Thursday, April 9, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు శిఖరం 'నర్రా'

నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు శిఖరం ‘నర్రా’

- Advertisement -

నేటి రాజకీయాల్లో విలువల కంటే వెలుగులు, సేవ కంటే ప్రదర్శన, సిద్ధాంతం కంటే స్వార్థం ముందుకొస్తున్నాయి. పదవి దక్కగానే కాన్వాయ్ లు, ఫ్లెక్సీలు, డీజేలు, పూలదండలు రాజకీయ సంస్కృతికి ప్రతీకలుగా మారాయి. ఎన్నికలంటే కోట్ల ఖర్చు, అధికారమంటే సంపాదనకు మార్గమనే భావన బలపడింది. ఈ పరిస్థితికి భిన్నంగా నీతి, నిబద్ధత, నిరాడంబరత అనే మూడు స్తంభాలపై తన రాజకీయ జీవితం నిర్మించుకున్న అరుదైన ప్రజానాయకుడు నర్రా రాఘవరెడ్డి. ప్రజల మధ్య జీవించి, ప్రజలతోనే ఎదిగి, ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించిన నాయకత్వానికి ఆయన జీవితం ఓ ప్రమాణం. పదవులు కాదు, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించడమే నిజమైన నాయకత్వ లక్షణమని నిరూపించిన మార్క్సిస్టు యోధుడు నర్రా. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో నిజాయితీకి ప్రతీకగా నిలిచిన మార్గ నిర్దేశకుడు. శత్రువుని ఎరుగని స్వభావం, విలువలపై కచ్చితమైన నిబద్ధత, ప్రజాస్వామ్య పరిరక్షణలో చూపిన ధైర్యం ఆయన్ను ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిపాయి.

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో జన్మించిన నర్రా రాఘవరెడ్డి పెద్దగా చదువుకోలేదు. కానీ, జ్ఞానసక్తి బాగా ఉండేది. గ్రామంలో ఉపాధి అవకాశాలు లేక బొంబాయి బాట పట్టాడు. తొలి రోజుల్లో హోటల్‌ కార్మికుడిగా పనిచేశాడు. జి.ఎం.ఖాన్‌ సహకారంతో కార్మికనేతగా ఎదిగాడు. కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా ఏర్పడిన ”లాల్‌ బావుటా” సంఘంలో సభ్యత్వం తీసుకుని 12 గంటల పని విధానానికి వ్యతిరేకంగా కార్మికులను ఐక్యం చేసి పోరాటాలు నడిపాడు. ఎనిమిదేళ్లు బొంబాయిలో గడిపిన నర్రా, తండ్రి రాంరెడ్డి ఆరోగ్యం బాగోలేదని ఉత్తరం రావడంతో వట్టిమర్తికి తిరిగొచ్చారు. లాల్‌ బావుటా సంఘంలో పనిచేసిన రోజుల్లోనే కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని అలవర్చుకున్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణలో జరిగిన రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్యను ఆదర్శంగా తీసుకుని 1945 నుంచి కమ్యూనిస్టు జీవితాన్ని ప్రారంభించారు.

ప్రజానాట్యమండలి ద్వారా కళాకారుడిగా పల్లెల్లో పర్యటిస్తూ బాధలను పాటల రూపంలో చైతన్యంగా మార్చారు. ఉమ్మడి రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ విభజన తర్వాత సీపీఐ(ఎం)లో కొనసాగారు. పార్టీ విస్తరణ నిర్మాణానికి కృషిచేశారు. నల్గొండ జిల్లా పార్టీ కార్యదర్శివర్గ సభ్యుడిగా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగానూ సుదీర్ఘకాలం పనిచేశారు. కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ ప్రస్థానంలో యాభై ఏళ్లపాటు జనం కోసం అలుపెరగని పోరాటాలు చేశారు. 1959లో శివనేనిగూడెం గ్రామ సర్పంచ్‌గా ఎన్నికకాగా, అప్పటి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అదేకాలంలో నార్కట్‌పల్లి నాన్‌బ్లాక్‌ జిల్లా పరిషత్‌ సభ్యుడిగా జడ్పిలో ఫైనాన్స్‌ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. రాత్రిపూట పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రజలకు అక్షరజ్ఞానం నేర్పించారు. అనంతరం 1960లో సమితి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారు. ప్రజలకు చేరువైన పాలన అందించారు.ఉద్యమాల కారణంగా పలు సందర్భాల్లో అరెస్టులు ఎదురయ్యాయి. 1964లో నిర్బంధం అనుభవించారు. అత్యవసర పరిస్థితుల్లో మరోసారి జైలు జీవితం గడిపారు. కష్టసమయాల్లో సిద్ధాంత నిబద్ధత తగ్గలేదు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ధైర్యంగా నిలిచారు.

