స్టూడెంట్స్‌కు ఉచిత ప్రవేశం

– భారత్‌, ఇంగ్లాండ్‌ టెస్టుపై హెచ్‌సీఏ
హైదరాబాద్‌ : తెలంగాణ స్కూల్‌ విద్యార్థులకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) తీపి కబురు చెప్పింది. అభిమాన భారత స్టార్‌ క్రికెటర్లతో పాటు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టు విన్యాసాలను చూసేందుకు స్కూల్‌ స్టూడెంట్స్‌కు చక్కటి అవకాశం కల్పిస్తోంది హెచ్‌సీఏ. జనవరి 25 నుంచి ఉప్పల్‌ స్టేడియం వేదికగా భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి టెస్టులో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ను ఉప్పల్‌ స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించేందుకు పాఠశాల విద్యార్థులను ఉచితంగా అనుమతించనున్నారు. ఈ మేరకు హెచ్‌సీఏ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఉచిత ప్రవేశంతో టెస్టు మ్యాచ్‌ చూసేందుకు స్టేడియానికి వచ్చే స్కూల్‌ స్టూడెంట్స్‌కు మధ్యాహ్నం భోజనం సైతం అందించనున్నట్టు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు తెలిపారు. భారత్‌, ఇంగ్లాండ్‌ టెస్టు మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించే అవకాశం కోసం పాఠశాలల యాజమాన్యాలు ఉప్పల్‌ స్టేడియంలోని హెచ్‌సీఏ ప్రధాన కార్యాలయంలో వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

Spread the love