Tuesday, April 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంతాత్కాలిక కాల్పుల విరమణకు 'నో'

తాత్కాలిక కాల్పుల విరమణకు ‘నో’

- Advertisement -

త్వరలో ముసాయిదాపై స్పందిస్తాం : ఇరాన్‌
హార్ముజ్‌పై గుత్తాధిపత్య శకం ముగిసిందని స్పష్టీకరణ
ఇరాన్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మృతి
తాజా భీకర దాడుల్లో 34 మందికి పైగా మరణం
అల్టిమేటంలు, షరతులు, బెదిరింపులు ద్వారా చర్చలు జరపం : ఇరాన్‌
టెహ్రాన్‌:
పశ్చిమాసియాలో దాదాపు నలభై రోజులుగా కొనసాగుతున్న యుద్ధాన్ని తాత్కాలికంగా విరమించేందుకు ఇరాన్‌ సుముఖంగా లేదని ఓ సీనియర్‌ ఇరాన్‌ అధికారి తెలిపారు. కాల్పుల విరమణకు సంబంధించిన ముసాయిదా ప్రణాళిక ఇరాన్‌కు అందిందని ఆయన సోమవారం వెల్లడించారు. తాత్కాలిక కాల్పుల విరమణకు ప్రతిగా హార్ముజ్‌ను తిరిగి తెరిచే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. శాశ్వతంగా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడానికి అమెరికా సంసిద్ధంగా లేదని ఇరాన్‌ భావిస్తోందని అన్నారు. కాగా రెండంచెల ముసాయిదా ప్రణాళికను పాకిస్తాన్‌ గత రాత్రి ఇరుపక్షాలకు అందజేసింది. ముందుగా తక్షణమే కాల్పుల విరమణను ప్రకటించి, ఆ తర్వాత సమగ్ర ఒపందాన్ని కుదుర్చుకోవాలని ఆ ముసాయిదా పేర్కొంది. మధ్యవర్తుల ద్వారా ఇటీవల తమకు అందిన కాల్పుల విరమణ ప్రతిపాదనలపై ఇరాన్‌ తన వైఖరిని తెలియజేసిందని, అల్టిమేటంలు, షరతులు, బెదిరింపులు ద్వారా చర్చలు జరగవని ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బాఘె స్పష్టం చేశారు. ఓ పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలు కొన్ని ఉన్నాయని, వాటిని ఇప్పటికే మధ్యవర్తుల ద్వారా తెలియజేశామని అన్నారు. అయితే ఇవి మితిమీరి ఉన్నాయంటూ అమెరికా పంపిన 15పాయింట్ల ప్రణాళికను ఇరాన్‌ ఇప్పటికే తిరస్కరించిందని తెలిపారు. చట్టబద్ధమైన తమ డిమాండ్లను స్పష్టంగా వివరించడంలో ఇరాన్‌ వెనుకాడబోదని అన్నారు. ఆ విధంగా చేయడాన్ని రాజీ సంకేతంగా భాష్యం చెప్పరాదని అన్నారు. దానికన్నా తమ వైఖరులను నిర్వచించడంలో తమ విశ్వాసాన్ని వ్యక్తీకరించడంగా చూడాలని తెలిపారు. త్వరలో మా స్పందనలు తెలియపరుస్తాం, వివరాలు వెల్లడిస్తామని ఆయన ప్రకటించారు. కాల్పుల విర మణ ప్రణాళికపై ఇరాన్‌ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన పైవిధంగా చెప్పారు. కాగా అమెరికా నుంచి ఎలాంటి స్పందన వెలువడలేదు. పాకిస్తాన్‌ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తాహిర్‌ అండ్రబి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.

ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మృతి
ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మాజిద్‌ ఖాదెమి సోమవారం నాటి దాడుల్లో మృతి చెందారు. అమెరికా-యూదు (ఇజ్రాయిల్‌) శత్రువు జరిపిన తీవ్రవాద దాడిలో మాజిద్‌ మరణించారని ఇరాన్‌ గార్డ్స్‌ను ఉటంకిస్తూ ఇరాన్‌ మీడియా వెల్లడించింది. గతేడాది ఇజ్రాయిల్‌ జరిపిన వైమానిక దాడుల్లో అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మరణించడంతో మాజిద్‌ బాధ్యతలు చేపట్టారు. తాజా దాడుల్లో ఆయన కూడా చనిపోయారు. ఇరాన్‌ భద్రతా యంత్రాంగ వ్యవస్థలో అంచెలంచెలుగా ఎదుగుతూ గూఢచర్యం, ప్రతి గూఢచర్యం పాత్రల్లో ఆయన దశాబ్దాలుగా అనుభవం గడించారు. ఇంటెలిజెన్స్‌ హెడ్‌గా ఖాదెమి బాధ్యతలు చేపట్టడానికి ముందుగా ఇరాన్‌ రక్షణ శాఖలో పలు కీలక పాత్రలు పోషించారు. విదేశీ ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు దేశీయ నిఘా రంగంలో ఇంటెలిజెన్స్‌ విభాగానిది కీలక పాత్ర.


హార్ముజ్‌కు పూర్వపు హోదా ఇచ్చేది లేదు
అంతర్జాతీయ నౌకల రవాణాకు కీలకమైన హార్ముజ్‌ జలసంధికి పూర్వపు హోదా తిరిగి ఇచ్చే ప్రశ్నే లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది. ఈ యుద్ధానికి ముందున్న పరిస్థితి మళ్ళీ రాదని పేర్కొంది. ఇతర దేశాల నౌకల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేదని, కేవలం తమ శత్రు దేశాల నౌకలకు మాత్రం ఎలాంటి అనుమతినిచ్చే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది. మార్చడానికి వీల్లేని కొన్ని వ్యూహాత్మక మార్పులు చేపట్టామని తెలిపింది. ఈ మేరకు ఐఆర్‌జీసీ నేవీ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఈ జలసంధిపై విదేశీ గుత్తాధిపత్యం శకం ఇక ముగిసింది’ అని వ్యాఖ్యానించింది. ఇటీవల జరిగిన ప్రాంతీయ పరిణామాలు కొత్త వాస్తవికతను నెలకొల్పాయని, ఆ నేపథ్యంలో ఇక ఇరాన్‌ సమీప సముద్ర జలాల్లో అమెరికా తన షరతులు, నిబంధనలు నిర్దేశించలేదని తేల్చి చెప్పింది

టెహ్రాన్‌లో 34 మంది మరణం
హార్ముజ్‌ జలసంధిని తిరిగి తెరవాలని లేదా ఒప్పందం కుదుర్చుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఇరాన్‌కు ఇచ్చిన 10రోజుల గడువు ముగిసిపోతున్న తరుణంలో ఇక భీకర దాడులు తప్పవని ట్రంప్‌ ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌లో పలుచోట్ల సోమవారం జరిగిన దాడుల్లో 25మంది మరణించారు. టెహ్రాలోని షరీఫ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు జరిపినట్టు ఇజ్రాయిల్‌ ఆర్మీ ప్రకటించింది. ఇరాన్‌ పారామిలటరీ రివల్యూషనరీ గార్డ్స్‌ నియంత్రణలో గల ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణి కార్యక్రమంపై మిలటరీతో కలిసి ఈ యూనివర్శిటీ పనిచేస్తోంది. ఇందుకు గానూ ఈ యూనివర్శిటీపై అనేక ఏండ్లుగా అనేక దేశాలు ఆంక్షలు విధించాయి.

కాగా ఈ దాడులకు ప్రతిగా ఇజ్రాయిల్‌పై, గల్ఫ్‌ అరబ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ కూడా క్షిపణులతో విరుచుకుపడింది. ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారు జామున టెహ్రాన్‌లో పలుచోట్ల పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు, తక్కువ ఎత్తులో ఎగురుతున్న విమానాల శబ్దాలు వినిపించాయి. గంటల తరబడి దాడులు కొనసాగాయి. టెహ్రాన్‌లో ప్రభుత్వ లక్ష్యాలపై దాడులు పూర్తి చేశామని ఇజ్రాయిల్‌ ఆర్మీ ప్రకటించింది. ఈ దాడుల్లో వర్సిటీ క్యాంపస్‌కు సమీపంలోని గ్యాస్‌ పంపిణీ కేంద్రం దెబ్బతింది. అక్కడున్న ఇతర భవనాలు కూడా ధ్వంసమయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -