మూడు జేఏసీల ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నిరసన
తార్నాక, కోఠి స్పాట్ కేంద్రాల వద్ద హోరెత్తిన నినాదాలు
ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం : టీటీ జాక్, యూఎస్పీసీ, జాక్టో జేఏసీ నేతలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉపాధ్యాయ సంఘాల జేఏసీలు(టీటీజాక్, యూఎస్పీసీ, జాక్టో) ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మూడు జేఏసీలు ఆందోళన బాట పట్టాయి. మంగళవారం హైదరాబాద్లోని తార్నాక సెయింట్ ఆన్స్(మేజర్ స్పాట్ కేంద్రం), కోఠి హనుమాన్ వ్యాయామశాల (మైనర్ స్పాట్ కేంద్రాల) వద్ద ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నినాదాలతో స్పాట్ కేంద్రాలు మార్మోగాయి.
అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ప్రధానంగా గత ఏడాదికి సంబంధించిన మూల్యాంకన(వాల్యుయేషన్) బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రస్తుతమున్న స్పాట్ రేట్లను 50 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన స్పాట్ అమౌంట్ను వెంటనే చెల్లించాలన్నారు. అక్టోబర్ 2024లో నిర్వహించిన కులగణన సర్వేకు సంబంధించిన పారితోషికాన్ని తక్షణమే ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల హామీలను నెరవేర్చాలి..
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని నాయకులు విమర్శించారు. పీఆర్సీ, డీఏ, ఈహెచ్ఎస్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర జేఏసీ ఇచ్చే పిలుపు మేరకు హైదరాబాద్ జిల్లా నుంచి ఉపాధ్యాయులందరూ ఐక్యంగా ఉద్యమించి, ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన అనంతరం మేజర్ క్యాంపులో ఉన్న డిప్యూటీ క్యాంపు ఆఫీసర్ బాలు నాయక్కు, మైనర్ క్యాంపులో ఉన్న క్యాంపు ఆఫీసర్ వెంకటేశ్వర్లుకు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు వినతిపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర బాధ్యులు, వివిధ మండలాల నాయకులు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బకాయిలు చెల్లించండి.. స్పాట్ రేట్లు పెంచండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



