19.36 ఎకరాల భూమి ఈడబ్ల్యూఐడీసీకి బదలాయింపు
విద్యా అభివృద్ధికి మరో ముందడుగు
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజకవర్గ కేంద్రం అశ్వారావుపేటలో విద్యా రంగ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి అవసరమైన భూమి కేటాయింపు ప్రక్రియ పూర్తయింది.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఆధునిక సదుపాయాలతో ఈ విద్యాసంస్థలను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, అశ్వారావుపేట లోని సర్వే నంబర్ 1228 లో మొత్తం 19.36 ఎకరాల భూమిని ఈడబ్ల్యూఐడీసీ కి అప్పగించారు.ఇందులో పట్టు పరిశ్రమ శాఖకు చెందిన 17 ఎకరాలు, 2.36 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నాయి.
బుధవారం ఆర్ఐ తాటి కృష్ణ సమక్షంలో ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ జిల్లా అధికారి జంగా కిషోర్ ఆధ్వర్యంలో ఈడబ్ల్యూఐడీసీ సాంకేతిక సలహాదారు సాంబయ్య, ఏఈ రామ్కుమార్ కు భూమిని అధికారికంగా అప్పగించారు.
ఈ భూమి బదలాయింపులో భాగంగా ఉద్యాన శాఖకు నారంవారిగూడెం సమీపంలో అదే సర్వే నంబర్లో ఉన్న 5.20 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రత్యామ్నాయంగా కేటాయించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణంతో అశ్వారావుపేట ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. భవిష్యత్తులో ఈ విద్యాసంస్థ ప్రాంత విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.



