నవతెలంగాణ – డిచ్ పల్లి : తెలంగాణ యూనివర్సిటీ ఉర్దూ విభాగం “ఉర్దూలో పరిశోధన కళ – ఆధునిక అవసరాలు” అనే శీర్షికతో ఒకరోజు ప్రత్యేక సెమినార్ ను ఏప్రిల్ 8న బుధవారం యూనివర్సిటీలోని సెమినార్ హాల్లో నిర్వహిస్తున్నట్లు ఉర్దూ విభాగం అధ్యక్షుడు డాక్టర్ ముహమ్మద్ అబ్దుల్ ఖవి వివరించారు. సోమవారం తెలంగాణ యూనివర్సిటీ లో సెమినార్ కు సంబంధించిన కార్యక్రమ పత్రికను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. యాదగిరి రావు,రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యం.యాదగిరి తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సెమినార్ ముఖ్య లక్ష్యం ఉర్దూ పరిశోధనలో ఆధునిక మార్గదర్శకాలు, పరిశోధనా పద్ధతులు, డిజిటల్ వనరుల వినియోగం వంటి అంశాలపై విద్యార్థులు, పరిశోధకులు అవగాహన పొందడం, ప్రస్తుత యుగంలో పరిశోధన విస్తృతం, బహుముఖంగా మారిన నేపథ్యంలో, విద్యార్థులను ఆధునిక అవసరాలకు తగిన పరిశోధకులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ సెమినార్ ను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. యాదగిరిరావు చీఫ్ పాట్రన్ గా, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి, పాట్రన్ గా పర్యవేక్షిస్తారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. రామ్ బాబు , ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్ ప్రొఫెసర్ ముహమ్మద్ మూసా ఖురేషి సహాయ పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు.
ఉర్దూ విభాగం అధ్యక్షుడు డాక్టర్ ముహమ్మద్ అబ్దుల్ ఖవి ఈ సెమినార్ కు కన్వీనర్ డైరెక్టర్గా వ్యవహరిస్తుండగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్పర్సన్ డాక్టర్ గుల్ ఎ రానా సహాయ కన్వీనర్గా ఉన్నారు. సెమినార్ లో ముఖ్య వక్తలుగా ప్రముఖ పరిశోధకుడు విమర్శకుడు, ఉస్మానియా యూనివర్సిటీ ఉర్దూ విభాగ మాజీ అధిపతి డాక్టర్ మోయీద్ జావేద్, అలాగే ప్రముఖ విద్యావేత్త, మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ , తెలంగాణ యూనివర్సిటీ పూర్వ సెనేట్ సభ్యుడు డాక్టర్ ముహమ్మద్ నజీమ్ అలీ పాల్గొంటున్నారు.సెమినార్కు వివిధ అకడమిక్ సెషన్లలో పరిశోధన ప్రాథమిక సూత్రాలు, పరిశోధనా అంశం ఎంపిక, ఆధునిక పరిశోధనా పద్ధతులు, డిజిటల్ వనరుల వినియోగం, పరిశోధనలో నైతిక విలువలు తదితర అంశాలపై సవివరంగా మార్గదర్శనం చేస్తుందని కన్వీనర్ డాక్టర్ ముహమ్మద్ అబ్దుల్ ఖవి తెలిపారు.సెమినార్ ద్వారా విద్యార్థులలో పరిశోధనా చైతన్యం పెరిగి, వారి విద్యా, మేధో సామర్థ్యాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. డాక్టర్ ముహమ్మద్ అబ్దుల్ ఖవి అసిస్టెంట్ కన్వీనర్ డాక్టర్ గుల్ రానా, యూనివర్సిటీ ఉపాధ్యాయులు, పరిశోధక విద్యార్థులు ఈ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో పాల్గొని లాభం పొందాలని విజ్ఞప్తి చేశారు.ఈ సెమినార్ ఉర్దూ పరిశోధన రంగంలో ఒక గంభీరమైన, నాణ్యమైన విద్యా ప్రయత్నంగా తెలంగాణ యూనివర్సిటీ లో గుర్తింపు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.



