Wednesday, April 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రశ్నించే గొంతులపై ప్రజాప్రభుత్వం నిర్బంధం

ప్రశ్నించే గొంతులపై ప్రజాప్రభుత్వం నిర్బంధం

- Advertisement -

– ఎంత అణచివేసినా బాధితులకు అండగా ఉంటాం
– భూసేకరణను తక్షణం నిలిపేయాలి
– హరీశ్‌రావు, ఇతర నేతల అరెస్టుకు కేటీఆర్‌ ఖండన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేతలు తన్నీరు హరీశ్‌రావు, పి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేష్‌ రెడ్డి, నరేందర్‌ రెడ్డి, మెతుకు ఆనంద్‌, ఇతర నేతల అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భూమిని కాపాడుకోవాలని పోరాడుతున్న రైతులకు బాసటగా నిలిచేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతలను అక్రమంగా గృహనిర్బంధం చేయడం, అరెస్టు చేయడం కాంగ్రెస్‌ ప్రభుత్వ పిరికిపంద చర్య అని తెలిపారు. ప్రశ్నించే గొంతులపై ప్రజాప్రభుత్వం నిర్బంధం ప్రయోగిస్తున్నదని విమర్శించారు. పోలీసుల బలంతో గొంతు నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పేర్కొన్నారు. పరిగి నియోజకవర్గంలోని కాడ్లాపూర్‌, రాపోలు గ్రామాల్లో ఇండిస్టియల్‌ పార్క్‌ పేరుతో రైతుల నుంచి 1,200 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలి పేదల భూములపైన పడిందని తెలిపారు. రైతు భరోసా, రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుండా రైతులను ప్రభుత్వం అరిగోస పెడుతున్నదని పేర్కొన్నారు. ఇప్పుడు పరిశ్రమల పేరుతో భూ సేకరణకు దిగడం దుర్మార్గమని తెలిపారు. రెండున్నరేండ్లలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాని ఈ ప్రభుత్వం, భూములను దోచుకోవడంలో మాత్రం విపరీతమైన ఆసక్తిని చూపిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేతలు దొంగల్లా ఊళ్లు పంచుకుంటున్నట్టు భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. అరెస్టులు, జైళ్లు, అక్రమ కేసులు బీఆర్‌ఎస్‌ నాయకులకు కొత్త కాదనీ, ఉద్యమ కాలం నుంచే ఇవన్నీ ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడ్డామని స్పష్టం చేశారు. ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు ఎవరూ భయపడేది లేదనీ, ప్రజల పక్షాన పోరాటం ఆగదని తెలిపారు. ప్రభుత్వం ఎంత అణచివేతకు పాల్పడినా, బాధితులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. అక్రమంగా నిర్బంధించిన నాయకులను వెంటనే విడుదల చేయాలనీ, భూ సేకరణను తక్షణమే నిలిపేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.
అరెస్టులు దుర్మార్గం : వేముల ప్రశాంత్‌రెడ్డి
పరిగి పర్యటనకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావుతోపాటు ఇతర నాయకులను మార్గమధ్యలో పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేయడం దుర్మార్గమని మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ రైతులకు అండగా నిలవడానికి వెళ్తున్న నాయకులను నిర్బంధించడం ప్రభుత్వ తీరును బహిర్గతం చేస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష గొంతును అణచివేయడం అసహ్యకరమని పేర్కొన్నారు. అరెస్టులు, కుట్రలు, కుతంత్రాలు చేసినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భూ దాహన్ని, కబ్జాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -