– పీఎఫ్ సరిగ్గా చెల్లించని ఉత్తమ్ బీడీ కంపెనీ వేతనాలు చెల్లించని ఠాకూర్ పరిశ్రమ
– పెండింగ్లో 10 నెలల వేతనాలు
– బీడీ కార్మికులకు ఇండ్లు, స్కాలర్షిప్లకు ఎగనామం
– కార్మికుల ఆస్పత్రిలో మందుల కొరత
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
బీడీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. వేతనాలు పెంచడం, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం, ఆరోగ్య సౌకర్యాలు అందించడం బీడీ కార్మికులకు అత్యవసరం. లేకపోతే ఈ వృత్తిపై ఆధారపడిన వేలాది కుటుంబాలు మరింత సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. మెదక్ జిల్లా ఠాకూర్ పరిశ్రమ గత 11 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. బీడీ కార్మికులకు నెలకు వచ్చేది కేవలం 2వేల నుంచి 3 వేలు మాత్రమే. కానీ అవి కూడా సమయానికి అందని పరిస్థితి. దాంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం 20 సంవత్సరాల క్రితం బీడీ కార్మికులకు ఇండ్ల జాగాలు కొని ఇండ్లు కట్టించారు. కానీ ఆ పథకాన్ని ప్రస్తుతం అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ స్కీంను ఎత్తివేయడంతో కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లింది. బీడీ కార్మికుల పిల్లలు విద్యనభ్యసించేందుకు గతంలో స్కాలర్షిప్ అందించేవారు. కానీ గత ఐదారు ఏండ్లుగా స్కాలర్షిప్లు ఇవ్వకపోవడంతో కార్మికుల పిల్లలు చదువుకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతే కాకుండా బీడీ కార్మికులకు ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేకంగా మెదక్ జిల్లాలోని రామాయంపేటలో ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నారు. కానీ అక్కడ మందుల కొరత వెంటాడుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు బీడీ కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇచ్చేందుకు డాక్టర్లు నేరుగా బీడీలు తయారు చేసే ఖార్ఖానాలకు వెళ్లేవారు. కానీ పదేండ్లుగా డాక్టర్లు వారి వద్దకు వెళ్లడం మానేశారు. గర్బిణీ స్త్రీలకు మందులు ఇవ్వడంతోపాటు బీపీ, షుగర్ ఉన్న వారికి ఆర్థిక సహాయం అందించేవారు. కానీ ప్రస్తుతం ఆ స్కీంను సైతం తీసివేశారు.
కుటుంబమంతా కష్టపడ్డా నెలకు రెండు వేలే..
వెయ్యి బీడీలు తయారు చేస్తే వచ్చేది రూ.258 మాత్రమే. కార్మికులు రోజుకు 500 నుంచి వెయ్యి బీడీలు మాత్రమే తయారు చేస్తారు. వీరికి నెలకు రెండు వేలు నుంచి మూడు వేలు మాత్రమే వేతనం వస్తుంది, అవి వారి జీవనోపాధికి సరిపోక కుటుంబాలు ఆకలితో అలమటించే పరిస్థితులు దాపురించాయి. మెదక్ జిల్లాలో 11 బీడీ కంపెనీలు ఉన్నాయి. చేగుంట, నిజాంపేటలో దేశారు కంపెనీలు, నిజాంపేటలో ఠాకూర్, తార్బారు నిజాంపేట, శివాజీ, ఉత్తమ్, వాణి, తురారు, సాయిబాబా రామాయంపేటలో, రెడ్డి బీడీ తూప్రాన్, లోకల్ బీడీ కంపెనీలు రెండు కంపెనీలు ఉన్నాయి. రాత్రింబవళ్లు కష్టపడి పని చేసిన బీడీ కార్మికుల కడుపు నిండటం లేదు. కష్టానికి తగిన ఫలితం లేదు. వారు అనారోగ్య సమస్యల బారిన పడితే వారి కుటుంబం మొత్తం ఆకలితో అలమటించే పరిస్థితులు నెలకొన్నాయి.
బీడీ కార్మికుల ఆస్పత్రిలో మందుల కొరత
బీడీ చుట్టే పనితో కార్మికులు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ సంబంధిత, వెన్నునొప్పి వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పొగాకు వాసనకు మహిళా కార్మికులు తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో బీడీ కార్మికుల కోసం ప్రత్యేకంగా రామాయంపేటలో ఆస్పత్రి ఏర్పాటు చేశారు. ప్రారంభంలో డాక్టర్లు నేరుగా బీడీలు తయారు చేసే ఖార్ఖానాలకే వెళ్లి వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు, చికిత్సలు అందించేవారు. కానీ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా పదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆస్పత్రికి పూర్తిగా మందుల సరఫరా నిలిపివేసింది. దాంతో ఆ ఆస్పత్రిలో సరైన చికిత్స అందక ప్రయివేట్ ఆస్పత్రులపై ఆధారపడాల్సి వస్తోంది.
పీఎఫ్ నిధులు సరిగా చెల్లించని ఉత్తమ్ బీడీ కంపెనీ
ఉత్తమ్ బీడీ కంపెనీ కార్మికుల వేతనాలు నుంచి కట్ చేసి పీఎఫ్ అకౌంట్లో జమ చేయాల్సిన మొత్తాన్ని చెల్లించని పరిస్థితి ఉంది. దాంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. రామాయంపేట కేంద్రంగా ఉన్న, ఉత్తమ్ బీడీ కంపెనీ గతంలో కూడా కార్మికులు తమ పీఎఫ్ డబ్బులను కంపెనీ కాజేస్తుందని ఆందోళనలు నిర్వహించిన సందర్బాలు ఉన్నాయి. దీనిపై అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో విచారణ జరిపి నిజమేనని తేలినా కంపెనీ యాజమాన్యంలో ఎలాంటి మార్పురాలేదు. పీఎఫ్ డబ్బులను కంపెనీ సరిగ్గా చెల్లించకపోవడంతో పదవీ విరమణ చేసిన (రాజీనామా చేసిన) కార్మికులకు ఇచ్చే పెన్షన్ కూడా కేవలం రూ.700 నుంచి వెయ్యి రూపాయలు మాత్రమే వస్తోంది. ఇది వారి రోజు వారి ఖర్చులకు ఏ మాత్రం సరిపోదు.
వేతనాలు సక్రమంగా చెల్లించాలి
మెదక్ జిల్లా వ్యాప్తంగా వేలాది కుటుంబాలు బీడీ చుట్టే పనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. కానీ రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చులు, స్థిరంగా లేని వేతనాలు, ప్రభుత్వం నుంచి తగిన మద్దతు లేకపోవడంతో బీడీ కార్మికుల జీవితం సంక్షోభంలో పడుతోంది. బీడీ కార్మికులకు ఇప్పటికీ సరైన కనీస వేతనం అందడం లేదు. వేల బీడీలు చుట్టినా దానికి తగిన వేతనాలు రాకపోవడం వల్ల రోజువారీ అవసరాలు కూడా తీరడం కష్టమవుతోంది. మధ్యవర్తుల ఆధీనంలో పని చేయాల్సి రావడం వల్ల కార్మికులు మరింతగా నష్టపోతున్నారు. అన్ని కంపెనీలు బీడీలు తయారు చేసి ఆకు నాణ్యతతో ఇవ్వకపోవడం వల్ల బీడీలు చేసేందుకు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఠాకూర్ కంపెనీతో పాటు చేగుంట, తార్బారు నిజాంపేట, శివాజీ, ఉత్తమ్, వాణి, తురారు, సాయిబాబా రామాయంపేటలో రెడ్డి బీడీ, తూప్రాన్, లోకల్ బీడీ కంపెనీలు వేతనాలు సరిగా ఇవ్వడం లేదు. వెంటనే పెండింగ్ వేతనాలు ఇవ్వాలి.
-బీడీ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు బాలమణి
బీడీ కార్మికుల వేతన వెతలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



