నవతెలంగాణ-హైదరాబాద్ : ఇద్దరు మహిళా అనుచరులపై లైంగికదాడి కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్కు మరోసారి పెరోల్ లభించింది. ఈసారి 21 రోజుల పాటు జైలు నుంచి బయట ఉండేందుకు అనుమతి ఇచ్చారు.
2017లో శిక్ష పడిన తర్వాత రామ్ రహీమ్ జైలు నుంచి బయటకు రావడం ఇది 17వసారి. ప్రస్తుతం హర్యానాలోని రోహ్తక్ సునారియా జైలులో ఉన్న అతడు, పెరోల్ సందర్భంగా సిర్సాలోని డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నాడు.
ఈ ఏడాది మే 26న అతడికి 30 రోజుల పెరోల్ మంజూరైంది. ఆ సమయంలో కూడా సిర్సా డేరా కేంద్రంలోనే ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో 40 రోజుల పెరోల్, 2025 ఆగస్టులో మరో 40 రోజుల పెరోల్ లభించింది. 2025 ఏప్రిల్లో 21 రోజుల ఫర్లో, అదే ఏడాది జనవరిలో 30 రోజుల పెరోల్ కూడా ఇచ్చారు.
పంజాబ్, హర్యానా, రాజస్థాన్తో పాటు పలు రాష్ట్రాల్లో డేరా సచ్చా సౌదాకు భారీ సంఖ్యలో అనుచరులు ఉన్నారు. హర్యానాలోని సిర్సా, ఫతేహాబాద్, కురుక్షేత్ర, కైతల్, హిసార్ జిల్లాల్లో ఈ సంస్థ ప్రభావం ఎక్కువగా ఉంది.
మరోవైపు 2002లో జర్నలిస్టు రామ్ చంద్ర ఛత్రపతి హత్య కేసులో రామ్ రహీమ్ను ఈ ఏడాది మార్చిలో పంజాబ్-హర్యానా హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో 2019లో సీబీఐ ప్రత్యేక కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను హైకోర్టు కొట్టివేసింది.



