ఒక్కో విద్యార్థిపై రూ.1.05 లక్షల ఖర్చు
రాష్ట్రంలో రూ. 20వేల కోట్లతో 59 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్
విద్యార్థులకు రవాణా సౌకర్యం
ఏఐని తట్టుకునేలా స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి
భవిష్యత్ దృష్ట్యా స్కిల్ యూనివర్సిటీ
ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతంలో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలి : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం విద్యారంగంలో పలు మార్పులు తీసుకువచ్చిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు స్కూల్స్కు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కూడా కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ఏవీఎన్ లేక్ఫిల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టం చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు.
25 ఎకరాల్లో విశాలమైన విద్యాసంస్థను నిర్మించడంలో ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ఆలోచన విధానం బాగుందని తెలిపారు. ఇదే తరహాలో ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను నిర్మాణం చేస్తోందన్నారు. 25 ఎకరాల్లో 2,500 మంది విద్యార్థులకు రెసిడెన్సియల్స్ క్యాంపస్ను నిర్మిస్తున్నామని చెప్పారు. మొదట దఫాలో 59 స్కూల్స్ నిర్మాణానికి రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత విద్యావ్యవస్థ నాణ్యత లేదన్నారు. 6వ తరగతి పిల్లలు తమ తరగతి పుస్తకం చదవమంటే చదవలేని స్థితిలో ఉన్నారన్నారు. ఆరో తరగతి చదువుతున్న పిల్లల్లో ఆ క్లాసు పుస్తకం చదవగలిగిన వారు 6.6 శాతం మాత్రమే అన్నారు. ఈ పరిస్థితి పోగొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని తెలిపారు.
నాటి దేశ ప్రధాని నెహ్రూ ప్రభుత్వ విద్యావ్యవస్థను నెలకొల్పారని అన్నారు. ఆయన ఆలోచనలతోనే దేశంలో నిరక్ష్యరాస్యత తగ్గిందన్నారు. ప్రస్తుతం వస్తున్న సాంకేతికతను తట్టుకుని నిలదొక్కుకోవడానికి స్కిల్స్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ దృష్ట్యా రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యతోపాటు క్రీడాల్లోనూ రాణించాలన్నారు. ప్రపంచ క్రీడాపోటీల్లో కూడా తెలంగాణ క్రీడాకారులు రాణించే విధంగా స్టోర్స్ యూనివర్సిటీని కూడా నెలకొల్పనున్నట్టు చెప్పారు. విద్యారంగంలో ఒక్కో విద్యార్థిపైన ప్రభుత్వం రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తోందన్నారు. ఇంత ఖర్చు చేసినప్పుడు మెరుగైన విద్యను విద్యార్థులకు అందకపోవడం బాధకరమైన విషయమన్నారు. భవిష్యత్లో ఇలాంటి పరిస్థితి లేకుండా కఠినమైన నిర్ణయాలు ఉండనున్నాయని స్పష్టం చేశారు. ప్రయివేటు రంగ సంస్థలు కూడా విద్య విషయంలోనూ నాణ్యతను ప్రదర్శించాలన్నారు.



