20 ఆరోగ్య కేంద్రాల్లో
ఏఐ ఆధారిత ఊపిరితిత్తుల క్యాన్సర్ పరీక్ష నిర్వహణ
క్యాన్సర్ నిర్ధారణకు ఆ పరీక్ష కీలకం
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకమిషనర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ తెలంగాణ సర్కారుకు కృతజ్ఞతలు : అక్కినేపల్లి ప్రవీణ్కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలను కవర్ చేసేలా 20 ఆరోగ్య కేంద్రాల్లో ఏఐ ఆధారితంగా ఊపిరిత్తుల క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష నిర్వహణకు సంబంధించి ఆస్ట్రాజెనెకా ఫార్మా ఇండియా లిమిటెడ్ తెలంగాణ రాష్ట్ర సర్కారుతో బుధవారం హైదరాబాద్లో ఎంఓయూ చేసుకున్నది. ఈ భాగస్వామ్యం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు క్యాన్సర్ను ముందుగానే గుర్తించే అవకాశాన్ని పెంచడం, వారు త్వరగా కోలుకునేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒప్పందం అనంతరం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ.. ”తెలంగాణలో క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్క్రీనింగ్ పరీక్షలు తక్కువగా జరుగుతుండటంతో వ్యాధి గుర్తింపు ఆలస్యమవుతున్నది. ఇది ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ భాగస్వామ్యం ద్వారా సాంకేతికతను ప్రభుత్వ ఆరోగ్య సేవల్లో భాగం చేయాలనుకుంటున్నాం.
భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేందుకు మరింత ముందుచూపుతో కూడిన ఆరోగ్య వ్యవస్థను నిర్మించడంలో ఈ ఒప్పందం దోహదపడుతుంది’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆస్ట్రాజెనెకా ఫార్మా ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అక్కినేపల్లి ప్రవీణ్రావు మాట్లాడుతూ… ‘తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఊపిరితిత్తుల క్యాన్సర్ను ముందుగానే గుర్తించడంలో, రోగుల ఫలితాలను మెరుగుపరచడంలో తమ పరీక్ష చాలా కీలక పాత్ర పోషిస్తుంది. భారత్లో వినూత్నమైన ఆరోగ్య పరిష్కారాలను మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడం, ఇటువంటి భాగస్వామ్యాల ద్వారా అవసరమైన సమాజాల దగ్గరికి ముందస్తు నిర్ధారణను తీసుకెళ్లి, నిజమైన మార్పును తీసుకొస్తామని నమ్ముతున్నాం’ అని చెప్పారు. నైపుణ్యాలు పెంపొందించేలా వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, అవసరమైన చోట మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.



