Thursday, April 2, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఆధిపత్యానికి అస్థిరతే ఇంధనం

ఆధిపత్యానికి అస్థిరతే ఇంధనం

- Advertisement -

ప్రపంచం నేడు విరామంలేని ఉద్రిక్తతల వలయంలో ఉక్కిరిబిక్కిరవుతోంది.. ఎన్నడూ లేనంత అస్థిరతలో కొట్టు మిట్టాడుతోంది. ఒకవైపు శాంతి, సహకారం, అభివృద్ధి అనే మాటలు అంతర్జాతీయ వేదికలపై ప్రతిధ్వనిస్తుంటే.. మరోవైపు నేలపై యుద్ధాల మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ఘర్షణలు కేవలం సరిహద్దుల వద్దే ఆగిపోవడం లేదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోకి, సాంకేతిక రంగాల్లోకి కూడా చొరబడుతున్నాయి. దేశాల మధ్య అవిశ్వాసం పెరుగుతోంది. అనిశ్చితి ఇప్పుడు ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్త వాతావరణంగా మారుతోంది. ఈ నేపథ్యం ఒక తప్పించుకోలేని ప్రశ్నను మన ముందుకు తెస్తోంది. అదేమిటంటే.. ఈ అస్థిరత యాదృచ్ఛికమా? లేక ఒక ప్రణాళికాబద్ధమైన రాజకీయ-ఆర్థిక ప్రక్రియలో భాగమా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనలను విడివిడిగా కాకుండా, ఒక సమగ్ర దృశ్యంగా చూడాలి.

అలా చూసినపుడు దీనివెనుక ఒక స్పష్టమైన దిశ, ఒక కేంద్ర శక్తి కనిపిస్తుంది. ఆ శక్తి అమెరికా. ఇది వాదన కాదు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న విభిన్న పరిణామాలను పరిశీలిస్తే కనిపించే వాస్తవం. ముఖ్యంగా యూరప్‌లో, పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధాలు, ఇండో ఫసిఫిక్‌లో నెలకొన్న అలజడులు విషయాన్ని మరింత బలంగా ఎత్తిచూపుతున్నాయి.
రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అమెరికా పాత్ర కేవలం ”పరిశీలకుడు”గానే లేదు, ప్రధాన నిర్వాహకుడిగా ఉంది. ఉక్రెయిన్‌కు భారీ సైనిక సహాయం, ఆయుధ సరఫరా, ఇంటెలిజెన్స్‌ మద్దతు.. ఇవన్నీ యుద్ధాన్ని త్వరగా ముగించడానికి కాకుండా, దీర్ఘకాలికంగా కొనసాగించడానికే దోహదపడుతున్నాయి.

దీనిద్వారా అమెరికా రెండు కీలక ప్రయోజనాలను సాధిస్తోంది. ఒకటి, రష్యాను దీర్ఘకాలిక సైనిక-ఆర్థిక ఒత్తిడిలో ఉంచుతోంది. రెండు, యూరప్‌ను మళ్లీ తన భద్రతా కవచం కిందకు తెచ్చుకుంటోంది. అదే సమయంలో నాటో(NATO)విస్తరణ కూడా వేగవంతమైంది. అంతేకాదు, రష్యా ఎనర్జీపై ఆధార పడిన యూరప్‌, ఇప్పుడు అమెరికా LNG దిగుమతులపై ఆధారపడే పరిస్థితికి చేరుకుంది. ఇది యుద్ధం వల్ల వచ్చిన అనుకోని పరిణామం కాదు. ఇది అమెరికా వ్యూహాత్మకంగా సాధించిన ఫలితం. మధ్య ప్రాచ్యం(Middle East)లో అమెరికా పాత్ర మరింత స్పష్టంగా ఉంది. ఇది ప్రపంచ రాజకీయాలకు హృదయం లాంటిది. అపారమైన చమురు, గ్యాస్‌ నిక్షేపాలతో పాటు ప్రపంచ వాణిజ్య మార్గాలకు ఇది ఆయువుపట్టు. ఇక్కడ శాంతి ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఎందుకంటే, ఇది కేవలం స్థానిక విభేదాల ఫలితం కాదు.

