వాటి నివారణకు చర్యలు తీసుకోండి : బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో నోరు తెరిస్తే నోట్లోకి దోమలు పోతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దోమల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లోని అసెంబ్లీ మీడియా హాల్లో దోమతెరతో కుట్టించిన గౌన్తో ఆయన వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దోమలతో హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ హయంలో నాలుగైదుసార్లు దోమల బెడద నివారణకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. దోమ కాటు వల్ల డెంగ్యూ, మలేరియా సోకి పేదలు ఆస్పత్రి పాలవుతున్నారని చెప్పారు. ప్రతి డివిజన్కు 10 ఫాగింగ్ మిషన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆ బిల్లును ఉపసంహరించండి :ప్రతిపక్ష నేత రాహుల్గాంధీకి దాసోజు శ్రవణ్ లేఖ
తెలంగాణ ‘హేట్ స్పీచ్ బిల్లు 2026’ వెంటనే ఉపసంహరించాలని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్కుమార్ డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీకి ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘మొహబ్బత్ కీ దుకాన్ అంటూ దేశమంతా తిరిగిన రాహుల్ గాంధీ. ఆ దుకాన్ను హైదరాబాద్లో రేవంత్రెడ్డి తగలబెడుతున్నారు’ అని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని చేతబట్టి రాహుల్ 4వేల కిలోమీటర్లు నడిచారనీ, అదే రాజ్యాంగాన్ని రేవంత్ బుల్డోజర్తో తొక్కుతున్నారని విమర్శించారు. రేవంత్రెడ్డి అవినీతిని, వైఫల్యాలను ప్రశ్నించే వారే లక్ష్యంగా ఈ బిల్లు తీసుకొచ్చిందని ఆరోపించారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
చికెన్ రిటైల్ దుకాణాలకు మర్జిన్ రూ. 44 ఇస్తున్నాం పౌల్టీ కంపెనీల ప్రకటన
చికెన్ రిటైల్ దుకాణాలకు మార్జిన్ ఇవ్వడం లేదనే దుష్ప్రచారాన్ని నమ్మొద్దు అని పౌల్టీ కంపెనీలు విజ్ఞప్తి చేశారు. కిలో చికెన్పై మార్జిన్ దాదాపు రూ. 44.5 ఇస్తున్నట్టు ఈమేరకు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. ఇతర వ్యాపారాల కంటే పౌల్ట్రీ రంగం భిన్నంగా ఉంటుందని తెలిపాయి. ఈ రంగంలో చివరికి నష్టపోయేది రైతులు, కంపెనీలు మాత్రమేనని గుర్తు చేశారు. రైతులు, వినియో దారులు నష్టపోతారు తప్ప మధ్యలో ఉన్న వారు లాభాలు పొందుతున్నారని పేర్కొన్నారు. మార్కెట్ ధరల్లో ఎన్ని హెచ్చు తగ్గులున్నా.. వారి మార్జిన్కు ఏ నష్టమూ ఉందని తెలిపాయి. సమ్మె చేస్తామంటూ బెదిరించడం సరైంది కాదని పేర్కొన్నాయి.



