Sunday, April 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఫుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపు

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఫుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపు

- Advertisement -

– అడ్డుకున్న చిరు వ్యాపారులు.. ఆందోళన
– పోలీస్టేషన్‌లో సర్దిచెప్పిన పోలీసులు
నవతెలంగాణ- బేగంపేట్‌

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. జీహెచ్‌ఎంసీ అధికారులు జేసీబీలతో వెళ్లి అక్రమ నిర్మాణాలను తొలగిస్తుండగా చిరు వ్యాపారులు అడ్డుకున్నారు. ఎన్నో ఏండ్లుగా ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు తొలగిస్తే ఎక్కడికి పోవాలంటూ ప్రశ్నించారు. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకురాగా, బాధితులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆందోళనకు దిగారు. గోపాలపురం ట్రాఫిక్‌, మార్కెట్‌ లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులతో కలిసి శనివారం సికింద్రాబాద్‌ స్టేషన్‌ రోడ్డులో పాలికబజార్‌, సుభాష్‌పాడ్‌, అల్ఫాహోటల్‌, బాలానగర్‌ బస్టాండ్‌, మోండా మార్కెట్‌ తదితర ప్రాంతాల్లో దుకాణాల ముందు ఏర్పాటు చేసిన షాపులను, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను జేసీపీలతో పూర్తిగా తొలగించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రగతి ప్రణాళిక 90రోజుల కార్యక్రమాలు, హైకోర్టు ఆదేశాల మేరకు మల్కాజిగిరి మున్సిపల్‌, హైదరాబాద్‌ మున్సిపాల్‌ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ఫుట్‌పాత్‌ల క్రమణలపై కొరఢా ఝలిపించినట్టు అధికారులు తెలిపారు. పాదచారులు నడిచేందుకు ఫుట్‌పాత్‌లపై అవకాశం లేకపోవడం, అదే విధంగా వ్యాపారులు కూడా ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టి.. వ్యాపార కేంద్రాలను కొనసాగిస్తున్నారని తెలియజేశారు. ఈ ఆక్రమణలను తొలగించడంతో పాదచారులు నడిచేందుకు అవకాశాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో ఆయా ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లను తొలగించామని, అదే విధంగా ట్రాఫిక్‌ సజావుగా సాగేందుకు డ్రైవ్‌లో ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఫుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపు పనులను జీహెచ్‌ఎంసీ చీఫ్‌ సిటీ ప్లానర్‌ శ్రీనివాస్‌, జోనల్‌ కమిషనర్‌ మంగతాయారు, జోనల్‌ సిటీ ప్లానర్‌ శ్రీనివాసులు, ఏసీపీలు సాయిబాబా, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణశ్రీ, పావని, ట్రాఫిక్‌ ముల్కాజిగిరి ఏసీపీ చంద్రశేఖర్‌రెడ్డి, మార్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌్‌ రాంచందర్‌, గోపాలపురం ఇన్‌స్పెక్టర్‌్‌ రవికుమార్‌ పరిశీలించారు. నగరంలో అక్రమ నిర్మాణాలను పూర్తిగా నివారించేందుకు ఇటువంటి చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు

చిరువ్యాపారుల ఆందోళన
51ఏండ్లకు పైగా సికింద్రాబాద్‌ హాకర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా జీహెచ్‌ఎంసీ అధికారులు వ్యాపారాలకు సంబంధించిన సామాగ్రిని తీసుకుంటే వెంటనే షెడ్లను తొలగిస్తామని తెలిపారు. అయితే, అందుకు సహకరించిన వ్యాపారులు వారి సామాగ్రిని కొంతవరకు తీసుకోవడంతో.. కొంతమేరకు ఫుట్‌పాత్‌ ఆక్రమణలను తొలగించారు. అయితే ట్రాఫిక్‌ ఏఎస్‌ఐ ఆక్రమణలను పూర్తిగా తొలగించాలని జీహెచ్‌ఎంసీ సిబ్బంది, క్రేన్‌ సిబ్బందిని ఆదేశించడంతో చిరు వ్యాపారులంతా ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసుకోండని చెప్పడంతో ట్రాఫిక్‌ ఏఎస్‌ఐ, పోలీసుల సిబ్బందిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వ్యాపారులంతా మార్కెట్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఆందోళన చేశారు. అక్కడ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌, మార్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌్‌ రాంచందర్‌రావు వారికి నచ్చజెప్పి పంపించడంతో ఆందోళన సద్దుమణిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -