ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయిల్ దుష్టకూటమి ఇరాన్పై ప్రారంభించిన దాడులకు ముందు వారు అనుకున్నదొకటి అయింది, అవుతు న్నదీ మరొకటి. పండుగాడి దెబ్బ తగిలినట్లుంది ట్రంప్కు, అందుకే ఏం మాట్లాడు తున్నాడో, ఉన్మాదంతో ఏం చేస్తున్నాడో చూస్తున్నాం. ఇది రాస్తున్న సమయానికి హార్ముజ్ జలసంధిని ఇరాన్ తెరవకపోయినా దాడులను ముగించాలనుంది అన్నట్లుగా వార్తలొచ్చాయి. దాడులు ఐదవ వారంలో ప్రవేశించాయి. అయినప్పటికీ భీకరదాడులు కొనసాగు తూనే ఉన్నాయి. జలసంధిని తెరవటం తన ప్రాధాన్యతల్లో లేదన్నాడు, అందుకే అందని ద్రాక్ష పుల్లన అనే సామెత వచ్చింది. ఎన్ని అదిరింపులు, బెదిరింపులకు పాల్పడినా నాటో కూటమి దేశాలు ఇది తమ యుద్ధం కాదంటూ జలసంధి ఛాయలకు వచ్చేది లేదని చెప్పాయి. ‘మీ మీద దాడులు జరుపుతున్నా మీకు పౌరుషం లేదా’ అంటూ దాడుల్లో భాగస్వాములను చేసేందుకు గల్ఫ్ దేశాలను రెచ్చగొట్టినా కావాలంటే నష్టాల ఖర్చులను భరిస్తాం తప్ప వచ్చేది లేదన్నట్లుగా అవి ఉన్నాయి. దీంతో ట్రంప్కు ఉన్న పిచ్చికాస్త మరింత ముదిరింది.
ఈ నేపధ్యంలో వాల్స్ట్రీట్ జర్నల్ అనే అమెరికా దినపత్రిక కథనం సారాంశం ఇలా ఉంది. హార్ముజ్ జలసంధిని తెరవకపోయినా ఆపరేషన్ ఎపిక్ ఫురీ దాడులను ముగించేస్తానని మిత్రదేశాలకు ట్రంప్ చెప్పాడు. వ్యూహాత్మకమైన ఆ జలసంధిని తెరిపించేందుకు చేసే ఏ ప్రయత్నమైనా ట్రంప్ చెప్పిన గడువు దాటి వివాదం మరింతగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. జలసంధిని తెరిపించే అంశాన్ని తరువాత చూసుకో వచ్చు. ప్రస్తుతానికి అది ప్రాధాన్యత కలిగిన అంశం కాదు. ముందు ఇరాన్ నౌకా దళాన్ని, క్షిపణులు తయారీ సామర్ధ్యాన్ని బలహీనపరచి దాడులను నిలిపివేస్తే తరువాత దౌత్యపరంగా టెహరాన్ను వత్తిడి చేయవచ్చు. అది కూడా విఫలమైతే ఐరోపా ఇతర ప్రాంతాల్లో ఉన్న మిత్రదేశాలు రంగంలోకి దిగి చొరవ చూపాలని ట్రంప్ కోరతాడు. మిలటరీ చర్యలను నిలిపివేసేందుకు జలసంధిని తెరిపించటం ముఖ్యమైన లక్ష్యాల్లో ఒకటి కాదని అధ్యక్ష భవనం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్, దాడులు ముగిసిన తరువాత ఏదో విధంగా జలసంధి తిరిగి తెరుచుకొనే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి మార్క్ రూబియో చెప్పాడు. ఎందుకంటే మూసివేయటం అంతర్జాతీయ న్యాయ చట్టాలకు విరుద్ధం అని రూబియో అన్నాడు. నౌకా దళంలో కొంత భాగాన్ని ముంచివేయ టంతో సహా భారీ నష్టాలు జరిగినా ఇంకా ఇరాన్ ప్రతిఘటిస్తున్నది. త్వరగా దాడులను ముగిస్తానని చెబుతూనే ఇప్పటికే ట్రిపోలీ అనే భారీ యుద్ధనౌక, రెండున్నరవేల మందికి పైగా మెరైన్లను మధ్య ప్రాచ్య ప్రాంతానికి అమెరికా తరలించింది. మరో పదివేల మంది పదాతి దళాలను చేరవేసేందుకు చూస్తున్నది. ఇది రాస్తున్న సమయానికి బ్రెంట్ రకం ముడి చమురు పీపా ధర 113 డాలర్ల వద్ద ఉండగా మనదేశం దిగుమతి చేసుకొనే రకం ముడి చమురు ధర 121 డాలర్లు(నాలుగురోజుల నాటిది) ఉంది. అంతకు ముందు 157డాలర్లకు పెరిగింది.
దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి.
కాల్పుల విరమణ చర్చల సంగతి ఎటూ తేలలేదు, అమెరికా షరతులకు లొంగేది లేదని ఇరాన్ కరాఖండిగా చెప్పింది. పరిస్థితి ఇలా ఉంటే పశ్చిమాసియా సంక్షోభంతో ప్రపంచంలో తలెత్తే ఆర్థిక సమస్యల గురించి చర్చ మొదలైంది. నెల రోజులు దాటిన యుద్ధంతో చమురు నుంచి ఆహారం వరకు ప్రభావితం అవుతున్నాయి. అమెరికాకు మంగళవారం నాటి వరకు 36 బిలియన్ డాలర్లకు పైగా నష్టం జరిగింది. ప్రతి సెకనుకు 11,574 డాలర్లు (డాలరకు 95 రూపాయలు) ఖర్చవుతున్నాయి. ప్రపంచం 1970వ దశకం నాటి స్టాగ్ఫ్లేషన్కు (ఆర్థిక రంగం గిడసబారటం, ధరలు, నిరుద్యోగం పెరుగుదల దీని లక్షణాలు) గురవుతుందా అని కొందరు సందేహిస్తుండగా పరిస్థితి తీవ్రంగా ఉంది తప్ప అలాంటి అవకాశం లేదని మరికొందరంటున్నారు. అమెరికాలో గడచిన తొమ్మిది నెలల్లో మూడుసార్లు అక్కడి కార్మికవర్గం రాజులు లేరు, రాజరికాలు లేవు అంటూ ట్రంప్కు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. తొలిసారి 50, రెండవసారి 70, మూడవసారి 90లక్షల మంది పాల్గొ న్నారు. మూడవసారి మార్చి చివరి వారంలో జరిగిన ప్రదర్శనల్లో అమెరికాలో జరిగిన రోజునే వివిధ ఖండాల లోని పన్నెండు దేశాలలో కార్మికులు స్థానిక సమస్యలను తీసుకొని ప్రదర్శనలు జరపటం విశేషం. ఈ ఆందోళనలకు అమెరికా వినియోగదారులపై పడిన గ్యాస్ భారమే కారణం. దీనికి ట్రంప్ బాధ్యుడని వేరే చెప్పన వసరం లేదు. పరీక్షా సమయంలోనే ఎవరేమిటో తెలుస్తుందం టారు. దేశం కోసం-ధర్మం కోసం ఏమైనా చేస్తామని ఒట్టి కబుర్లు చెప్పటం తప్ప తాజా పరిస్థితికి కారకుడైన తన మిత్రుడిని మన మోడీ ఇంతవరకు తప్పు పట్టలేదు.
ఇరాన్పై దాడుల తరువాత అనేక దేశాల్లో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. వాటి విలువ ఎంతన్నది స్పష్టంగా చెప్పలేము.మన దేశంలో రు.51లక్షల కోట్లు నష్టపోయినట్లు అంచనా, ఇంకా పతనం కొనసాగితే నష్టాలు పెరుగుతాయి. అమెరికాలో జతకూర్చిన సమాచారం ప్రకారం ఒక్క రోజులో ఎస్ అండ్ పి 500 సూచిక 1.66శాతం పతనంతో ఒక లక్ష కోట్ల డాలర్లు, నాస్డాక్ 2.09శాతం పతనంతో ఆరువందల బిలియన్ డాలర్లు, డౌ సూచిక 1.2శాతం పతనం 300 బి.డాలర్లు మొత్తం ఒక్కరోజులో 1.2లక్షల కోట్ల డాలర్లు ఆవిరైంది. ఈ ఏడాది చివరి నాటికి అమెరికా మాంద్యంలోకి వెళ్లేందుకు 37శాతం అవకాశాలున్నట్లు పోలీ మార్కెట్ అంచనా వేసింది. కార్పొరేట్ కంపెనీలు పెరిగిన ఖర్చులను వినియోగదారుల మీద మోపితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి అడుగేస్తారు, నియామకాలు తగ్గిపోతాయి.అమెరికాలో ఉత్పత్తి అయ్యే డబ్ల్యుటిఐ రకం ముడి చమురు ధర 2025 డిసెంబరులో 57 డాలర్లు ఉంటే ఇది రాసిన సమయంలో 102 డాలర్లు ఉంది. దీనికనుగుణంగానే అమెరికాలో ధరలు పెరిగాయి. ఫిబ్రవరిలో విమాన ఇంథనం పీపాధర 99 డాలర్లు ఉంటే మార్చినెల 20న 197 డాలర్లకు పెరిగింది. స్లోక్ అనే ఆర్థికవేత్త జనవరిలో అమె రికా ఆర్థిక స్థితి గురించి ఆశాభావం వెలిబుచ్చాడు. ఎప్పుడైతే ట్రంప్ యుద్ధాన్ని ప్రారంభించాడో ఇప్పుడా పెద్దమనిషి స్టాగ్ఫ్లేషన్ అవకాశాల గురించి హెచ్చరించాడు.
ముందే చెప్పుకున్నట్లు డోనాల్డ్ ట్రంప్ అనుకున్నదొకటి, జరుగుతున్నది మరొకటి. పశ్చిమాసియా సంక్షోభాన్ని ట్రంప్ ఎలా ముగిస్తాడో తెలియదు. స్వస్తి పలకటం అనివార్యం, అయితే అది అమెరికా నిర్దేశించినట్లు కాదు. ఇప్పుడు ఇరాన్ తన షరతులను ముందుకు తెస్తున్నది, ఇది ట్రంప్ కలలో కూడా ఊహించి ఉండడు. పెట్రో డాలర్ను సవాలు చేస్తూ చైనా యువాన్తో లావాదేవీలు జరిపేవారి నౌకలను హార్ముజ్ జలసంధి నుంచి అనుమతిస్తామని అది ప్రకటించింది. ఆ కరెన్సీలోనే అది కప్పం వసూలు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఇరాన్ యుద్ధం చైనా పెట్రో యువాన్కు శక్తినిస్తుందని అమెరికా డాలర్ ఆధిపత్యం బలహీనపడుతుందని ఈ పరిణామాల గురించి హాంకాంగ్ నుంచి వెలువడే సౌత్ చైనా మోర్నింగ్ పోస్ట్ పత్రిక వ్యాఖ్యానించింది. ఇతర దేశాలను తన అదుపులో ఉంచుకొనేందుకు తనకు అనుగుణంగా ఆడించేందుకు ఉక్కిరి బిక్కిరి చేసే అంశాలుగా ప్రపంచంలోని చమురు సంపద, ఇతర వనరులను వినియోగించు కొనేందుకు వాటి మీద అదుపు సాధనకు అమెరికా ఎప్పుడో ఎత్తువేసింది.ఇప్పుడు అనూహ్యంగా గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ అదే పాత్ర పోషించాలని చూస్తోంది. సూయజ్ కాలువ ద్వారా మధ్యధరా సముద్రంలో ప్రవేశించేందుకు పర్షియా గల్ఫ్-ఎర్ర సము ద్రాన్ని అనుసంధానం చేసే అల్ మండాబ్ జలసంధిని కూడా ఎమెన్ ద్వారా తన అదుపులోకి తెచ్చుకుంటామని హెచ్చరించింది. అదే జరిగితే ఐరోపా దేశాలను కూడా అది ఒక ఆట ఆడించగలదు. అమెరికా అనుసరిస్తున్న మొరటు సూత్రం ఒక్కటే. ఎవరినైనా అదుపులోకి తెచ్చుకోవాలంటే అంతర్జాతీయ సూత్రాలను పక్కన పెట్టు, జనం మీద బాంబులువేసి చంపు, దేశాలను నాశనం చేయి, అప్పుడు జనం నిరాశతో లొంగిపోతారు. అమెరికా అడుగుజాడల్లో నడుస్తున్న ఇజ్రా యిల్ పాలస్తీనా ప్రాంతమైన గాజాలో చేసింది అదే. ఆస్పత్రులు, స్కూళ్లు, సహాయ కేంద్రాలు వేటినీ వదలకుండా నాశనం చేసింది, 70వేల మందికి పైగా పిల్లలు, మహిళలను చంపి వేసింది. ఆ ప్రాంతాన్ని మరుభూమిగా మార్చింది. అయినప్పటికీ హమాస్గానీ, పాలస్తీనియన్లుగానీ ఇజ్రాయిల్కు లొంగలేదు. ఇప్పుడు ఇరాన్ కూడా యావత్ప్రపంచానికి అదే సందేశమిచ్చింది.
మార్చినెల 31, ఏప్రిల్ ఒకటవ తేదీల్లో చైనా సందర్శించాలని ట్రంప్ కార్యక్రమం నిర్ణయించు కున్నాడు. ఈ తేదీ లకు ఉన్న ప్రాధాన్యత ఏమంటే ఐరాసలో కమ్యూనిస్టు చైనాను గుర్తించిన తరువాత అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ 1972 తొలిసారిగా బీజింగ్ను సందర్శించాడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అవసరం లేకపోయినా జపాన్ మీద అణుబాంబులు వేసి అమెరికా ప్రపంచాన్ని భయపెట్టింది. బహుశా డోనాల్డ్ ట్రంప్ లేదా అతగాడికి సలహాలు ఇచ్చిన వారు కూడా అలాంటి దుష్టాలోచననే ముందు పెట్టి ఉండాలి. అయితే ఈ సారి ప్రపంచం కంటే తనకు పోటీగా సవాల్ విసురుతున్న చైనాను బెదిరించేందుకు, తద్వారా ఇతర దేశాలను ప్రభావితం చేసేందుకు సిద్ధపడి నట్లు కనిపి స్తోంది. చైనా పర్యటన ఎప్పుడో ఖరారైంది గనుక ఈ లోగా ఇరాన్ను దెబ్బతీసి దాన్నే చైనా ముందు ప్రదర్శించాలన్న దుష్టా లోచనతోనే ఫిబ్రవరి 28న దాడులు ప్రారంభించినట్లు చెప్పవచ్చు. ట్రంప్ ఆలోచన ఏమిటి ? ”రెండు మూడు వారాల్లో ఇరాన్ మీద విజయం సాధిస్తాం. చైనా వెళ్లినపుడు షీ జిన్పింగ్తో చర్చల్లో చూశారుగా ఇరాన్ పాలకులను మార్చాం, అక్కడ గతంలో రష్యాలో బోరిస్ ఎల్సిన్ అనే తొత్తును పీఠం ఎక్కించి నట్లుగా మాకు అనుకూలమైన వాడిని పదవిలో ప్రతిష్టించాం.వాడు అక్కడి చమురు నిల్వలన్నింటి మీద అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తాడు. ఇప్పటికే వెనెజులా చమురును స్వాధీనం చేసుకున్నా.మీకు ముడిచమురు అవసరం గనుక మేం చెప్పినట్లు వింటే, మాకు అవసరమైన విలువైన ఖనిజాలను మాకు సమర్పించుకుంటే ఓకే లేకపోతే మీ మీద కూడా ఆంక్షలు పెడతాం” అని రిహార్సల్స్ వేసుకున్న ట్రంప్కు ఇరాన్ చుక్కలు చూపించింది. దాంతో మార్చి నెలాఖరులో చైనా పర్యటనను వాయిదా వేసుకున్నాడు. మే 14,15 తేదీల్లో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. జరుగుతున్న పరిణామాలను బట్టి అది కూడా జరుగుతుందా వాయిదా పడుతుందా అన్నది చూడాల్సి ఉంది. తొందరేం లేదు, ఎప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చన్నట్లుగా చైనా ఉంది. చివరిగా చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశం ఒకటుంది.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అది వియ త్నాం,ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, లిబియా ఏ దేశం మీద దాడి చేసినా అమెరికాకు మిత్ర దేశాలు సహకరించాయి. తొలిసారిగా ఇరాన్పై దాడికి ముఖం చాటేశాయి, అది తమ యుద్ధం కాదని ప్రకటిం చాయి. కొంతమంది వర్ణించినట్లు ఇప్పుడు జరుగుతున్న దాడి కేవలం ఇరాన్ మీద కాదు, దానికి మద్దతిస్తున్న రష్యా, చైనాల మీద అన్నది నిజమేనా! చరిత్రలో మరో నూతన అధ్యాయం ప్రారంభమవుతుందా! ఏం జరుగుతుందో చూద్దాం!!
ఎం కోటేశ్వరరావు
8331013288