ఇది ఆధిపత్య శక్తుల పోటీకి వేదిక. ఇక్కడి హోర్ముజ్‌ జలసంధి, సూయజ్‌ కాలువ వంటి మార్గాలు ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకం. ఈ మార్గాలపై ప్రభావం చూపగలిగితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపగలుగుతారు. అందుకే ఇక్కడి ఘర్షణలు ఎప్పుడూ ముగియవు. కాకపోతే వాటి రూపం మారుతుంది, పాత్రలు మారుతాయి, కానీ, అస్థిరత మాత్రం కొనసాగుతుంది. ఇక్కడ అమెరికా ”బాహ్య శక్తి” కాదు, ప్రధాన జోక్యశక్తి. గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ అమెరికా చేసిన సైనిక దాడులు, పాలక మార్పులు, ప్రత్యక్ష-పరోక్ష జోక్యా లన్నీ ఈ ప్రాంతాన్ని స్థిరంగా కాకుండా అస్థిరంగా ఉంచే వ్యూహంలో భాగాలే. ఈ అస్థిరత వల్ల అమెరికాకు మూడు ప్రధాన ప్రయోజనాలు లభిస్తున్నాయి. చమురు, గ్యాస్‌ ప్రవాహాలపై నియంత్రణ, ప్రాంతీయ శక్తులను పరస్పరం బలహీనపరచడం, తన సైనిక ఉనికిని శాశ్వతంగా కొనసాగించడం. హార్ముజ్‌ జలసంధి వంటి కీలక మార్గాల భద్రత పేరుతో అమెరికా తన నౌకాదళాన్ని నిరంతరం అక్కడ ఉంచుతోంది. అంటే, ఇక్కడ అమెరికా అస్థిరతను కేవలం ఉపయోగించడం కాదు, దాన్ని సృష్టించి కొనసాగిస్తోంది.

ఇక ఇప్పటి ప్రపంచంలో మరో కీలక ప్రాంతం ఇండో-పసిఫిక్‌. కారణం-చైనా ఆర్థిక, సాంకేతిక, వ్యూహాత్మక ఎదుగుదల. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ”సహజ పోటీ”గా చూపించే ప్రయత్నం జరుగుతోంది. కానీ, వాస్తవం అది కాదు. ఇక్కడ జరుగుతున్నది స్పష్టమైన వ్యూహం. చైనాను ఎదగనీయకుండా అడ్డుకోవడం. అమెరికా ఈ ప్రాంతాన్ని ఒక ”యుద్ధరంగం”గా కాకుండా, ఒక ”ఒత్తిడి వలయం”గా మార్చుతోంది. దక్షిణ చైనా సముద్రం (South China Sea)లో ”స్వేచ్ఛా నావిగేషన్‌” పేరుతో అమెరికా నౌకాదళం నిరంతరం తిరుగుతూ ఉంటుంది. కానీ ఇది వాణిజ్య స్వేచ్ఛ కోసం కాదు, ”నీ పరిధి ఇక్కడితో ముగుస్తుంది” అని చైనాకు ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వడానికి. దక్షిణ చైనా సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు కేవలం భౌగోళిక వివాదాలు కావు. ఇవి సముద్ర మార్గాలపై, వాణిజ్య నియంత్రణపై, మరియు ప్రభావ పరిధిపై అమెరికా పన్నుతున్న పన్నాగాలు.

అమెరికా ఇక్కడ మిత్రదేశాలతో కలిసి రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా చైనాపై ఒక వ్యూహాత్మక ముట్టడి (encirclemen)ని నిర్మిస్తోంది. సైనిక స్థావరాల విస్తరణ, సంయుక్త యుద్ధ విన్యాసాలు, సముద్ర మార్గాలపై పర్యవేక్షణ పెంపు ఇవన్నీ కలిపి ఒకే లక్ష్యంగా పని చేస్తున్నాయి. అది ఎదుగుతున్న చైనా శక్తిని నియంత్రించడం. ఇది ప్రత్యక్ష యుద్ధం కాదు. కానీ ఒక స్పష్ట మైన వ్యూహం. చైనాను చుట్టుముట్టి, దాని ప్రభావాన్ని పరిమితం చేయడం. ప్రత్యక్ష యుద్ధం లేకుండానే నిరంతర ఒత్తిడిలో ఉంచడం. అందుకే ఈ ఉద్రిక్తతలు సహజమైనవి కావు. అవి అమెరికా నిర్మిస్తున్న శక్తి సమీకరణాల ప్రత్యక్ష ఫలితాలు. ప్రపంచ అస్థిరతలో అమెరికా పాత్రను అర్థం చేసుకోవాలంటే, ఆర్థిక కోణాన్ని నేరుగా చూడాలి. యుద్ధాలు జరిగే ప్రతిచోట ఒక సాధారణ అంశం కనిపిస్తుంది. అదేమి టంటే లాభం. ఆయుధ పరిశ్రమలు విస్తరిస్తాయి. భద్రతా ఖర్చులు పెరుగుతాయి. ఇంధన ధరలకు రెక్కలు మొలుస్తాయి.

డాలర్‌ ఆధిపత్యం బలపడుతుంది. ఈ పరిణామాలన్నిటి నుంచి ఒక స్పష్టమైన నిజం బయట పడుతుంది. అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ సరఫరాదారు. యుద్ధాలు పెరిగితే అమెరికా ఆయుధ ఎగుమతులు పెరుగుతాయి. యూరప్‌, ఆసియా దేశాలు తమ రక్షణ ఖర్చులను పెంచి నప్పుడు, వాటి ప్రధాన లబ్దిదారులు అమెరికా కంపెనీలే కావడం గమనార్హం. అంతేకాదు, ప్రపంచంలో అస్థిరత పెరిగితే పెట్టుబడులు ”సురక్షిత మార్కెట్‌”గా భావించే అమె రికాకు వెళ్లే అవకాశాలు మెరుగవుతాయి. ఇది డాలర్‌ ఆధిపత్యాన్ని మరింత బలపరుస్తుంది. దీన్నిబట్టి ప్రపంచ అస్థిరత అమెరికాకు కేవలం రాజకీయ లాభం మాత్రమే కాదు, భారీ ఆర్థిక లాభం కూడా అని అర్థమవుతుంది. అంటే, యుద్ధాలు కేవలం సైనిక ఘర్షణలు మాత్రమే కాదు, అవి ఆర్థిక వ్యవస్థను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియలు.

అంతిమంగా సారాంశంలో గుర్తించాల్సింది ఏమిటంటే.. సామ్రాజ్యవాదానికి సంక్షోభం ఒక అవసరం. పెట్టుబడిదారీ శక్తులు తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి ప్రపంచాన్ని నిరంతరం తమ ప్రయోజనాలకు అనుగుణంగా మలుచుకుంటాయి. ఈ ప్రక్రియ సహజంగానే ఉద్రిక్తతలను పెంచుతుంది, ఘర్షణలకు దారితీస్తుంది, యుద్ధాలకు అవకాశాలు సృష్టిస్తుంది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను గమనిస్తే ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ సంక్షోభం వైఫల్యం కాదు, ఒక ప్రణాళిక. ప్రపంచాన్ని స్థిరంగా ఉంచడం కంటే, తమ నియంత్రిత అస్థిరతలో ఉంచడమే ఆధిపత్య రాజకీయాల అసలు లక్షణంగా మారింది. అందుకే అమెరికా ప్రతి యుద్ధాన్నీ స్వయంగా ప్రారంభించకపోయినా, వాటి చుట్టూ అందుకు అవసరమైన పరిస్థితులను నిర్మిస్తుంది, వాటిని కొనసాగిస్తుంది.

వాటి ద్వారా వ్యూహాత్మక, ఆర్థిక లాభాలను సాధిస్తుంది. ఈ విధానంలో తుదిలక్ష్యం స్పష్టమే.. ప్రపంచ శక్తి సమీకరణాలను తనకు అనుకూలంగా ఉంచుకుంటూ, ఆధిపత్యాన్ని నిరంతరం పునరుద్ధరించుకోవడం. ఈ మొత్తం వ్యూహంలో అత్యంత బాధితులు ఎవరంటే.. ప్రజలే. ఈ సంక్షోభాలకు, సైనిక చర్యలకు మూల్యం చెల్లించేది అమెరికా కాదు.. ప్రపంచ ప్రజలు. సాధారణ ప్రజలు. యుద్ధాలు వాళ్ల ఇళ్లను ధ్వంసం చేస్తాయి. ఆర్థిక సంక్షోభాలు వాళ్ల ఉపాధిని విచ్ఛిన్నం చేస్తాయి. వారి జీవన వ్యయాలు మోయలేని భారాలవుతాయి. లక్షలాది మంది శరణార్థులుగా మారే పరిస్థితులూ వస్తాయి. అయితే ఈ బాధలేవీ ప్రపంచ రాజకీయాల్లో పెద్దగా ప్రతిధ్వనించవు. ఎందుకంటే అస్థిరత వల్ల లాభపడేవారికి ఇవి కేవలం ”పర్యవసానాలు” మాత్రమే.

ఈ నేపథ్యంలో నుంచి ప్రపంచాన్ని చూస్తే, అది యుద్ధాల సమాహారంగా కాదు.. ఒక వ్యూహంలో భాగంగా కనిపిస్తుంది. ప్రాంతాలు వేరు కావచ్చు. సంఘటనలు వేరు కావచ్చు. కానీ వాటి వెనుక ఉన్న లక్ష్యం ఒక్కటే.. వనరులను దోపిడీ చేయడం. తమ మార్కెట్‌ను విస్తరించుకోవడం, ప్రపంచాన్ని నియంత్రించడం. దేశాలను ఎంత అస్థిరంగా ఉంచితే, నియంత్రణ అంత సులభం. అప్పుడే ప్రతి యుద్ధం ఒక ఒత్తిడి సాధనంగా, ప్రతి సంక్షోభం దోపిడీకి ఒక అవకాశంగా మారుతుంది. అందువల్ల, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అస్థిరత ఒక పరిణామం కాదు-ఒక విధానం. అస్థిరత ఒక ప్రమాదం కాదు-ఒక ప్రణాళిక. అస్థిరత ఆధిపత్యానికి అత్యంత ప్రభావవంతమైన ఆయుధం. యూరప్‌, మధ్యప్రాచ్యం, ఇండో-పసిఫిక్‌.. ఇవన్నీ వేర్వేరు కథలు కావు. ఒకే కథలోని భిన్న అధ్యాయాలు. ఆ కథ పేరు-ఆధిపత్యం.ఆ కథను నడిపిస్తున్న శక్తి-అమెరికా సామ్రాజ్యవాదం.

రమేష్‌ రాంపల్లి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -