ఇకనైనా ఇద్దరు ఆటగాళ్లను తీసుకోవాలి
ఎస్ఆర్హెచ్ కార్యాలయం ఎదుట టీడీసీఏ ధర్నా
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ క్రికెటర్లను సన్రైజర్స్ హైదరాబాద్ చిన్న చూపు చూస్తుందని తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం అధ్యక్షుడు, శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం బంజారాహిల్స్లోని ఎస్ఆర్హెచ్ కార్యాలయం ఎదుట క్రీడా విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి వెంకటేశ్వర్ రెడ్డి మెరుపు ధర్నా చేశారు. ‘ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో తెలంగాణ నుంచి 100 మంది క్రికెటర్లు పేర్లను నమోదు చేసుకున్నారు. వేలంలో సన్రైజర్స్ తెలంగాణ నుంచి ఒక్కరిని కూడా కొనుగోలు చేయలేదు. ఆరోన్ జార్జ్, అమన్రావు సహా పలువురు ప్రతిభావంతులైన క్రికెటర్లు వేలంలో అందుబాటులో ఉన్నప్పటికీ కనీస ధరకు సైతం తీసుకోవాలనే ఆలోచన సన్రైజర్స్ యాజమాన్యానికి లేదు. తెలంగాణ అభిమానుల మద్దతు, మౌలిక సదుపాయాలు కావాలని గానీ, ఇక్కడి క్రికెటర్లకు కనీస అవకాశాలు ఇవ్వరా?. సన్రైజర్స్ యజమాని కావ్య కళానిధి మారన్ సమాధానం చెప్పాలని’ అల్లీపురం వెంకటేశ్వర్ డిమాండ్ చేశారు. ఐపీఎల్ పాలకమండలితో చర్చించి వేలంలో నమోదు చేసుకున్న తెలంగాణ క్రికెటర్లలో కనీసం ఇద్దరికి అవకాశం కల్పించాలని సన్రైజర్స్ను కోరారు. ఈ ధర్నాలో టీడీసీఏ ఆఫీస్ బేరర్లు సహా విద్యార్థి సంఘాల నాయకులు రాజేష్, ప్రశాంత్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
మన క్రికెటర్లపై సన్రైజర్స్ చిన్న చూపు
- Advertisement -
- Advertisement -



