Wednesday, April 8, 2026
E-PAPER
Homeమానవిమామిడితో మ‌జాగా..

మామిడితో మ‌జాగా..

- Advertisement -

వేసవిలో మామిడికాయలు విరివిరిగా లభిస్తాయి. మామిడి పండును ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరూ. పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. అలాంటి మామిడి పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చాలా మంది వీటితో వివిధ రకాల రెసిపీలు చేస్తుంటారు. సాధారణంగా మామిడి పులిహౌర, పప్పు, ఆవకాయ వంటివి చేస్తుంటారు. అయితే దీంతో ఇంకా ఎన్నో రకాల రెసిపీలు చేసుకోవచ్చు. అవేంటో ఈరోజు తెలుసుకుందాం…

షర్బత్‌
కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు – నాలుగు, బెల్లం తురుము – మూడు కప్పులు, యాలకుల పొడి – టీ స్పూన్‌, ఐస్‌ క్యూబ్స్‌ – కొన్ని.
తయారీ విధానం: కుక్కర్‌లో నాలుగు గ్లాసుల నీళ్లు పోయాలి. ఇందులో స్టాండ్‌ని ఉంచి దానిపై మామిడికాయలు ఉన్న గిన్నె పెట్టాలి. మూతపెట్టి మూడు విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడికించాలి. కుక్కర్‌లో ప్రెజర్‌ మొత్తం పోయిన తర్వాత మామిడికాయలను కాస్త చల్లారనివ్వాలి. తర్వాత వాటిలోని టెంక తీసి చేతితో మెత్తగా చేసుకోవాలి. మిక్సీజార్‌లో మూడు కప్పుల బెల్లం తురుము వేసి మెత్తగా గ్రైండ్‌ చేసి పక్కనుంచాలి. దీన్ని మామిడి గుజ్జులో వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఇందులోనే ఒక టీ స్పూన్‌ యాలకుల పొడి వేసి మరోసారి చక్కగా కలపాలి. కావాలనుకుంటే ఇందులో కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఈ మామిడికాయ గుజ్జును గాలి చొరబడని డబ్బాలో వేసి మూతపెట్టాలి. దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కనీసం 20 రోజుల పాటు తాజాగా ఉంటుంది. మామిడి షర్బత్‌ తాగాలనిపించినప్పుడు గ్లాసుల్లో కొన్ని ఐస్‌ క్యూబ్స్‌ వేయాలి. అందులో మ్యాంగో మిక్స్‌ని ఒకటి లేదా రెండు టీ స్పూన్లు వేసి కూల్‌ వాటర్‌ పోసి బాగా కలిపి సర్వ్‌ చేసుకుంటే చాలు. అంతే ఎంతో టేస్టీగా ఉండే చల్లచల్లని మామిడికాయ డ్రింక్‌ రెడీ.

రోటి పచ్చడి
కావాల్సిన పదార్థాలు: నూనె – నాలుగు టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి – వంద గ్రాములు, వెల్లుల్లి – 25, ఉప్పు – రుచికి సరిపడా, మామిడికాయ ముక్కలు – వంద గ్రాములు, ఉల్లిగడ్డ – ఒకటి, పల్లీలు – 2 టేబుల్‌ స్పూన్లు
తయారీ విధానం: ముందుగా పచ్చిమిర్చి వేపాలి. కారం తక్కువగా ఉంటేనే మంచిది. రోట్లో 20 నుంచి 25 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. రోలు లేని వాళ్లు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కానీ, రోట్లో దంచుకున్న పచ్చడి రుచిగా ఉంటుంది. చెక్కు తీసుకున్న పుల్లటి పచ్చి మామిడి కాయ ముక్కలు వేసి మరోసారి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. చివరగా ఉల్లి ముక్కలు కూడా వేసుకుని దంచుకోవాలి. అలాగే పల్లీలు కూడా వేసుకుని దంచుకోవాలి. తర్వాత కడాయిలో నూనె పోసి ఆవాలు చిటపటలాడించి ఎండుమిర్చి, పచ్చిశనగ పప్పు మినప్పప్పును సన్నటి మంటపై ఎర్రగా వేయించి కాస్త ఇంగువ, కరివేపాకు వేసుకుని మగ్గించి పచ్చడి వేసుకుని కలుపుకోవాలి. రెండు నిమిషాల పాటు కలుపుతూ మగ్గించుకుని కొద్దిగా బెల్లం, కొత్తమీర తరుగు వేసుకుంటే చాలు! ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ అయినట్లే. ఇది మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది.

