నవతెలంగాణ-హైదరాబాద్: స్వాతంత్ర్య దినోతవ్సం వేళ జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉద్రిక్తత నెలకొంది. తిరంగా యాత్రలో పాల్గొనేందుకు ప్రయత్నించిన జార్ఖండ్ లోక్ క్రాంతికారీ మోర్చా (JLKM) నాయకుడు దేవేంద్ర నాథ్ మహను పోలీసులు నిర్భందించారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC) నిర్వహించిన నియామక పరీక్షలలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా వేలాది విద్యార్థులు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే.పలువురు విద్యార్థులు 20 రోజులకు పైగా నిరహర దీక్ష చేస్తున్నారు.
తాజాగా పేపర్ లీక్ లను వ్యతిరేకిస్తూ శనివారం రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో విద్యార్థులంతా జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. నిరాహర దీక్ష లో ఉన్న విద్యార్థి నాయకులు వీల్ చైర్ లో కూర్చొని ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ఆస్పత్రిలో ఉన్న దేవేంద్ర నాథ్ మహ తిరంగా ర్యాలీలో పాల్గొనేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయనను బలవంతంగా గదిలో నిర్భందించారు.
“నిరసన జరుగుతున్న జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ,’తిరంగా మార్చ్’లో పాల్గొనాలనే నా కోరికను తెలియజేసిన తర్వాత, సదర్ ఆసుపత్రిలోని నా గది బయట భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అసలు ఇది ఎలాంటి స్వేచ్ఛ? మన సొంత దేశంలోనే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి, ‘తిరంగా మార్చ్’లో పాల్గొనడానికి కూడా మనకు స్వేచ్ఛ లేదా? క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ, నేను శాంతియుత పద్ధతిలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నాను,” అని మహ ‘X’లో పోస్ట్ చేశారు.





