడానికి నిల్వలను ఖర్చు చేయడం వల్ల ఉపయోగం ఉండదు.
మన విదేశీ వ్యాపారపు లావాదేవీలలో సమకూర్చుకున్న మిగులుతో మన విదేశీ మారకపు నిల్వలలో ప్రధాన భాగం ఏర్పడినట్లయితే దాని మీద దేశం చెల్లించే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. అదే విదేశాల నుండి ద్రవ్య పెట్టుబడి ప్రవాహం రూపంలో వచ్చిన దాంతో ప్రధానంగా మన నిల్వలు ఏర్పడితే వాటికి చెల్లించే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మన రిజర్వు బ్యాంక్ దగ్గరున్న డాలర్ నిల్వల నుండి బ్యాంక్కి వచ్చే వడ్డీ రేటు 1.5 శాతానికి మించదు. అదే బైట నుండి వచ్చే డాలర్ పెట్టుబడులకు వడ్డీ 7 నుండి 8 శాతం వరకూ చెల్లిస్తున్నారు. అంటే ఎక్కువ వడ్డీకి అప్పు తెచ్చి తక్కువ వడ్డీకి అప్పులిచ్చినట్లు అవుతోంది! ఇటువంటి నిల్వలు ఎంత ఎక్కువ ఉంటే మన దేశానికి అంత భారమే అవుతుంది తప్ప బలం కాజాలదు.
ఇలా అప్పులు చేసి విదేశీ నిల్వలను సమకూర్చుకునే విధానం నయా ఉదారవాద విధానాల అమలులో అంతర్భాగమే. ఇందులో సుంకాల ఆంక్షలు కాని, దిగుమతి చేసుకునే సరుకుల పరిమాణం మీద కాని ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలూ విధించకూడదని నయా ఉదారవాదం పట్టుబడుతుంది. ద్రవ్య పెట్టుబడి తన ఇష్టం వచ్చిన రీతిలో దేశంలోకి రావడానికి, పోడానికి ఎటువంటి ఆటంకాలూ ఉండకూడదని నిర్దేశిస్తుంది. అందుచేత మన రూపాయి విలువ కొద్దిమంది అంతర్జాతీయ ఫైనాన్సు మదుపుదారుల అపరిమిత లాభాపేక్షకు బలౌతుంది. రూపాయి విలువతోబాటు కోట్లాది శ్రామిక ప్రజల జీవితాలు కూడా బలౌతూ వుంటాయి. ఈ హానికర పర్యవసానాలు ప్రస్తుతం మన కళ్లెదుట మన దేశంలో జరుగుతున్నాయి.
అయితే, ఇటువంటి నయా ఉదారవాద పెత్తనం బారి నుంచి బయటపడే పెద్ద అవకాశాలు కూడా ప్రస్తుత పరిణామాలు కల్పిస్తున్నాయి. సుంకాలను పెంచకూడదన్న నిబంధనను డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఉల్లంఘించాడు కాబట్టి మన దేశం కూడా మనకు తగిన రీతిలో సుంకాలను విధించవచ్చు. అప్పుడు విదేశీ వ్యాపారంలో లోటు పెరగకుండా సర్దుబాటు చేసుకోవచ్చు. అంతేకాదు. ఇప్పుడు అమెరికా చాలా ఎక్కువ దేశాల మీద ఆంక్షలు విధించింది. ఇలా ఆంక్షలకు గురైన దేశాలన్నీ కూడబలుక్కుని ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కాని, బహుళపక్ష ఒప్పందాలు కాని వాటిలో అవి కుదుర్చుకోగలిగితే, అది కూడా డాలర్ కొలబద్ద లేకుండా కుదుర్చుకోగలిగితే ఇక డాలర్ల మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా పోతుంది. వీలైతే ఇటువంటి ఒప్పందాల్లో సరుకుల విలువల ప్రాతిపదికన ఇచ్చిపుచ్చుకునే విధానాలను, ఒక ఏడాదిలో వాణిజ్య లోటును వచ్చే ఏడాదిలో సర్దుబాటు చేసుకునే విధానాన్ని అమలు చేస్తే ఇంకా ప్రయోజనకరం.
ఇలా డాలర్ల అవసరం లేని అంతర్జాతీయ వాణిజ్యం చేపడితే అప్పుడు డాలర్ నిల్వలను భారీగా సమకూర్చుకోవలసిన అవసరం లేకుండా పోతుంది. ఆ నిల్వల కోసం అంతర్జాతీయ స్పెక్యులేటర్ల మీద ఆధారపడవలసిన అగత్యమూ ఉండదు. అప్పుడు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆదేశాలకు తలొగ్గవలసిన అవసరమూ ఉండదు. కాని మోడీ ప్రభుత్వం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన రూటులో నడుస్తోంది. ఈ సమయంలోనే మోడీ ప్రభుత్వం చాలా దేశాలతో వరుస పెట్టి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల మీద సంతకాలు చేసేస్తోంది. వాటి వలన మన విదేశీ వాణిజ్యం పెరగవచ్చు. కాని నికరంగా మన ఎగుమతులు పెరిగే అవకాశాలైతే లేవు. ఎగుమతులు పెరగనప్పుడు దేశీయంగా ఉపాధి అవకాశాలూ పెరగవు. పైగా ఇటువంటి ఒప్పందాలు ఎన్ని చేసినా మన దేశం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఉచ్చు నుంచి బయట పడడం సాధ్యం కాదు.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్