గులాబ్‌ జామున్‌
కావాల్సిన పదార్థాలు: పచ్చి మామిడికాయ – ఒకటి, మైదా – కప్పు, పంచదార – ఒకటిన్నర కప్పులు, నీరు – ఒకటిన్నర కప్పులు, నెయ్యి – రెండు చెంచాలు, యాలకుల పొడి – టీ స్పూను.
తయారీ విధానం: మామిడికాయను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి పై పొట్టు తీసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. అయితే మామిడికాయను మరీ పుల్లగా కాకుండా కొంచె తీపి, పులుపు కలిపి ఉన్నది తీసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత మామిడి ముక్కలు వేసి మెత్తబడేవరకూ మగ్గించుకుని స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీజార్‌లోకి వేసుకుని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఓ గిన్నెలోకి మైదా పిండి, మామిడి గుజ్జు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు లేదా పాలు పోసుకుంటూ మృదువుగా కలుపుకుని పక్కన ఉంచాలి. స్టవ్‌ ఆన్‌ చేసి పాన్‌ పెట్టి అందులో పంచదార ఎంత తీసుకుంటే దానికి సమానంగా నీళ్లు తీసుకోవాలి. పంచదార కరిగి లేతపాకం వచ్చాక యాలకుల పొడి వేసి స్టవ్‌ ఆఫ్‌ చేసి పాకాన్ని చల్లారనివ్వాలి. ఈలోపు పిండిని మరోసారి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. స్టవ్‌ మీద కడాయి పెట్టి డీప్‌ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకున్న తర్వాత ఉండలు వేసుకుని మీడియం ఫ్లేమ్‌లో రెండు వైపులా గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌ వచ్చేవరకు వేయించుకోవాలి. ఇలా ఉండలన్నింటినీ వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసిన ఉండలను పంచదార పాకంలో వేసి ఓ సారి నెమ్మదిగా కలిపి మూత పెట్టి రెండు గంటల వదిలేయాలి. ఉండలు పాకాన్ని బాగా పీల్చుకున్నాక తరిగిన డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకుంటే మామిడి గులాబ్‌ జామున్‌ రెడీ. ఇవి చూడ్డానికి మామూలు జామూన్లలానే ఉంటాయి. కానీ తింటే తీపితో పాటు కొద్ది పులుపుగా ఉండి ఓ కొత్త రుచిని పరిచయం చేస్తాయి.

వడియాలు
కావాల్సిన పదార్థాలు: రేషన్‌ బియ్యం – కప్పు, సగ్గుబియ్యం – అర కప్పు, పచ్చిమిర్చి – ఐదు, అల్లం ముక్క – కొద్దిగా, ఉప్పు – రుచికి సరిపడా, మామిడికాయ తురుము – అర కప్పు, నువ్వులు – టేబుల్‌ స్పూను, జీలకర్ర – టీ స్పూను.
తయారీ విధానం: బియ్యంలో రాళ్లు, పొట్టు లేకుండా శుభ్రం చేసి మూడు నాలుగు సార్లు కడగాలి. బియ్యంలోకి సగ్గుబియ్యం తీసుకుని వాటిని ఓసారి కడిగి మూడు కప్పుల నీళ్లు పోసి రాత్రి మొత్తం నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం సగ్గుబియ్యం మిశ్రమాన్ని నానబెట్టిన నీటినే కొద్దికొద్దిగా పోస్తూ మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. మిగిలిన నీటిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అదే గిన్నెలోకి నాలుగు కప్పుల నీరు పోసి మరిగించుకోవాలి. ఈలోపు పుల్లటి మామిడికాయ ఒకటి పొట్టు తీసేసి తురుముకోవాలి. అర కప్పు తురుము, పచ్చిమిర్చి, అల్లం ముక్క తీసుకుని మెత్తగా గ్రైండ్‌ చేసి పక్కన ఉంచాలి. మరుగుతున్న నీటిలో మామిడి తురుము, అల్లం పచ్చిమిర్చి పేస్ట్‌, ఉప్పు వేసి ఓసారి కలుపుకోవాలి. స్టవ్‌ను సిమ్‌లో పెట్టి గ్రైండ్‌ చేసుకున్న బియ్యాన్ని కొద్దికొద్దిగా పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. కలపకపోతే పిండి ఉండలు కడుతుంది. తర్వాత ఈ వడియాల మిశ్రమాన్ని పది నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. పిండి ఉడికి మిశ్రమం దగ్గరపడినప్పుడు స్టవ్‌ ఆఫ్‌ చేసి నువ్వులు, జీలకర్ర వేసి కలుపుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ లోపు కాటన్‌ క్లాత్‌ను తడిపి నీళ్లు లేకుండా గట్టిగా పిండి ఎండలో వేసుకొని చల్లారిన మిశ్రమాన్ని చిన్నచిన్న వడియాలుగా పెట్టుకోవాలి. వీటిని సుమారు 6 రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. వడియాలు పూర్తిగా ఎండి, క్రిస్పీగా మారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే సూపర్‌ టేస్టీ అండ్‌ క్రంచీ మామిడికాయ వడియాలు రెడీ.
ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్‌? ఆన్‌? చేసి డీప్‌? ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. నూనె బాగా కాగిన తర్వాత కొన్ని వడియాలు వేసి ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా మీకు కావాల్సినన్నీ వడియాలు వేయించుకుంటే సరి. నచ్చితే మీరూ ట్రై చేయండి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -