నవతెలంగాణ – హైదరాబాద్: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 28 పరుగులు చేయడం ద్వారా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ తిరగరాశాడు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్కు ముందు, కోల్కతా నైట్ రైడర్స్పై 1,161 పరుగులతో రోహిత్ శర్మ ఈ రికార్డును కలిగి ఉన్నాడు. తాజా ఇన్నింగ్స్తో చెన్నైపై కోహ్లీ మొత్తం పరుగుల సంఖ్య 1,188కి చేరింది. దీంతో టీ20 ఫార్మాట్లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆసక్తికరంగా, ఈ జాబితాలో పంజాబ్ కింగ్స్పై 1,159 పరుగులతో కోహ్లీ మూడో స్థానంలో కూడా ఉండటం విశేషం.



