శరవేగంగా పనులు.. ఇప్పటిదాకా 40 శాతం పూర్తి..
లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ. 161 కోట్లకుపైగా సాయం జమ..
వేడుకగా గృహ ప్రవేశాలు..
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు 40 శాతం పూర్తి చేసి.. రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆత్మగౌరవ ప్రతీక సాకారం దిశగా ఇండ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. లబ్దిదారులకు ప్రజా ప్రభుత్వం ఇసుక ఉచితంగా అందిస్తోంది. ఇండ్లు పూర్తి చేసుకుంటున్న వారి బ్యాంకు ఖాతాల్లో ఇప్పటిదాకా రూ. 161 కోట్లకుపైగా ఆర్థిక సహాయం జమ చేసి.. రాష్ట్ర ప్రభుత్వం భరోసాగా నిలుస్తున్నది. పండుగ వాతావరణంలో గృహ ప్రవేశాల వేడుకలు సాగుతున్నాయి.
సొంత ఇల్లు నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరి చిరకాల స్వప్నం. ఆ కల సాకారానికి ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రూపకల్పన చేసింది. ఇండ్ల నిర్మాణానికి రూ. ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని నాలుగు విడుతల్లో అందజేస్తుంది. 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగులలోపు ఇంటి నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. 4 దశల్లో గ్రీన్ చానల్ ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. బేస్మెంట్ నిర్మాణం పూర్తైన తర్వాత లక్ష రూపాయల, గోడలు నిర్మిస్తే లక్ష రూపాయలు, స్లాబ్ నిర్మించిన తరువాత 2 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో లక్ష రూపాయలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి.
ప్రజా ప్రభుత్వం సహకారం..
ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో ప్రజా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. నిర్మాణానికి అవసరమైన ఇసుక అందుబాటులో పెట్టి ఉచితంగా అందిస్తుంది. ఇంటి నిర్మాణానికి ఒక్కో దశలో అవసరమైన ఇసుక కోసం సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి/ మున్సిపాలిటీల పరిధిలో వార్డ్ ఆఫీసర్స్ తమ తహసీల్దార్ దృష్టికి ముందస్తుగా తీసుకెళ్లాలి. ఇసుక ఉచితం.. రవాణా ఛార్జీలు నిర్మాణదారులు చెల్లించాల్సి ఉంటుంది. నిరుపేదలకు పెట్టుబడి లేని పక్షంలో స్వయం సహాయక మహిళా సంఘాలు, మెప్మా ద్వారా లక్ష రూపాయల రుణం అందించే ఏర్పాట్లు చేసింది.
నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మోడల్ హౌస్ లు..
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ ప్రజా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని 11 మండలాల్లో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో మోడల్ హౌస్ లను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ప్రతి మోడల్ హౌస్ లో హాల్, బెడ్ రూమ్ దానికి అటాచ్డ్ బాత్రూం, అలాగే కిచెన్ సదుపాయాలతో ఇంటిని పూర్తి చేశారు. ఇందిరమ్మ మోడల్ హౌస్ లు ఎండాకాలంలో చల్లగాను.. చలికాలంలో వెచ్చగా ఉండేలా సాంకేతికతను ఉపయోగించారు. స్లాబు నిర్మాణంలో *ఫిల్లర్ రూఫింగ్* విధానాన్ని వినియోగించారు. ఇందులో సాధారణ ఇళ్లతో పోలిస్తే స్లాబ్ నిర్మాణంలో 40 శాతం ఖర్చు ఆదా అవుతుంది. నాణ్యతలో కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా పూర్తి చేశారు. దీర్ఘకాలం పాటు నిలిచి ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఆర్థిక సహాయం లోనే ఇంటి నిర్మాణాన్ని చేశారు.
40 శాతం ఇండ్లు పూర్తి …
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు 3,570 స్లాబ్ లెవెల్ లో ఉండగా, 1,419 (దాదాపు 40 శాతం) పూర్తి కాగా, ఇంకా 2,151 ఇండ్లు తుది దశలో ఉన్నాయి. వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లకు ఇప్పటి దాకా జిల్లాలో మొత్తం రూ. 161 కోట్ల 22 లక్షల ఆర్థిక సహాయం లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ అయ్యాయి. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ఎవరి ప్రమేయం లేకుండా జమ చేసింది.
శరవేగంగా పూర్తి చేసేలా ..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసేందుకు హౌసింగ్ అధికారులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తూ శరవేగంగా పూర్తి చేసేలా పకడ్బందీగా సలహాలు, సూచనలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు సహాయం అందించేందుకు ఇందిరమ్మ కమిటీలు, హౌసింగ్, ఇతర శాఖల అధికారులతో ఇంటి నిర్మాణ సామగ్రి, భవన నిర్మాణ కార్మికులు, వడ్రంగి, విద్యుత్ సేవలు అందించే వారితో సమావేశాలు ఏర్పాటు చేయించి, వారి ఫోన్ నెంబర్లు, వివరాలను లబ్దిదారులకు అందుబాటులో పెడుతున్నారు. లబ్దిదారులు ఇండ్లు నిర్మించుకునేలా ప్రోత్సాహం అందిస్తున్నారు.
నెరవేరిన 20 ఏండ్ల కల.. -కోడూరి రజిత, ఉప్పుగడ్డ, వేములవాడ పట్టణం
నాకు సొంత ఇల్లు లేదు. 20 సంవత్సరాలుగా వేములవాడ పట్టణంలో నివాసం ఉంటున్న. సొంత ఇల్లు లేక చాలా ఇబ్బంది పడ్డ. ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. నా ఇల్లు పూర్తి అయింది. ఎంతో సంతోషంగా ఉంది. నా కల సాకారానికి సహకారం అందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కు కృతజ్ఞతలు.
సద్వినియోగం చేసుకోవాలి: – వెంకట మాధవరావు, పీడీ హౌసింగ్
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అర్హులైన వారు తమ సమీపంలోని హౌసింగ్ అధికారులను సంప్రదించాలి. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయంలోనే ఇల్లు పూర్తి చేసుకునేలా జిల్లాలో మా శాఖ ఆద్వర్యంలో మోడల్ హౌస్ లు నిర్మించాము. నేరుగా సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చు.



