Wednesday, April 8, 2026
E-PAPER
Homeజాతీయంమీ మాటలన్నీ అబద్ధాలే

మీ మాటలన్నీ అబద్ధాలే

- Advertisement -

– నిరాధార ప్రకటనలతో ప్రజల్ని మభ్యపెట్టలేరు
– కేరళం అభివద్ధికి ఎల్డీఎఫ్‌ ప్రభుత్వాల కషే కారణం
– బీజేపీని నిలువరించేందుకు న్యాయపోరాటం చేస్తున్నాం
– బీజేపీయేతర రాష్ట్రాలను ఒకే వేదికపైకి తెచ్చేలా రాజకీయ ప్రణాళికలు : సీఎం రేవంత్‌రెడ్డి లేఖకు కేరళం సీఎం పినరయి విజయన్‌ ఘాటైన సమాధానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
”కేరళం రాష్ట్రంలో ఎల్డీఎఫ్‌ ప్రభుత్వ పనితీరుపై పూర్తిగా ఆధారాలు లేని, సత్యదూరమైన ప్రకటనలు మీరు చేస్తున్నారు. దానికోసం వ్యక్తిగతంగా అవమానించేలా ఉన్న మీ ధోరణిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. మీ వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా కేరళం ప్రజల అనుభవాలు ఉన్నాయి. తెలంగాణలో మీ ప్రభుత్వ పనితీరుపై నేను చర్చకు పోదలుచుకోలేదు. దానికోసం మీ రాష్ట్రంలో రాజకీయపార్టీలు ఉన్నాయి. వారు మీ ప్రభుత్వ పనితీరును అంచనా వేస్తారు. అంతిమంగా తెలంగాణ ప్రజలే తీర్పు ఇస్తారు. ఇప్పుడు మీకు నేను ఇస్తున్న ఈ సమాధానం బీజేపీయేతర ప్రభుత్వ సహచర ముఖ్యమంత్రికి ఇస్తున్నదే అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి” అంటూ కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ధీటైన సమాధానంతో లేఖ రాసారు. కేరళంలో ఎల్డీఎఫ్‌ ప్రభుత్వ మ్యానిఫెస్టోపై మీరు చేసిన వ్యాఖ్యలకు సంపూర్ణ సమాధానాలు మా ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఉన్నాయి. అందువల్ల మీరు ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌) హ్యాండిల్‌లో పెట్టిన లేఖకు సమాధానాలన్నీ వాటిలోనే ఉన్నాయి. కేరళం రాష్ట్ర ప్రభుత్వ విజయాలను ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. ఎల్డీఎఫ్‌ ప్రభుత్వ ఆచరణ, వాస్తవాలు ఒకేలా ఉంటాయి. మీరు ఈ విషయాలను గమనిస్తారని భావిస్తున్నాను” అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళంలోని ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలు చేస్తూ ‘ఎక్స్‌’ వేదికగా లేఖను పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీనికి కేరళం సీఎం పినరయి విజయన్‌ ఘాటైన సమాధానాన్ని బహిరంగ లేఖ రూపంలో ఇచ్చారు. కేరళం అభివద్ధికి దశాబ్దాల వామపక్ష ఉద్యమం, ప్రభుత్వాల కషి, తీసుకున్న విధానపరమైన నిర్ణయాలే కారణమని ఆ లేఖలో స్పష్టంచేశారు. ఈ సందర్భంగా గత యూడీఎఫ్‌ ప్రభుత్వాలు చేసిన కృషి వల్లే కేరళం అభివృద్ధి సాధ్యమైందని రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్‌ను పినరయి విజయన్‌ కొట్టిపారేశారు.

కాంగ్రెస్‌ చాలా మోసాలు చేసింది
కమ్యూనిస్టు ప్రభుత్వాల ఏర్పాటు, కేరళంలో సాగిన అభివద్ధి ప్రయాణాన్ని ఆయన లేఖలో వివరించారు. ”స్వాతంత్య్రం వచ్చిన మొదటి దశాబ్దంలోనే కేరళంలో భూస్వామ్య విధానాన్ని అంతం చేస్తూ ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం ‘అగ్రారియన్‌ రిలేషన్స్‌ బిల్‌’ (వ్యవసాయ సంబంధాల బిల్లు) తీసుకువచ్చింది. కానీ అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్టికల్‌ 356ను దుర్వినియోగం చేస్తూ అక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా బర్తరఫ్‌ చేసింది” అని గుర్తుచేశారు. 1993లో 73, 74వ రాజ్యాంగ సవరణలు రాకముందే, దశాబ్దాల క్రితమే కేరళలోని మొదటి ప్రభుత్వం వికేంద్రీకత పాలనా నిర్మాణాన్ని రూపొందించిందనీ, కేరళంలో అక్షరాస్యత ఉద్యమం 1987-91 నాటి ఎల్డీఎఫ్‌ ప్రభుత్వ సారథ్యంలో సాగిందని గుర్తుచేశారు. ”1996లో ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం ‘పీపుల్స్‌ ప్లానింగ్‌ క్యాంపెయిన్‌’ను ప్రారంభించి, రాష్ట్ర పంచవర్ష ప్రణాళికలో మూడవ వంతు కంటే ఎక్కువ నిధులను స్థానిక ప్రభుత్వాలకు బదిలీ చేసింది. తద్వారా ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. 2016, 2021లో అధికారంలోకి వచ్చిన ఎల్డీఎఫ్‌ ప్రభుత్వాలు ‘నవ కేరళ మిషన్స్‌’ ద్వారా సామాజిక వనరుల కల్పనలో ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పి ఆ వారసత్వాన్ని కొనసాగించాయి. ఆర్ద్రమ్‌ మిషన్‌ ప్రాజెక్ట్‌ ప్రజారోగ్య రంగాన్ని మార్చివేసింది. 670కి పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఫ్యామిలీ హెల్త్‌ సెంటర్లుగా పునర్నిర్మించింది. పబ్లిక్‌ ఎడ్యుకేషన్‌ రెజువనేషన్‌ మిషన్‌ ద్వారా 13 వేల కంటే ఎక్కువ ప్రభుత్వ పాఠశాలలను ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో మెరుగుపరిచింది. 45 వేల తరగతి గదులను హై-టెక్‌ సౌకర్యాలతో తీర్చిదిద్దాం. 19 వేల కంటే ఎక్కువ డిజిటల్‌ లెర్నింగ్‌ రిసోర్సెస్‌ ఉన్న ‘సమగ్ర’ పోర్టల్‌ను ప్రారంభించాం” అని తెలిపారు. అవినీతిలో నిటిఆయోగ్‌ ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో 6వ అత్యంత అవినీతిమయమైన రాష్ట్రాల్లో తెలంగాణను గుర్తించిందని ఈ సందర్భంగా పినరయి విజయన్‌ పేర్కొన్నారు. నేషనల్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌లో కేరళం 79 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంటే, తెలంగాణ 6వ స్థానంలో ఉందని స్పష్టంచేశారు.

వ్యాపారంలోనూ నెంబర్‌వన్‌
”దేశంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ సంస్కరణలను ప్రవేశపెట్టడంలో కేరళం స్థిరమైన ప్రయత్నాలు చేసి మొదటి ర్యాంకును పొందింది. కేరళం ఇప్పుడు పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా పరిగణించబడుతోంది. మేధోసంపత్తి, ప్రపంచ వాణిజ్యాన్ని భవిష్యత్తుకు పునాదులుగా చేస్తూ, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. 2026 ఐటీ పాలసీ ద్వారా, భారతదేశపు మొదటి డిజిటల్‌ సైన్స్‌ పార్క్‌, 20 వేల డీప్‌-టెక్‌ స్టార్టప్‌ల నెట్‌వర్క్‌ సహకారంతో భారతదేశ ఐటీ ఎగుమతుల్లో 10 శాతం వాటాను దక్కించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ డిజిటల్‌ విజయాలకు రూ.16 వేల కోట్లతో విళింజం అంతర్జాతీయ ఓడరేవు వెన్నుముకగా ఉంది. ఇది ట్రిలియన్‌ డాలర్ల భవిష్యత్తు కోసం వ్యూహాత్మకంగా నిర్మించబడిన గ్లోబల్‌ ట్రాన్స్‌షిప్‌మెంట్‌ హబ్‌. డీప్‌-టెక్‌, ఏఐ, మారిటైమ్‌ లాజిస్టిక్స్‌లో నాయకత్వం వహించడం ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం స్వదేశంలోనే ఉన్నత విలువైన అవకాశాలను సష్టించే నాలెడ్జ్‌ ఎకానమీని నిర్మించడమే మా దార్శనికత” అని పినరయి విజయన్‌ తెలిపారు. 2025 నవంబర్‌ 1న భారతదేశంలోనే అత్యంత పేదరికం లేని మొదటి, ఏకైక రాష్ట్రంగా కేరళ ప్రకటించబడిందనీ, తమ ప్రభుత్వం ‘తీవ్ర పేదరిక నిర్మూలన ప్రాజెక్ట్‌’ ద్వారా 64,006 కుటుంబాలను గుర్తించి, వారికి తగిన మైక్రో-ప్లాన్‌లను అందించిందని వివరించారు.

బీజేపీపై పోరాడుతున్నాం
బీజేపీ నేతత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సమాఖ్య, లౌకిక వ్యతిరేక అప్రజాస్వామిక ధోరణిని ప్రతిఘటించడంలో కేరళం రాష్ట్రం ప్రధాన భూమిక పోషిస్తున్నదని పినరయి విజయన్‌ తెలిపారు. బీజేపీయేతర పార్టీలు పాలించే రాష్ట్రాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని వివరించారు. 16వ ఆర్థిక సంఘానికి మెమోరాండం సమర్పించే సమయంలో చేపట్టిన సంయుక్త చొరవను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇదే విధానాన్ని కొనసాగించాలని భావిస్తున్నామన్నారు. కేరళం కేంద్ర ప్రభుత్వం నుంచి వివక్షను, నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటున్నదని చెప్పారు. ఆర్టికల్‌ 131, 32 కింద ఉన్న హక్కులను ఉపయోగించుకుని, శాసన, ఆర్థిక రంగాల్లో రాష్ట్రాల హక్కులను హరిస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో న్యాయ పోరాటాలు చేస్తున్నదని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు సమాజంలోని వివిధ వర్గాల్లో, ముఖ్యంగా మైనారిటీల్లో ఆందోళనలను కలిగించాయని తెలిపారు. రాజ్యాంగ విలువలను రక్షించడంలో కేరళంలోని ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం ముందంజలో ఉందనీ, రాజ్యాంగ స్ఫూర్తిని కించపరిచే కేంద్ర ప్రభుత్వ చర్యలను రాజీ పడకుండా విమర్శిస్తున్నదని పేర్కొన్నారు. అయితే ఆయా విషయాలపై బలమైన వైఖరి అనేది సరిహద్దులు దాటే భాష ద్వారా మాత్రమే వ్యక్తమవుతుందని రేవంత్‌రెడ్డి భావిస్తున్నారనీ, దానితో తాను ఏకీభవించడం లేదని తేల్చిచెప్పారు.

స్వదేశానికి విదేశీ మారకద్రవ్యం
కేరళంలో పారిశ్రామిక స్తబ్దత ఉందని రేవంత్‌ రెడ్డి చేసిన వాదనను విజయన్‌ తిప్పికొట్టారు. స్టార్టప్‌ రంగంలో కేరళం అగ్రగామిగా ముందుకు దూసుకెళ్తోందని చెప్పారు. కేరళం శ్రామికశక్తి అనేక దేశాల్లో పని చేస్తూ, దేశానికి విదేశీ ద్రవ్యాన్ని పంపిస్తున్నదనీ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ అందించిన నాణ్య మైన విద్య వల్లే ఇది సాధ్యమైందని స్పష్టంచేశారు. దీనిలోనూ వామపక్ష ఉద్యమం, వామపక్ష పార్టీల నేతత్వంలోని ప్రభుత్వాల సహకారం ఉందన్నారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కేరళం ప్రభుత్వం సమర్పించిన కొచ్చి మెట్రో, విళింజం పోర్ట్‌ వంటి ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను విపరీతంగా జాప్యం చేశారని గుర్తుచేశారు. 1980ల ప్రారంభంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కేరళంకు హామీ ఇచ్చిన రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ నేటికీ అమల్లోకి రాలేదన్నారు. కేరళం సాధించిన సంక్షేమ, అభివద్ధి సమతుల్య తను గత రాచరిక కాంగ్రెస్‌ పాలనే కారణమని రేవంత్‌రెడ్డి చెప్పడం వాస్తవాలను తొక్కిపెట్టడమే అవుతుందని విమర్శించారు. కేరళంను మానవాభివద్ధి సూచికల్లో అగ్రస్థానంలో నిలిపడం, సామాజిక మార్పునకు వామపక్ష ఉద్యమం, వామపక్ష ప్రభుత్వాలే కారణమని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -