కేంద్రంపై జాన్ బ్రిట్టాస్ విమర్శలు
న్యూఢిల్లీ : విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ)కు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుందని సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ విమర్శించారు. ఈ అంశంపై అడిగే సాధారణ పార్లమెంటరీ ప్రశ్నలను కూడా ‘రహస్యమైనవి’గా ప్రభుత్వం పరిగణిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్లో జాన్ బ్రిట్టాస్ ఒక పోస్టు చేశారు. ‘ ఎఫ్సీఆర్ఏ సస్పెన్షన్లు, రద్దులు, పునరుద్ధరణలు లేకపోవడం, కొత్త రిజిస్ట్రేషన్లు, అలాగే, ఎఫ్సీఆర్ఏ డాష్బోర్డు నుంచి ఎన్జీఓల వారీగా డేటాను తెలుసుకోవడానికి ప్రజలను నిరాకరించడం.. వంటి అంశాలపై స్పష్టత కోరుతూ 2024 నుంచి ఇప్పటి వరకూ ఎనిమిది సమర్పించానని, అయినప్పటికీ ఈ ప్రశ్నల్లో దేనికీ స్పందన రాలేదు’ అని ఈ పోస్టులో జాన్ బ్రిట్టాస్ విమర్శించారు. అలాగే, ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రద్దులకు సంబంధించిన అన్ని అడిగిన అన్ని ప్రశ్నలను రాజ్యసభ విధానాలు రూల్ 47 (2) (22) కింద అనుమతించడం లేదని కేంద్రం తెలిపిందని, కానీ నిజానికి ఈ నిబంధన ‘దేశ రహస్యాలు’ను కోరే ప్రశ్నలను నిషేధిస్తుందని సీపీఐ(ఎం) ఎంపీ తెలిపారు.
రాష్ట్రాల వారీగా ఎన్ని సంస్థలు తమ ఎఫ్సీఆర్ఏ లైసెన్సులను కోల్పోయాయి, లైసెన్సుల తిరస్కరణ లేదా పునరుద్ధరించకపోవడానికి గల కారణాలు, ఎఫ్సీఆర్ఏ పోర్టల్ ద్వారా ప్రజలకు సమాచారాన్ని నిరాకరించడానికి గల కారణాలు వంటి ‘ప్రాథమిక ప్రశ్నలను’ కూడా గత రెండేండ్లుగా నిరోధించారని బ్రిట్టాస్ తెలిపారు.
‘పారదర్శకతగా ఉంచాలనుకున్న విషయమే ‘రహస్యం’గా మారినప్పుడు, ముందుగా జవాబుదారీతనం బలి అవుతుంది. ప్రజా ధార్మిక సంస్థల కోసం ఉద్దేశించిన నిర్ణయాల్లో అంత రహస్యం ఏముటుంది?, పార్లమెంటుకు కూడా ఆ సమాచారాన్ని వెల్లడించకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు?’ అని బ్రిట్టాస్ విమర్శించారు.
ఎఫ్సీఆర్ఏపై ప్రాథమిక సమాచారాన్నీ నిరాకరిస్తుంది
- Advertisement -
- Advertisement -