1967లో నకిరేకల్‌ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలి ఎన్నికల్లో కేవలం 300 రూపాయల ఖర్చుతో మోటార్‌సైకిల్‌పై ప్రచారం చేశారు. ”నోరే నా పెట్టుబడి… ప్రజల ప్రేమే నా సంపద” అనే నినాదం ఆయన విధానాన్ని ప్రతిబింబించింది.1972లో ఓటమి ఎదురైనా ప్రజల్లోనే కొనసాగారు. తర్వాత 1978, 1983, 1985, 1989, 1994 ఎన్నికల్లో వరుసగా ఆరుసార్లు గెలుపొందారు. చట్టసభల్లో ప్రజల గొంతుకయ్యారు. కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందున్నారు. శాసనసభలో పార్టీ వాణిని బలంగా వినిపించారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సాధన కోసం కృషి చేశారు. గీత కార్మికుల సమస్యలపై సంఘటిత పోరాటాలు నిర్వహించారు. గ్రామ సేవకులను సమీకరించి సంఘం ఏర్పాటు చేసి హక్కుల సాధనకు ప్రతినబూనారు. నకిరేకల్‌ నియోజకవర్గంలోని యాభైగ్రామాలకు, నల్గొండ- మునుగోడు ప్రాంతంలోని 15 గ్రామాలకు విద్యుద్దీకరణకు కృషి చేశారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు కోసం పోరాటాలు నిర్వహించారు.

ఫ్లోరైడ్‌ నివారణకు కృషి చేశారు. రోడ్లు, తాగునీరు, విద్య కోసం ఉద్యమాలు చేశారు. బంజరు, మిగులు భూములు గుర్తించి పేదలకు పంపిణీ చేయించారు. బీబీనగర్‌-నడికుడి రైలుమార్గం కోసం పాటుపడ్డారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీపీఐ(ఎం)శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. కంటి చికిత్స కోసం కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య సూచనతో రష్యాకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు.ఎన్టీఆర్‌తో మంచి సంబంధాలు కొనసాగించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి స్థలం కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. ఆంగ్లంలో వెలువడే ప్రభుత్వ ఉత్తర్వులు సామాన్యులకు అర్థం కావని ప్రశ్నిస్తూ తెలుగులో ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. ప్రజాస్వామ్యం ప్రజల భాషలో ఉండాలని నమ్మారు. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అవినీతి మరక అంటలేదు. ప్రభుత్వ ఇంటిస్థలాన్ని తిరస్కరించారు. అధికార సౌకర్యాలు వినియోగించుకోలేదు. వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టలేదు. ప్రజలే తన సంపదగా భావించారు. అజాతశత్రువు అనే గుర్తింపు పొందారు.

ఇప్పటి రాజకీయాల్లో ధనబలం, అధికార ప్రదర్శన ఆధిపత్యం పెరిగింది. విలువలకు తిలోదకలిచ్చి పార్టీ కండువా మార్చడం సాధారణమైంది. ఓటర్లను ప్రలోభపెట్టే ధోరణి విస్తరించింది. పదవిని సంపాదన మార్గంగా వినియోగించే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో నర్రా జీవితం స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపుతుంది. జనబలం అసలైన బలమని నిరూపించారు. ప్రజల మధ్యే తిరగడం నాయకత్వానికి మూలమని చాటారు. పారదర్శకత ప్రజా విశ్వాసాన్ని పెంచుతుందని వివరించారు. నిబద్ధతతో సేవచేస్తే గౌరవం స్వయంగా వస్తుందని చూపించారు.ప్రజాప్రతినిధి అంటే అధికార ప్రదర్శన కాదు, సేవభావం కావాలి. పదవి అంటే బాధ్యత అనే ఆలోచన ఉండాలి. నైతిక విలువలు రాజకీయాలకు ప్రాణం కావాలి. ప్రజల సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఉండాలి. ఈ మార్గాన్ని చూపిన ఆదర్శ నాయకుడు నర్రా రాఘవరెడ్డి. సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా పనిచేసిన నర్రా రాఘవరెడ్డి వయోభారంతో ప్రజాజీవితానికి దూరమై 2015 ఏప్రిల్‌ 9న తన 92వ యేటా కన్నుమూశారు.

అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించింది. ఆయన చనిపోయి పదకొండు సంవత్సరాలు అవుతున్నా నేటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. ప్రజల కోసం బతికిన వాడు ఎల్లకాలం జీవిస్తాడనే సత్యానికి ఆయన జీవితం నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి వ్యక్తిత్వం రాష్ట్ర రాజకీయాల్లో చాలా అరుదు. విద్య పరిమితమైనప్పటికీ సమాజాన్ని చదివిన అనుభవం ఆయనకు ప్రజల జీవన సత్యాలను నేర్పింది. ప్రజాపాలన అంటే ప్రజలనాడికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం అని ఆచరణలో చూపించారు. ప్రతి అంశాన్ని ప్రజలకు చేరవేసే విధానాన్ని పాటించారు. ప్రజల ఆస్తి తన ఆస్తి అనే భావనతో పనిచేశారు. నాయకుడంటే ఎలా ఉండాలనే ప్రమాణాన్ని తన జీవితంతో నిరూపించారు. ఇలాంటి మహోన్నత చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.నకిరేకల్‌ నియోజకవర్గానికి నర్రా పేరు పెట్టాలని, విగ్రహం ఏర్పాటు చేయాలని, స్మృతి వనం, నర్రా విజ్ఞాన కేంద్రం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

(నేడు నర్రా రాఘవరెడ్డి 11వ వర్ధంతి)

గడగోజు రవీంద్రాచారి
9848772232

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -