రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బృందాకరత్ కౌంటర్
కన్నూరు : కేరళలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల తర్వాత లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) కనమరుగైపోతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు బృందాకరత్ తిప్పికొట్టిరు. కన్నూరు జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. ‘ఎన్నికల తర్వాత ఎల్డిఎఫ్ కనుమరుగవుతుందని రాహుల్ గాంధీ అంటున్నారు..అంటే ఆయనకు మతతత్వ బీజేపీ కంటే లౌకికవాద ఎల్డీఎఫ్ అంతమే ప్రధానమైంది..ఇది కాంగ్రెస్ అసలు నైజం’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 1959లో కేరళలో ‘వామపక్షాల శకం ముగిసింది’ అని ప్రకటిస్తూ రాహుల్ ముత్తాత (జవహర్లాల్ నెహ్రూ), నాయనమ్మ (ఇందిరా గాంధీ) కుట్రపూరితంగా నాటి ఈఎంఎస్ నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు.
కానీ ఆ తర్వాత వారు తమ మాటలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రాహుల్ గాంధీకి కూడా అదే గతి పడుతుందని ఆమె తెలిపారు. ఇక ముఖ్యమంత్రి పినరయి విజయన్పై రాహుల్ చేసిన ఆరోపణలను కూడా బృందాకరత్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ వ్యక్తిగత దాడులకు దిగుతోందన్నారు. తాము ఎప్పుడూ విధానాలు, వామపక్షాల దార్శనికత గురించి మాట్లాడతామే మినహా వ్యక్తిగత విమర్శలు చేయబోమని ఆమె స్పష్టం చేశారు. రాహుల్ మాటల తీరు చూస్తుంటే.. ఆయన కేరళకు వచ్చేటప్పుడు తన మెదడును ఢిల్లీలోనే వదిలేసి వస్తున్నట్టుగా ఉందని ఆమె తెలిపారు.



